స్వతంత్రంగా పోటీచేసినా గెలుస్తానేమో

గత ఎన్నికల్లో తెదేపాతో పాటు ఇతర పార్టీల నుంచీ ఓట్లేస్తేనే తాను గెలిచానని, ప్రజలు ఆశీర్వదిస్తే స్వతంత్రంగా పోటీ చేసినా మళ్లీ గెలుస్తానేమోనని విజయవాడ పార్లమెంట్‌ సభ్యుడు కేశినేని నాని వ్యాఖ్యానించారు.

Published : 01 Jun 2023 08:20 IST

పిట్టల దొరలకు టికెట్‌ ఇచ్చినా నాకేం అభ్యంతరం లేదు
విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలు

మైలవరం, న్యూస్‌టుడే: గత ఎన్నికల్లో తెదేపాతో పాటు ఇతర పార్టీల నుంచీ ఓట్లేస్తేనే తాను గెలిచానని, ప్రజలు ఆశీర్వదిస్తే స్వతంత్రంగా పోటీ చేసినా మళ్లీ గెలుస్తానేమోనని విజయవాడ పార్లమెంట్‌ సభ్యుడు కేశినేని నాని వ్యాఖ్యానించారు. నమ్మిన ప్రజల కోసం పార్టీలకు అతీతంగా పని చేస్తున్నానని, సంకుచిత ఆలోచనలతోనే విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో పిట్టల దొర లాంటి వ్యక్తులకు టికెట్‌ ఇచ్చినా తనకేమీ అభ్యంతరం లేదన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా మైలవరంలోని ఎస్వీఆర్‌జీ నరసింహారావు హైస్కూల్‌కు ఎంపీ లాడ్స్‌ నిధులతో నిర్మించిన ప్రహరీని బుధవారం స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేశినేని చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. ఎయిర్‌ పోర్టులో తప్ప, కుటుంబ పనుల కోసం ఎంపీ పదవిని ఎప్పుడూ ఉపయోగించలేదన్నారు. తనకు ఏ పనైనా సాధించగల సత్తా ఉందన్నారు. రాష్ట్రంలో రాజకీయాలు లేవని, రెండు వేదికలకు నాయకులుగా ఉన్న చంద్రబాబు, జగన్‌ల మధ్యే వైరమని అభిప్రాయపడ్డారు. వేర్వేరు పార్టీల్లో ఉన్న ఎమ్మెల్యే, ఎంపీలు అభివృద్ధి పనుల విషయంలో కలిసి పనిచేయకూడదా అని ప్రశ్నించారు. తానేమీ శాశ్వతంగా ఎంపీ, ఎమ్మెల్యేగా ఉండిపోవాలనుకోవడం లేదని, 9 ఏళ్లలో సంతృప్తికరంగా సేవలందించానని ఆశాభావం వ్యక్తం చేశారు. మైలవరం జమీందారు విజ్ఞప్తి మేరకే పాఠశాలకు నిధులు కేటాయించానని, అభివృద్ధి పనుల కోసం ఎవరికైనా నిధులు ఇస్తానని ప్రకటించారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ.. ఎంపీ కుటుంబం, తమ కుటుంబాల మధ్య దీర్ఘకాలిక అన్యోన్యత ఉందని, రాజకీయం వేరు, కుటుంబ బంధాలు వేరని పేర్కొన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కోసం నానితో పాటు మరో ఎంపీ సుజనాచౌదరిని నిధులు అడిగానని వివరించారు. అనంతరం ద్వారకా తిరుమల ఛైర్మన్‌ ఎస్వీ సుధాకరరావు (ఎస్వీఎస్‌) కోటలో జరిగిన విందులో ఎంపీ, ఎమ్మెల్యే, ఇరు పార్టీలకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని