దిల్లీపైనే ఒత్తిడి.. కానీ..!

టీ20లీగ్‌ 13వ సీజన్‌లో అంతిమ పోరాటానికి దుబాయ్‌ సిద్ధమైంది. రోహిత్‌శర్మ సారథ్యంలోని డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఆరోసారి ఫైనల్‌కు చేరింది. ఈరోజు రాత్రి 7.30గంటలకు యువసంచలనం దిల్లీతో టైటిల్‌ పోరుకు సిద్ధమైంది.

Published : 10 Nov 2020 11:19 IST

టీ20లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమంటున్న హిట్‌మ్యాన్‌

దుబాయ్‌: టీ20 లీగ్‌ 13వ సీజన్‌లో అంతిమ పోరాటానికి దుబాయ్‌ సిద్ధమైంది. రోహిత్‌శర్మ సారథ్యంలోని డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఆరోసారి ఫైనల్‌కు చేరింది. ఈరోజు రాత్రి 7.30గంటలకు యువసంచలనం దిల్లీతో టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. నాలుగు సార్లు ట్రోఫీని ముద్దాడిన ముంబయి జట్టు ఈ మ్యాచ్‌లో హాట్‌ ఫేవరేట్‌గా కనిపిస్తోంది. అయితే, ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు ముంబయి కెప్టెన్‌ రోహిత్‌శర్మ తమ సన్నద్దత గురించి మాట్లాడాడు. దిల్లీపైనే ఒత్తిడి ఉందంటూనే.. టీ20లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం.. ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయమని అంటున్నాడు.
జట్టు ఏ ఒక్కరిపై ఆధారపడదు
‘‘మేం టోర్నీ మొదటి నుంచి చెప్తున్న మాట ‘జట్టు ఏ ఒక్కరిపై ఆధారపడదు’. అదే ముంబయి జట్టు ప్రత్యేకత. జట్టులో ఏ ఒక్కరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ల రికార్డులే వాళ్ల ప్రతిభ గురించి మాట్లాడతాయి. ఈ సీజన్‌లో సూర్యకుమార్‌ ప్రదర్శన అద్భుతం. అలాంటి బ్యాట్స్‌మెన్‌ క్రీజులో ఉంటే నాన్‌స్ట్రైకర్‌‌పై ఒత్తిడి ఉండదు. జట్టు ఎన్ని వికెట్లు కోల్పోయిందన్న విషయాన్ని సూర్యకుమార్‌ పట్టించుకోడు. తన శైలిని నమ్ముకొని బ్యాటింగ్‌ చేస్తాడు. అతను నిలకడగా రాణిస్తున్నాడు. అది జట్టుకు శుభపరిణామం. ఇషాన్‌కిషన్‌ సులభంగా సిక్సర్లు, ఫోర్లు కొడుతూ ఈ సీజన్‌లో బాగా రాణించాడు. మిడిల్‌ ఓవర్లలో రాహుల్‌ వికెట్లు తీస్తున్నాడు’’ అని రోహిత్‌ అన్నాడు.
ఫైనల్‌లో సర్‌ప్రైజ్‌లు ఉంటాయి
‘‘ఫైనల్‌ మ్యాచ్‌కు జట్టులో మార్పులు ఉంటాయి. అది అభిమానులకు సర్‌ప్రైజ్‌లాంటిది. వాళ్ల జట్టులో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ ఉన్నారు. వాళ్లను కట్టడి చేయాలంటే అందుకు తగ్గట్లుగా మా బౌలింగ్‌లో మార్పులు తప్పనిసరి. జయంత్‌యాదవ్‌ మాకొక మంచి వనరు. లీగ్‌ స్థాయిలో దిల్లీతో ఆడిన మ్యాచ్‌లో అతను‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. అతను కూడా జట్టులో ఉండే అవకాశం ఉంది. గాయంతో బాధపడుతున్న ట్రెంట్‌బౌల్ట్‌ జట్టులో ఉంటాడా లేదా అనేది వేచి చూడాలి. అతను జట్టు కోసం ఎన్నో మంచి ప్రదర్శనలు ఇచ్చాడు. మరోసారి ప్రతిభ నిరూపించుకుంటాడని ఆశిస్తున్నాం’ అని రోహిత్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.
దిల్లీపైనే ఒత్తిడి..
‘‘ఈ సీజన్‌లో దిల్లీతో జరిగిన మూడు మ్యాచుల్లోనూ మేం విజయం సాధించాం. ఆ ఫలితాలు దిల్లీ జట్టుపై ఒత్తిడి పెంచే అవకాశం లేకపోలేదు. కానీ.. ఇది టీ20. ప్రతి మ్యాచ్‌ ప్రత్యేకం. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. కేవలం ఒకేఒక్క ఆటగాడు మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేయవచ్చు. దిల్లీని తక్కువ అంచనా వేయబోం. అన్ని విభాగాల్లో రాణిస్తే ఐదో ట్రోఫీ ముంబయి ఖాతాలో చేరుతుందనడంలో అనుమానం లేదు. టాస్‌ గెలవడం ఈ మ్యాచ్‌లో కీలకమని నా ఉద్దేశం. ఏదేమైనా మా దృష్టి మొత్తం మ్యాచ్‌లో మంచి ప్రదర్శన ఇవ్వడంపైనే ఉంటుంది’ అని ముంబయి సారథి పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని