ICC Test Rankings: ఐసీసీ ర్యాంకులు.. దూసుకొచ్చిన అజింక్య రహానె.. టాప్‌లోనే అశ్విన్‌

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో (WTC Final) భారత్ ఓటమి చెందినప్పటికీ.. మిడిలార్డర్‌ బ్యాటర్‌ అజింక్య రహానె మాత్రం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ముందుడుగు వేశాడు. బౌలింగ్‌ విభాగంలో సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్‌దే అగ్రస్థానం.

Published : 14 Jun 2023 16:24 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో భారత మిడిలార్డర్‌ బ్యాటర్ అజింక్య రహానె దూసుకొచ్చాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో (WTC Final) ఆసీస్‌పై కీలక ఇన్నింగ్స్‌లు ఆడటంతో ఏకంగా 37వ స్థానంలోకి దూసుకొచ్చాడు. అలాగే హాఫ్ సెంచరీ సాధించిన శార్దూల్‌ ఠాకూర్‌ ఆరు స్థానాలను మెరుగుపర్చుకుని 94వ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. టాప్‌ -10లో తొలి మూడు స్థానాలు ఆసీస్‌ బ్యాటర్లవే కావడం విశేషం. లబుషేన్ (903 పాయింట్లు), స్టీవ్‌ స్మిత్ (885 పాయింట్లు), ట్రావిస్‌ హెడ్ (884 పాయింట్లు) వరుసగా తొలి మూడు ర్యాంకులను సొంతం చేసుకున్నారు. భారత్‌ తరఫున రిషభ్‌ పంత్ (758) మాత్రమే పదో స్థానంతో టాప్‌-10లో ఉన్నాడు. రోహిత్ శర్మ 12వ ర్యాంకు, విరాట్ కోహ్లీ 13వ ర్యాంక్‌కు దిగజారిపోయారు.

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆడకపోయినప్పటికీ బౌలర్ల విభాగంలో రవిచంద్రన్ అశ్విన్‌ (860 పాయింట్లు) తన తొలి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. జేమ్స్‌ అండర్సన్ (850), పాట్ కమిన్స్‌ (829) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. అయితే, డబ్ల్యూటీసీ ఫైనల్‌ రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన నాలుగు వికెట్లు తీసిన ఆసీస్‌ బౌలర్‌ నాథన్ లైయన్ (777 పాయింట్లు) ఒక ర్యాంక్‌ను మెరుగుపర్చుకుని ఓలీ రాబిన్‌సన్‌తో కలిసి సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచాడు. ఇక ఈ విభాగంలో బుమ్రా (772) రెండు స్థానాలను కోల్పోయి 8వ స్థానంలోకి పడిపోయాడు. రవీంద్ర జడేజా (765) యథావిధిగా 9వ స్థానంలోనే ఉన్నాడు.

స్మిత్‌ను అధిగమించిన బాబర్

టెస్టు ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్‌ కెప్టెన్ బాబర్‌ అజామ్ (862 పాయింట్లు) ఒక ర్యాంక్‌ కిందికి దిగజారి ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, టెస్టుల్లో విరాట్ కోహ్లీ, స్టీవ్‌ స్మిత్‌ను ఓ విషయంలో మాత్రం అధిగమించాడు. గత 20 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక యావరేజ్‌ సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. బాబర్ 69.10 సగటుతో పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు శతకాలు, 8 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఇక స్టీవ్‌ స్మిత్‌ గత 30 ఇన్నింగ్స్‌ల్లో  55.40 సగటుతో పరుగులు రాబట్టాడు. అదే ఇంగ్లాండ్‌ ఆటగాడు జో రూట్ గత 34 ఇన్నింగ్స్‌ల్లో 54.20, ఏంజెలో మ్యాథ్యూస్‌ గత 16 ఇన్నింగ్స్‌ల్లో 48.40, విరాట్ కోహ్లీ గత 27 ఇన్నింగ్స్‌ల్లో 34.65 సగటుతోనే పరుగులు సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని