కన్నడ కేబినెట్‌లో కాంగ్రెస్‌, జేడీఎస్‌ రెబల్స్‌

కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు పూర్తయ్యింది. ఇచ్చిన హామీని నిలబెట్టుకుని కాంగ్రెస్‌, జేడీఎస్‌ రెబల్స్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించారు ముఖ్యమంత్రి యడియూరప్ప. ఇటీవల ఉప ఎన్నికల్లో గెలిచిన

Published : 06 Feb 2020 12:53 IST

పూర్తయిన మంత్రివర్గ విస్తరణ

బెంగళూరు: కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు పూర్తయ్యింది. ఇచ్చిన హామీని నిలబెట్టుకుని కాంగ్రెస్‌, జేడీఎస్‌ రెబల్స్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించారు ముఖ్యమంత్రి యడియూరప్ప. ఇటీవల ఉప ఎన్నికల్లో గెలిచిన 10 మంది శాసనసభ్యులను (వీరంతా కాంగ్రెస్‌, జేడీఎస్‌ పార్టీల నుంచి వచ్చిన వారే) కేబినెట్‌లోకి తీసుకున్నారు. కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం గురువారం రాజ్‌భవన్‌లో జరిగింది. గవర్నర్‌ వాజూభాయ్‌ వాలా వీరితో ప్రమాణం చేయించారు. దీంతో కేబినెట్‌లో మంత్రుల సంఖ్య 18కి(సీఎంతో కలిపి) చేరింది. యడియూరప్ప సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి మంత్రివర్గ విస్తరణ ఇదే.  

కొత్త మంత్రులు వీరే.. 

రమేశ్‌ జార్ఖిహొళి(గోకాక్‌), ఎస్‌.టి.సోమశేఖర్‌(యశ్వంతపుర), గోపాలయ్య(మహాలక్ష్మి లేఅవుట్‌), భైరతి బసవరాజు(కె.ఆర్‌.పుర), డా.కె.సుధాకర్‌(చిక్కబళ్లాపుర), బి.సి.పాటిల్‌(హిరేకరూరు), నారాయణగౌడ(కె.ఆర్‌.పేటె), శ్రీమంతపాటిల్‌(కాగవాడ), శివరామ్‌ హెబ్బార్‌(యల్లాపుర), ఆనంద్‌ సింగ్‌(విజయనగర)

రెబల్స్‌ తిరుగుబాటుతో గతేడాది జులైలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకుని మళ్లీ భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సీఎంగా యడియూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. అయితే అప్పటి నుంచి కేబినెట్‌ విస్తరణ ఆసక్తికరంగా మారింది. మంత్రివర్గంలో రెబల్స్‌కు చోటు కల్పించే అంశంపై యడియూరప్ప భాజపా అధిష్ఠానంతో పలుమార్లు సుదీర్ఘ చర్చలు జరిపారు. 

రెబల్స్‌తో పాటు ముగ్గురు భాజపా సీనియర్లను కూడా కేబినెట్‌లోకి తీసుకుంటామని ఇటీవల యడియూరప్ప ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో అధిష్ఠానం వద్దనడంతో సొంత పార్టీ నేతలను పక్కనబెట్టారు. కేవలం 10 మందిని మాత్రమే కేబినెట్‌లోకి తీసుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని