T20 WC 2024: పొట్టి కప్‌ కోసం భారత స్క్వాడ్‌ ప్రకటన అప్పుడే.. కుర్రాళ్లలో ఎవరికి ఛాన్స్?

క్రికెట్ అభిమానులకు వరుసగా మ్యాచ్‌లతో పండగే. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత.. టీ20 ప్రపంచ కప్‌ వచ్చేయనుంది. ఇక జట్టులోకి ఎవరు వస్తారనేది అందరిలోనూ చర్చ మొదలైంది.

Published : 09 Apr 2024 17:47 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రస్తుతం ఐపీఎల్ సందడి కొనసాగుతోంది. ఈ మెగా లీగ్‌ ముగిసిన ఐదు రోజుల్లోనే టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) వచ్చేయనుంది. జూన్ 1 నుంచి పొట్టి కప్ సంబరం మొదలు కానుంది. విండీస్ - యూఎస్‌ఏ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇంకా ఏ దేశమూ తమ జట్టును ప్రకటించలేదు. రోహిత్ శర్మ నాయకత్వంలోనే టీమ్‌ఇండియా బరిలోకి దిగుతుందని ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రకటించిన సంగతి తెలిసిందే. గత వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా రన్నరప్‌గా నిలిచింది. దాదాపు పదేళ్ల నుంచి ఐసీసీ ట్రోఫీ కోసం భారత్‌కు నిరీక్షణ తప్పడం లేదు. ఈసారైనా ఆ లోటును పూరించాలని అభిమానులు కోరుతున్నారు. 

ఈక్రమంలో భారత జట్టు ప్రకటనపై పలు కథనాలు వస్తున్నాయి. 15 మందితో కూడిన జట్టును మరో రెండు వారాల్లో బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసే అవకాశం ఉందని సమాచారం. అప్పటికి ఐపీఎల్‌లో దాదాపు సగం మ్యాచ్‌లు ముగుస్తాయి. ప్లేయర్ల ఫామ్‌, ఫిట్‌నెస్‌ను పరిగణనలోకి తీసుకొని జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ప్రతీ దేశం మే 1 నాటికి ప్రాబుబల్స్‌ను ఐసీసీ కమిటీకి పంపించాలి. ఆ తర్వాత మే 25 వరకు అందులో ఏమైనా మార్పులు ఉంటే చేసుకోవడానికి ఆయా బోర్డులకు ఛాన్స్‌ ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల ప్రకారం స్క్వాడ్‌లో సీనియర్లకే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రెండు లేదా మూడు మార్పులు మాత్రమే ఉండనున్నాయి. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఫాస్టెస్ట్‌ బౌలర్‌గా మారిన మయాంక్‌ యాదవ్‌ను జట్టులోకి తీసుకోవచ్చని క్రికెట్ విశ్లేషకుల అంచనా. అతడు ఫిట్‌గా ఉండటమూ చాలా కీలకం. దాదాపు 15 నెలల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన రిషభ్‌ పంత్‌తోపాటు రింకు సింగ్‌, యశస్వి జైస్వాల్ అవకాశం దక్కనుంది. 

భారత జట్టు (అంచనా): 

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్‌ యాదవ్, హార్దిక్‌ పాండ్య, రిషభ్‌ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్/చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, షమీ, సిరాజ్/ మయాంక్‌ యాదవ్.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని