amit shah: కాంగ్రెస్‌, భారాస, మజ్లిస్‌ ఒక్కటే: కేంద్రమంత్రి అమిత్‌ షా

ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భాజపా బూత్‌ స్థాయి అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పాల్గొని  ప్రసంగించారు.

Updated : 15 Mar 2024 16:54 IST

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజల ఉత్సాహం చూస్తుంటే మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భాజపా బూత్‌ స్థాయి అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని  ప్రసంగించారు. మోదీని మూడోసారి ప్రధానిగా చేద్దామా. 400 ఎంపీ సీట్లను ఆయనకు కానుకగా ఇద్దామా.. అంటూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. 

‘‘ప్రస్తుతం దేశంలో ఎక్కడికి వెళ్లినా మోదీ నామస్మరణే. మజ్లిస్‌ అజెండాతోనే కాంగ్రెస్‌, భారాస పనిచేస్తాయి. కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా మజ్లిస్‌ భయపడుతోంది. కాంగ్రెస్‌, భారాస, మజ్లిస్‌.. మూడూ వారసత్వ పార్టీలే. అవి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలే చేస్తాయి. ఓబీసీల గురించి ఆ మూడు పార్టీలు ఎప్పుడైనా ఆలోచించాయా? కేవలం వారసుల సంక్షేమం గురించి మాత్రమే ఆలోచిస్తాయి. కాంగ్రెస్‌ పాలన అంతా కుంభకోణాల మయం. తెలంగాణ ప్రజలు భాజపాకు 12 ఎంపీ సీట్లు తగ్గకుండా ఇవ్వాలి. మోదీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ఏడాదికి రూ.6వేల చొప్పున వేస్తూ.. అండగా ఉంటోంది. వచ్చే ఐదేళ్లలో దేశమంతటా.. ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీరు ఇస్తాం. ఇప్పటికే 14 కోట్ల ఇళ్లకు మంచినీటి నల్లా కనెక్షన్లు ఇచ్చాం. పదేళ్ల యూపీఏ పాలనలో తెలంగాణకు రూ.1.17లక్షల కోట్లు మాత్రమే వచ్చాయి. మోదీ పాలనలో ఇప్పటికే రాష్ట్రానికి రూ.5లక్షల కోట్లు వచ్చాయి. భాజపా ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదు’’ అని వివరించారు. 

కాంగ్రెస్‌ నేతలు వసూళ్లకు పాల్పడుతున్నారు: కిషన్‌రెడ్డి

‘‘మోదీ నేతృత్వంలోనే దేశం ఎంతో అభివృద్ధి చెందింది. రాష్ట్ర అభివృద్ధికి మోదీ నిధులు కేటాయించారు. కేసీఆర్‌ కుటుంబం తెలంగాణను దోచుకున్నది. కేసీఆర్‌ నియంతృత్వ పాలనతో రాష్ట్రాన్ని ఎదగనివ్వలేదు. ఈసారి రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్లు భాజపా గెలవాలి. మజ్లిస్‌ పీడ తొలగాలని పాతబస్తీ వాసులు కోరుకుంటున్నారు. రాహుల్‌ గాంధీ, పార్లమెంట్‌ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ నేతలు తెలంగాణలోని బిల్డర్లు, కాంట్రాక్టర్లు, వ్యాపారుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు’’ అని కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు.

శ్రీరాముడి వారసుడే మా ప్రధాని అభ్యర్థి: బండి సంజయ్‌

‘‘శ్రీరాముడి వారసుడే మా ప్రధాని అభ్యర్థి. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాని అభ్యర్థి  ఎవరో ఇప్పటికీ చెప్పలేని పరిస్థితి. వంద రోజులు దాటిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి చుక్కలు కనిపిస్తాయి. ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటే రూ.5లక్షల కోట్ల బడ్జెట్‌ కావాలి. రేషన్‌కార్డు నిబంధన పెట్టి లబ్ధిదారులకు కోత పెడుతున్నారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ గురించి కాంగ్రెస్‌ నేతలు మాట్లాడటం లేదు. నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడి జైలుకు వెళ్లింది భాజపా కార్యకర్తలు. మా శ్రేణులు ఎప్పుడూ కుటుంబాల గురించి ఆలోచించలేదు’’ అని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని