
Ap News: ఈనెలాఖరు వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలి: నాదెండ్ల
అమరావతి: కరోనా థర్డ్ వేవ్ ఆందోళనకరంగా ఉన్నా.. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణపై ముఖ్యమంత్రికి దూరదృష్టి లేదని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. విద్యాసంస్థలను కనీసం ఈనెలాఖరు వరకు మూసివేస్తేనే విద్యార్థులను ఈ వైరస్ బారి నుంచి కాపాడుకోగలమన్నారు. కేసులు పెరిగితే చూద్దామని చెప్పడం విద్యాశాఖమంత్రి బాధ్యతా రాహిత్యాన్ని తెలియజేస్తోందని మండిపడ్డారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వానికి ఏమాత్రం బాధ్యత లేదనే విషయం ఆర్థమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే విద్యా సంస్థలను మూసివేసి ఆన్లైన్ విధానంలో తరగతుల నిర్వహణపై మార్గదర్శకాలు ఇచ్చాయని గుర్తు చేశారు.
తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లోనూ వ్యాక్సిన్ అందిస్తున్నప్పటికీ విద్యార్థుల క్షేమం కోసం సెలవులు పొడిగించాయని పేర్కొన్నారు. జాగ్రత్తలు తీసుకునే వైద్య కళాశాలల్లోని విద్యార్థులే కొవిడ్ బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా సంస్థలు తెరవాలి, పరీక్షలు నిర్వహించాలనే మొండి ధోరణి విడిచిపెట్టి విద్యార్థుల సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని హితవు పలికారు.