JP Nadda: అది జగన్‌ స్కీం కాదు.. నరేంద్ర మోదీది: జేపీ నడ్డా

దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను భాజపా కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు.

Updated : 06 Jun 2022 16:12 IST

విజయవాడ: దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను భాజపా కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. ఏపీ పర్యటనలో భాగంగా విజయవాడ చేరుకున్న ఆయన.. అక్కడ నిర్వహించిన భాజపా శక్తి కేంద్ర ప్రముఖుల సమ్మేళనంలో మాట్లాడారు.  రాష్ట్రంలో 46వేలకు పైగా పోలింగ్‌ బూత్‌లు ఉన్నాయని.. బూత్‌ల వారీగా ప్రజల వద్దకు పార్టీని తీసుకెళ్లాల్సిన బాధ్యత శక్తి కేంద్ర ప్రముఖులపై ఉందని చెప్పారు.

బూత్‌ కమిటీల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యమివ్వాలి..

భాజపా కార్యకర్తలతో బూత్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని.. కొత్త వారిని పార్టీలో చేర్చుకునే అంశంపై దృష్టిసారించాలని నడ్డా సూచించారు. బూత్‌ కమిటీల్లో అన్ని వర్గాల భాగస్వామ్యం ఉండేలా చూసుకోవాలన్నారు. భాజపా అన్ని వర్గాల పార్టీ అనే భావన వచ్చేలా పనిచేయాల్సిన బాధ్యత శక్తి కేంద్ర ప్రముఖులపై ఉంటుందని చెప్పారు. ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పేరుతో బృహత్తర ఆరోగ్య పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. దాన్నే ‘ఆరోగ్యశ్రీ’ పేరుతో జగన్‌ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని చెప్పారు. అది జగన్‌ స్కీం కాదని.. నరేంద్ర మోదీదని నడ్డా వ్యాఖ్యానించారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకంతో రూ.5లక్షల వరకు వైద్యసాయం అందుతున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని శ్రేణులకు నడ్డా సూచించారు. ఆయుష్మాన్‌ భారత్‌ ఎక్కడైనా పనిచేస్తుందని.. రాష్ట్రం దాటితే ఆరోగ్యశ్రీ పనికిరాదని వ్యాఖ్యానించారు. పీఎం కిసాన్‌ కింద ఏటా రూ.6వేలు రైతుల ఖాతాల్లో వేస్తు్న్నామని ఆయన గుర్తుచేశారు.

ప్రతి కార్యకర్తా ఇంటిపై పార్టీ జెండా ఎగరేయాలి..

ప్రతి భాజపా కార్యకర్త తమ ఇంటిపై పార్టీ జెండా ఎగురవేయాలని నడ్డా సూచించారు. మన్‌కీ బాత్‌ ద్వారా ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చే సందేశాన్ని బూత్‌ స్థాయిలో కార్యకర్తలంతా సామూహికంగా వీక్షించాలన్నారు. ఆ తర్వాత ప్రధాని సందేశాన్ని అక్కడి ప్రజలతో చర్చించి వారికి చేరవేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై రాష్ట్ర భాజపా పుస్తకం విడుదల చేసిందని.. అందులోని విషయాలు ప్రజలకు చేరవేసేందుకు శక్తి కేంద్ర ప్రముఖులు చొరవ చూపాలని నడ్డా కోరారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని