Priyank Kharge: పాత చట్టాలను ప్రక్షాళన చేస్తాం: ప్రియాంక్‌ ఖర్గే

గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను సమీక్షించి వాటిలో మార్పులు తీసుకొస్తామని, అవసరమైతే రద్దు చేస్తామని కర్ణాటక మంత్రి ప్రియాంక్‌ ఖర్గే (Priyank kharge) తెలిపారు.

Published : 26 May 2023 01:38 IST

దిల్లీ: అభివృద్ధికి ప్రతిబంధకంగా మారిన చట్టాలను, బిల్లులను, ప్రభుత్వ ఆదేశాలను సమీక్షించి మార్పులు చేస్తామని, అవసరమైతే వాటిని రద్దు చేస్తామని కర్ణాటక మంత్రి ప్రియాంక్‌ ఖర్గే (Priyank Kharge) అన్నారు. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 135 స్థానాల్లో విజయం సాధించి స్పష్టమైన మెజార్టీతో కాంగ్రెస్‌ (Congress) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ విజయాన్ని పురస్కరించుకొని దిల్లీలో నిర్వహించిన ఓ సమావేశంలో ప్రియాంక్‌ ఖర్గే మాట్లాడారు. గత ప్రభుత్వం తీసుకున్న ముస్లిం రిజర్వేషన్లు, హిజాబ్, మాతమార్పిడుల వ్యతిరేక చట్టం తదితర నిర్ణయాలపై సమీక్షించి సరైన మార్గాన్ని అనుసరిస్తామన్నారు.

‘‘ ఎలాంటి సందిగ్ధత లేకుండా చెబుతున్నా. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఏ బిల్లుగానీ, ప్రభుత్వ ఆదేశాలుగానీ, అధికారుల నిర్ణయాలుగానీ రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా మారితే వాటిని కచ్చితంగా ప్రక్షాళన చేస్తాం. అవసరమైతే వాటిని రద్దు చేస్తాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ప్రజలకు ఉపయోగపడని చట్టాలు, ప్రభుత్వ ఆదేశాలు ఎందుకు? వాటిలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని ప్రియాంక్‌ ఖర్గే అన్నారు.

ఎన్నికలకు ముందు నుంచే కాంగ్రెస్‌ అజెండా సుస్పష్టంగా ఉందన్న ప్రియాంక్‌ ఖర్గే.. కర్ణాటకను అభివృద్ధి చేయాలన్న దృఢసంకల్పంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో ఎలాంటి అవరోధాలు ఎదురైనా వాటిని తొలగించుకుంటూ వెళ్తామన్నారు. మరోవైపు విద్యా సంస్థల్లో హిజాబ్‌ నిషేధాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం రద్దు చేసే అవకాశం ఉందని పరోక్షంగా చెప్పారు. ‘‘ దాదాపు 18 వేల మంది చిన్నారులు బడులు ఎందుకు మానేశారు? ఇది నేను ఊరికే చెప్పడం లేదు. గణాంకాల ఆధారంగానే మాట్లాడుతున్నా. హిజాబ్‌ వల్లనే వాళ్లంతా పాఠశాలలకు రావడం లేదని చెప్పను.. కానీ, చిన్నారులందరికీ సరైన విద్యను అందించడమే ప్రభుత్వ ముఖ్య బాధ్యత. ఈ ప్రక్రియను నిరోధిస్తున్న కొన్ని చట్టాలున్నాయి. ఆ అడ్డంకులను తొలగించడం నా బాధ్యత కాదా?’’ అని ప్రియాంక్‌ ఖర్గే వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని