IPL 2022: ఐపీఎల్‌లో ఉత్కంఠ రేపిన ముంబయి x చెన్నై మ్యాచ్‌లు ఇవే

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లు ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌. ఈ రెండు పోటీపడుతున్నాయంటే అభిమానులకు పండగే. ఇప్పటికే ముంబయి ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలవగా...

Published : 20 Mar 2022 10:19 IST

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లు ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌. ఈ రెండు పోటీపడుతున్నాయంటే అభిమానులకు పండగే. ఇప్పటికే ముంబయి ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలవగా.. చెన్నై నాలుగు సార్లు ఆ ఘనత సాధించింది. దీంతో ఈసారి కూడా తమ రికార్డులను మరింత మెరుగు పర్చుకోవాలని రెండు జట్లూ భావిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో 15వ సీజన్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు వీటి మధ్య జరిగిన ఆసక్తికరమైన, ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లను ఓసారి గుర్తు చేసుకుందాం.

హర్భజన్‌ మాయాజాలం‌..

తొలిసారి ఇరు జట్ల మధ్య ఆసక్తికరమైన పోరు జరిగింది 2011లో. హర్భజన్‌ మాయాజాలంతో ఆరోజు ముంబయి విజయం సాధించినా చివరి ఓవర్‌ వరకూ మ్యాచ్‌ ఉత్కంఠగా సాగింది. తొలుత రోహిత్‌ శర్మ (87; 48 బంతుల్లో 8x4, 5x6) భారీ ఇన్నింగ్స్‌ ఆడడంతో ముంబయి 164/4 స్కోర్‌ చేసింది. ఛేదనలో బద్రీనాథ్‌ (71 నాటౌట్‌; 48 బంతుల్లో 7x4, 2x6) ఒంటరి పోరాటం చేసినా మరో ఎండ్‌ నుంచి సరైన సహకారం లభించలేదు. మధ్యలో హర్భజన్‌ 5 వికెట్లతో చెలరేగి చెన్నై నడ్డి విరిచాడు. అయితే, చివరివరకూ బద్రీనాథ్‌ క్రీజులో ఉండడంతో చెన్నై ఆశలు వదులుకోలేదు. కానీ, ఆఖరి ఓవర్‌లో 25 పరుగులు చేయాల్సిన స్థితిలో 16 పరుగులే చేసి చివరికి 156/9తో నిలిచింది. అలా ముంబయి 8 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది.

సచిన్‌, రోహిత్‌ కొట్టకపోతే..

మరుసటి ఏడాదే మరో రసవత్తరమైన పోరు జరిగింది. ఇది ఆఖరి బంతివరకూ ఉత్కంఠగా సాగడం విశేషం. ఓటమి తప్పదనుకున్న ముంబయి ఊహించని విజయం సాధించింది. చెన్నై తొలుత బ్యాటింగ్‌ చేసి 173/8 భారీ స్కోర్‌ చేసింది. టాప్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ మురళీ విజయ్‌ (41), సురేశ్‌ రైనా (36), డ్వేన్‌ బ్రావో (40), మహేంద్రసింగ్‌ ధోనీ (25) దంచికొట్టారు. అనంతరం ఛేదనకు దిగిన ముంబయి అతికష్టం మీద గెలిచింది. ఆదిలోనే తొలి వికెట్‌ కోల్పోయిన ఆ జట్టును సచిన్‌ తెందూల్కర్‌ (74; 44 బంతుల్లో 11x4, 1x6), రోహిత్‌ శర్మ (60; 46 బంతుల్లో 6x4, 2x11) ఆదుకున్నారు. అయితే, చివరి నాలుగు ఓవర్లలో ఆ జట్టు వరుసగా ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. చివరి ఓవర్‌లో 16 పరుగులు చేయాల్సి ఉండగా ధోనీ బంతిని హిల్ఫెనాస్‌కు ఇచ్చాడు. అతడు తొలి మూడు బంతుల్లో 1 వికెట్ తీసి రెండు పరుగులే ఇవ్వడంతో చెన్నై విజయం ఖాయమనుకున్నారు. కానీ, డ్వేన్‌ స్మిత్‌ (24; 9 బంతుల్లో 2x4, 2x6) ఆఖరి మూడు బంతుల్లో ఒక సిక్సర్‌, రెండు ఫోర్లు బాదడంతో ముంబయి విజయం సాధించింది.

ధోనీని ఔట్‌ చేసిన మునాఫ్‌..

అలాగే 2013లో మరో చెప్పుకోదగ్గ మ్యాచ్‌ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 148/6 పరుగుల మోస్తరు స్కోర్‌ చేసింది. పొలార్డ్‌ (57; 38 బంతుల్లో 4x4, 5x6) అర్ధ శతకంతో రాణించగా.. దినేశ్‌ కార్తీక్‌ (37; 25 బంతుల్లో 4x4, 1x6), హర్భజన్‌ (21; 21 బంతుల్లో 1x4, 1x6) తమవంతు పరుగులు చేశారు. లక్ష్యం పెద్దది కాకపోవడంతో చెన్నై విజయం సాధిస్తుందనే నమ్మకం ఉన్నా పరిస్థితులు తలకిందులయ్యాయి. 66కే ఐదు వికెట్లు కోల్పోయి ఆ జట్టు ఇబ్బందుల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ ధోనీ (51; 26 బంతుల్లో 5x4, 3x6) ధనాధన్‌ బ్యాటింగ్‌ చేశాడు. టెయిలెండర్లతో కలిసి మ్యాచ్‌ను గెలిపించినంత పనిచేశాడు. అయితే, చివరి ఓవర్‌లో 12 పరుగులే చేయాల్సిన స్థితిలో ధోనీ ఔటయ్యాడు. మునాఫ్ పటేల్‌ వేసిన తొలి బంతికి పెవిలియన్‌ చేరాడు. ఆపై చెన్నై మరో రెండు పరుగులే చేసి 139/9తో సరిపెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో ముంబయి 8 పరుగులతో అనూహ్య విజయం సాధించింది.

బ్రావో కొట్టినా జాధవ్ గెలిపించాడు..

ఇక 2018లో సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లోనే ముంబయిపై చెన్నై అదిరిపోయే విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి 165/4 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (40), సూర్యకుమార్‌ (43)కు తోడు హార్దిక్‌ పాండ్య (22), కృనాల్‌ పాండ్య (41) రాణించారు. అయితే, ఛేదనలో చెన్నై కూడా తడబడింది. 75కే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమివైపు పయనిస్తోంది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన డ్వేన్‌ బ్రావో (68; 30 బంతుల్లో 3x4, 7x6) విరోచితంగా బ్యాటింగ్‌ చేశాడు. అతడికి కేదార్‌ జాధవ్‌ (24; 22 బంతుల్లో 1x4, 2x6) సహకరించాడు. ఇక 19వ ఓవర్‌ చివరి బంతికి బ్రావో కూడా ఔటవ్వడంతో చెన్నై స్కోర్‌ 159/9గా నమోదైంది. ఆఖరి ఓవర్‌లో ముంబయి గెలవాలంటే ఒక్క వికెట్ కావాలి. చెన్నై విజయానికి 7 పరుగులు కావాలి. ఈ నేపథ్యంలోనే ముస్తాఫిజుర్‌ వేసిన చివరి ఓవర్‌ తొలి మూడు బంతులు వదిలేసిన జాధవ్‌ నాలుగో బంతిని సిక్సర్‌, ఐదో బంతిని బౌండరీకి తరలించి మ్యాచ్‌ను గెలిపించాడు.

ఆఖరి బంతికి మలింగ మాయ..

చివరిసారి రెండు జట్ల మధ్య అత్యంత ఉత్కంఠగా సాగింది 2019 ఫైనల్‌ మ్యాచ్‌. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి 149/8 స్కోర్‌ చేసింది. పొలార్డ్‌ (41; 25 బంతుల్లో 3x4, 3x6) ఒక్కడే చెపుకోదగ్గ స్కోర్‌ చేశాడు. దీంతో చెన్నై విజయం నల్లేరుమీద నడకే అనిపించింది. కానీ, ఛేదనలో చెన్నై మరోసారి తడబడింది. ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌ (80; 59 బంతుల్లో 8x4, 1x6) భారీ ఇన్నింగ్స్‌ ఆడినా మిగతా బ్యాట్స్‌మెన్‌ పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలోనే ఆ జట్టు 19 ఓవర్లకు 141/5తో నిలిచింది. అప్పటికి క్రీజులో జడేజా (4), వాట్సన్‌(76) ఉండటంతో చెన్నై గెలుస్తుందని అనుకున్నారు. కానీ మలింగ మాయ చేశాడు. తొలి మూడు బంతులకు నాలుగు పరుగులే ఇచ్చాడు. అయితే, నాలుగో బంతికి రెండు పరుగుల కోసం యత్నించి వాట్సన్‌ రనౌటయ్యాడు. దీంతో చివరి రెండు బంతుల్లో చెన్నై విజయానికి 4 పరుగులు అవసరమైంది. శార్ధూల్‌ ఠాకూర్‌(2) ఐదో బంతికి 2 పరుగులు తీశాడు. ఆరో బంతికి ఫ్లిక్‌షాట్‌ ఆడేందుకు చూసిన అతడు ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. దీంతో చెన్నై 148/7 స్కోర్‌తో నిలిచి 1 పరుగు తేడాతో ఓటమిపాలైంది. ముంబయి ఆఖరి బంతికి ఊహించని విజయం అందుకుంది.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని