IPL 2022 Auction: ధరల్లో హెచ్చుతగ్గులైనా.. మళ్లీ సొంతగూటికే!

ఐపీఎల్‌ వేలంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఏ ఆటగాడిని.. ఏ ఫ్రాంఛైజీ.. ఎంత మొత్తానికి తీసుకుంటుందో అర్థం కాదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొన్ని జట్లు...

Updated : 12 Feb 2022 16:36 IST

ఐపీఎల్‌ వేలంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఏ ఆటగాడిని.. ఏ ఫ్రాంఛైజీ.. ఎంత మొత్తానికి తీసుకుంటుందో అర్థం కాదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొన్ని జట్లు తమ పాత ఆటగాళ్లను తిరిగి తీసుకునేందుకు ఆసక్తి చూపుతాయి. అలా ఈసారి కూడా ఇప్పటివరకు కొన్ని జట్లు తాము వదిలేసుకున్న ప్లేయర్లను కొనుగోలు చేశాయి. అందులో కమిన్స్‌ ధర సగానికి పడిపోగా హర్షల్‌ పటేల్‌ ధర అనూహ్యంగా పెరిగింది. ఈ జాబితాలో మరి కొందరు ఆటగాళ్లు కూడా ఉన్నారు.

* సగానికి పడిపోయిన కమిన్స్‌

ఆస్ట్రేలియన్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ ఈసారి తిరిగి కోల్‌కతా జట్టులో చేరాడు. 2020 వేలంలో ఆ జట్టు అతడిని రూ.15.5 కోట్లకు భారీ మొత్తానికి కొనుగోలు చేయడంతో రికార్డు నెలకొల్పాడు. అప్పటివరకు విదేశీ ఆటగాళ్లలో ఇంత మొత్తం దక్కించుకున్న ఆటగాడిగా కమిన్స్‌ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. అయితే, ఈసారి మాత్రం ఆ ధరలో సగానికి పడిపోయాడు. కమిన్స్‌ కోసం ఈ మెగా వేలంలో ఇతర జట్లు పెద్దగా ఆసక్తి చూపకపోగా కోల్‌కతానే తిరిగి రూ.7.25 కోట్లకు కొనుగోలు చేసింది.

* పంట పడించుకున్న హర్షల్‌ పటేల్‌

టీమ్‌ఇండియా యువ పేసర్‌ హర్షల్‌ పటేల్‌ను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు భారీ మొత్తం వెచ్చించి తిరిగి దక్కించుకుంది. గతేడాది హర్షల్‌ మొత్తం 32 వికెట్లు పడగొట్టి పర్పుల్‌ క్యాప్‌ విన్నర్‌గా నిలిచాడు. అయితే, వేలానికి ముందు వదిలేసుకున్న ఆర్సీబీ తిరిగి ఈ మెగా వేలంలో రూ.10.75 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. 2018లో హర్షల్‌ను కనీస ధర రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన దిల్లీ క్యాపిటల్స్‌ గతేడాది ట్రేడింగ్‌ పద్ధతిలో బెంగళూరుకు వదిలేసింది. దీంతో ఆ జట్టు తరఫున రాణించిన హర్షల్‌ ఇప్పుడు రికార్డు ధరతో పంట పడించుకున్నాడు.

* నితీశ్‌ రాణా మంచి ధరే

(Photo: Nitish Rana Instagram)

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ప్రధాన ఓపెనర్‌ నితీశ్‌ రాణా కూడా తిరిగి సొంత గూటికి చేరుకున్నాడు. కొన్నేళ్లుగా ఆ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతూ నిలకడైన ప్రదర్శన చేస్తున్న ఈ లెఫ్ట్‌హ్యాండ్‌ బ్యాట్స్‌మన్‌ను ఈసారి ఆ జట్టు వదిలేసింది. ఈ క్రమంలోనే మెగా వేలంలో రూ.1 కోటి కనీస ధరకు నమోదు చేసుకోగా ఆ జట్టు  ఈసారి రూ. 8 కోట్లకు తిరిగి సొంతం చేసుకుంది. 2015లో తొలిసారి ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ తరఫున అడుగుపెట్టిన అతడు 2017 వరకు ఆ జట్టులోనే కొనసాగాడు. ఇక 2018 నుంచి కోల్‌కతాలో రాణిస్తూ ఏటా 300 పైచిలుకు పరుగులు చేస్తున్నాడు. దీంతో అతడిపై నమ్మకం ఉంచిన కోల్‌కతా తిరిగి సొంతం చేసుకుంది.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈసారి మెగా వేలంలో ఇప్పటివరకు ఇద్దరు ఆటగాళ్లని తిరిగి కొనుగోలు చేసింది. అందులో వెస్టిండీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో ఒకరు కాగా, మరొకరు రాబిన్‌ ఉతప్ప. బ్రావో చాలా ఏళ్లుగా ఆ జట్టులో కొనసాగుతున్నా.. ఉతప్ప గతేడాదే చెన్నై జట్టులో చేరాడు. అయితే, వీరిద్దరినీ వేలానికి ముందు వదిలేసుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ మళ్లీ కొనుగోలు చేయడం విశేషం. బ్రావో గతేడాది రూ.4.40 కోట్లు దక్కించుకోగా ఈసారి కాస్త పెరిగి రూ.6.40 కోట్లకు సొంత గూటికి చేరాడు. మరోవైపు ఉతప్ప గతేడాది లాగే ఈసారి కూడా కనీస ధర రూ.2 కోట్లకే అదే జట్టు చెంతకు చేరాడు.

-ఇంటర్నెట్‌డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని