Manipur Polls: భాజపా ఐదేళ్ల అభివృద్ధి వచ్చే 25 ఏళ్లకు పునాది: మోదీ

భాజపా ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వం గత ఐదేళ్లలో మణిపూర్ అభివృద్ధికి విశేషంగా పాటుపడిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు......

Published : 23 Feb 2022 01:26 IST

ఇంఫాల్‌: భాజపా ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వం గత ఐదేళ్లలో మణిపూర్ అభివృద్ధికి విశేషంగా పాటుపడిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ అభివృద్ధి వచ్చే 25 ఏళ్లకు పునాది వేసిందన్నారు. మణిపూర్​లోని హీంగాంగ్​లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని.. రాష్ట్రంలో భాజపా మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గతంలో పాలించిన కాంగ్రెస్‌లో విమర్శలు గుప్పించారు.

‘గత ఐదేళ్లలో రాష్ట్రంలో భాజపా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, సుపరిపాలన, అభివృద్ధిని మీరు చూశారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పాలించింది. కానీ ఆ సమయంలో అసమానతలే రాజ్యమేలాయి. బంద్​లు, దిగ్బంధాల నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేశాం. భాజపా ప్రభుత్వం అసాధ్యాలను సుసాధ్యం చేసింది’ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ నేతృత్వంలో రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం నూతన అధ్యాయాన్ని లిఖించిందన్నారు. కరోనా సమయంలోనూ భాజపా సర్కారు రాష్ట్రంలో సమర్థంగా చర్యలు చేపట్టిందని తెలిపారు.

రాష్ట్రంలో 10 మందిలో ఏడుగురికి ఉచిత రేషన్ అందుతోందని మోదీ అన్నారు. మణిపూర్‌ మహిళలు విదేశీ శక్తులకు వ్యతిరేకంగా పోరాడారాని సూచించారు. ఎన్​డీఏ ప్రభుత్వం మాత్రమే వారి సమస్యలను అర్థం చేసుకుందని, వారి జీవితాలను మెరుగుపర్చేందుకు ప్రయత్నించిందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 28, మార్చి 5న రెండు విడతల్లో మణిపూర్​ అసెంబ్లీ ఎన్నికలు  జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు విడుదల కానున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని