
అలా మాట్లాడి ఓట్లడుగుతారా.. ఎంత ధైర్యం?
సస్రరాంలో విపక్షాలపై ప్రధాని మోదీ ఫైర్
ససరాం: బిహార్లో తొలి విడత ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. భాజపా, కాంగ్రెస్ హేమాహేమీలు ప్రచారం రంగంలోకి దూకడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ప్రధాని నరేంద్ర మోదీ సస్రరాంలో తొలి బహిరంగ సభలో ప్రసంగించారు. సీఎం నితీశ్తో కలిసి తొలిసారి వేదికను పంచుకున్న మోదీ ఆర్టికల్ 370 రద్దు అంశంపై విపక్షాలను టార్గెట్ చేస్తూ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఆర్టికల్ 370 రద్దు కోసం దేశంలో ప్రతి ఒక్కరూ ఎదురుచూశారని.. కానీ, అధికారంలోకి వస్తే మాత్రం దాన్ని తిరిగి పునరుద్ధరిస్తామంటూ విపక్ష నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘ఎన్డీయే ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. వాళ్లు మళ్లీ అధికారంలోకి వస్తే పునరుద్ధరిస్తామంటున్నారు. ఇలాంటి ప్రకటనలు చేసిన తర్వాత కూడా వాళ్లు బిహార్ నుంచి ఓట్లు అడిగే ధైర్యం సాహసం చేస్తున్నారు. ఇది బిహార్కు అవమానం కాదా? ఈ దేశ భద్రత కోసం బిహార్ తన పుత్రులు, పుత్రికలను సరిహద్దులకు పంపుతోంది’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.
జమ్మూకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని గతేడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని తొలుత సీఎం నితీశ్ కుమార్ వ్యతిరేకించారు. జేడీయూ ఎంపీలు కూడా పార్లమెంట్ ఉభయ సభల్లో వ్యతిరేకిస్తూ మాట్లాడారు. అనంతరం కొద్ది రోజుల్లోనే ఇది చట్టరూపం దాల్చిన నేపథ్యంలో దానికి మద్దతు తెలుపుతున్నట్టు జేడీయూ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా బిహార్లోని పలుచోట్ల ఎన్నికల ప్రసగంలో ఆర్టికల్ 370 రద్దు అంశాన్నే ప్రస్తావించారు. ఈ ఆర్టికల్ రద్దుతో ఇరత రాష్ట్రాల ప్రజలకు జమ్మూకశ్మీర్లో ఎక్కడైనా సొంత ఆస్తులు కలిగివుండే అవకాశం కలిగిందని పేర్కొన్నారు.