Rahul Gandhi: కోలార్‌ నుంచే రాహుల్ ప్రచారం .. దానికో కారణముంది..!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) ..కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. పరువు నష్టం కేసులో  జైలుశిక్ష పడిన నేపథ్యంలో ఆయన ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి ప్రత్యేక కారణముంది. 

Published : 29 Mar 2023 20:16 IST

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఆ రాష్ట్రంలో భాజపాను గద్దె దించి, కాంగ్రెస్ అధికారంలో రావాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో హస్తం పార్టీ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఏప్రిల్ ఐదు నుంచి కోలార్‌లో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అయితే ఆయన ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి ఒక కారణముంది. 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ ఇంటిపేరును ఉద్దేశించి రాహుల్ వ్యాఖ్యలు చేసింది ఇక్కడే కావడం గమనార్హం. ఇది భాజపా ఆగ్రహానికి దారితీసింది. ఇది ఓ వర్గాన్ని కించపరిచినట్లు కమలం పార్టీ పరిగణించింది. దాంతో గుజరాత్‌లో కేసు నమోదైంది. ఆ పరువునష్టం కేసులో ఇటీవల సూరత్ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ వెంటనే  ఆయన పార్లమెంట్‌ సభ్యత్వాన్ని కోల్పోయారు. అధికార భాజపా తీరుకు నిరసనగా ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 

దక్షిణాది రాష్ట్రం కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Election) షెడ్యూల్‌ ఖరారైంది. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) ఈ రాష్ట్రానికి శాసనసభ ఎన్నికల తేదీలను ప్రకటించింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 10వ తేదీన పోలింగ్‌ జరగనుంది. మే 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ కోలార్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన వరుణ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

రాహుల్ జైలుశిక్షపై పైకోర్టుకు..!

పరువు నష్టం కేసులో సూరత్ న్యాయస్థానం విధించిన జైలుశిక్షపై కాంగ్రెస్(Congress) పై కోర్టును ఆశ్రయించనున్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు పిటిషన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే సవాలు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ రివ్యూ పిటిషన్‌పై పార్టీకి చెందిన న్యాయసలహాదారులు అన్ని మార్గాలను పరిశీలిస్తున్నారని, ఒకట్రెండు రోజుల్లో దీనిని దాఖలు చేసే అవకాశం ఉందని చెప్పాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని