IPL 2022: సూపర్‌ అనిపిస్తుందా?

కెప్టెన్‌.. వికెట్‌ కీపర్‌.. ఓపెనర్‌.. ఇలా మూడు రకాలుగా ఉపయోగపడే ఆటగాడు ఓ వైపు.. బ్యాటింగ్‌, బౌలింగ్‌తో అదరగొట్టే ఆల్‌రౌండర్‌ మరోవైపు.. మణికట్టుతో మాయ చేస్తున్న స్పిన్నర్‌ ఇంకోవైపు.. ఇలా మెగా వేలానికి ముందే ముగ్గురు కీలక ఆటగాళ్లను సొంతం చేసుకున్న లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ ఐపీఎల్‌ అరంగేట్రంలో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. క్షణాల్లో మ్యాచ్‌ ఫలితాన్ని మార్చగలిగే ఆల్‌రౌండర్లపై దృష్టి పెట్టి.. చేతిలో ఉన్న డబ్బునంతా

Updated : 17 Mar 2022 06:58 IST

ఐపీఎల్‌-15మరో 9 రోజుల్లో

కెప్టెన్‌.. వికెట్‌ కీపర్‌.. ఓపెనర్‌.. ఇలా మూడు రకాలుగా ఉపయోగపడే ఆటగాడు ఓ వైపు.. బ్యాటింగ్‌, బౌలింగ్‌తో అదరగొట్టే ఆల్‌రౌండర్‌ మరోవైపు.. మణికట్టుతో మాయ చేస్తున్న స్పిన్నర్‌ ఇంకోవైపు.. ఇలా మెగా వేలానికి ముందే ముగ్గురు కీలక ఆటగాళ్లను సొంతం చేసుకున్న లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ ఐపీఎల్‌ అరంగేట్రంలో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. క్షణాల్లో మ్యాచ్‌ ఫలితాన్ని మార్చగలిగే ఆల్‌రౌండర్లపై దృష్టి పెట్టి.. చేతిలో ఉన్న డబ్బునంతా వేలంలో ఖర్చు పెట్టి.. ఉత్తమ జట్టును సృష్టించుకున్న ఈ కొత్త ఫ్రాంఛైజీ.. తొలి సీజన్‌లోనే తనదైన ముద్ర వేయాలనే సంకల్పంతో ఉంది. మరి ఆ జట్టు ఎలా ఉందో ఓ సారి చూసేద్దాం పదండి!

ఈనాడు క్రీడావిభాగం

పీఎల్‌లో అడుగుపెడుతూనే లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ సంచలనమే సృష్టించింది. సంజీవ్‌ గొయెంకాకు చెందిన ఆర్పీఎస్జీ సంస్థ బిడ్డింగ్‌లో ఏకంగా రూ.7,090 కోట్లు చెల్లించి ఫ్రాంఛైజీని సొంతం చేసుకుంది. గతంలో రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌కు యజమానిగా ఉన్న ఆర్పీఎస్జీ ఇప్పుడు లఖ్‌నవూ జట్టుతో మరోసారి లీగ్‌లో భాగమైంది. ముందుగానే కేఎల్‌ రాహుల్‌ (రూ.17 కోట్లు), మార్కస్‌ స్టాయినిస్‌ (రూ.9.2 కోట్లు), రవి బిష్ణోయ్‌ (రూ.4 కోట్లు)ను ఆ జట్టు తీసుకుంది. రాహుల్‌కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. ఇక మెగా వేలంలో తమ దగ్గరున్న మొత్తం డబ్బు రూ.59 కోట్లను ఖర్చు పెట్టి మరో 18 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. భారీ షాట్లతో మ్యాచ్‌ గమనాన్ని మార్చే ఆల్‌రౌండ్‌ హిట్టర్లపై ప్రత్యేక దృష్టి సారించిన జట్టు.. హోల్డర్‌ (రూ.8.75 కోట్లు), కృనాల్‌ పాండ్య (రూ.8.25 కోట్లు), దీపక్‌ హుడా (రూ.5.75 కోట్లు) లను వేలంలో దక్కించుకుంది. గత కొన్ని సీజన్లుగా నిలకడగా రాణిస్తున్న పేసర్‌ అవేశ్‌ ఖాన్‌ (రూ.10 కోట్లు)ను భారీ ధరకు సొంతం చేసుకుంది. వేలం జరిగే సమయానికి లీగ్‌ చరిత్రలో అత్యధిక ధర పలికిన టీమ్‌ఇండియాకు ఆడని ఆటగాడిగా అవేశ్‌ రికార్డు సృష్టించాడు. ఇటీవల జాతీయ జట్టు తరపున అతను అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆ జట్టు నిలకడగా మంచి ప్రదర్శనతో కొనసాగితే ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంది.

బలాలు

కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఆ జట్టుకు అతి పెద్ద బలం. కొన్నేళ్లుగా అతను గొప్ప ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్లోనూ అన్ని ఫార్మాట్లలో ఉత్తమంగా రాణిస్తున్నాడు. ఈ సారి కొత్త జట్టు సారథిగా లీగ్‌లో సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే పంజాబ్‌ కింగ్స్‌కు కెప్టెన్‌గా చేసిన అతని అనుభవం జట్టుకు ఉపయోగపడుతుంది. అతనితో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించేందుకు ప్రమాదకర డికాక్‌ ఉండడంతో ఓపెనింగ్‌ జోడీ కుదిరింది. ఇక ఆల్‌రౌండర్లు ఆ జట్టుకు మరో బలం. హోల్డర్‌, కృనాల్‌ పాండ్య, దీపక్‌ హుడా, స్టాయినిస్‌, కృష్ణప్ప గౌతమ్‌.. ఇలా జట్టుకు కావాల్సిన స్థాయిలో ఆల్‌రౌండర్ల దన్ను ఉంది. క్షణాల్లో పరిస్థితి తారుమారయ్యే టీ20ల్లో జట్టు విజయాల్లో ఆల్‌రౌండర్లది కీలక పాత్ర. ఇటీవల టీమ్‌ఇండియా తరపున అరంగేట్రం చేసిన స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌, పేసర్‌ అవేశ్‌ఖాన్‌ బౌలింగ్‌లో జట్టుకు భరోసానిస్తున్నారు. బిష్ణోయ్‌తో పాటు కృనాల్‌, దీపక్‌, కృష్ణప్ప ఉండడంతో స్పిన్‌ బౌలింగ్‌లో వైవిధ్యం జట్టుకు కలిసొచ్చే అంశం.

బలహీనతలు

రాహుల్‌ తర్వాత జట్టులో ప్రధాన భారత బ్యాటర్‌ లేకపోవడం లోటుగా కనిపిస్తోంది. మనీశ్‌ పాండే ఉన్నప్పటికీ అతనికి నిలకడలేమి సమస్యగా మారింది. ఒకవేళ టాప్‌ఆర్డర్‌ విఫలమైతే ఇన్నింగ్స్‌కు ఇరుసులా వ్యవహరించే బ్యాటర్లు కనిపించడం లేదు. హోల్డర్‌, స్టాయినిస్‌, కృనాల్‌, దీపక్‌ రూపంలో హిట్లర్లున్నారు. కానీ క్రీజులో నిలబడి.. ఇన్నింగ్స్‌ను నిలబెడతారా? అని వాళ్ల సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పేస్‌ బౌలింగ్‌ విభాగంలోనూ అవేశ్‌ఖాన్‌పై తీవ్ర ఒత్తిడి ఉండడం ఖాయం. అంతర్జాతీయ అనుభవం పెద్దగా లేని అతను తడబడితే జట్టుకు సమస్యలు తప్పవు. అవేశ్‌కు తోడుగా చెప్పుకోదగ్గ మరో భారత పేసర్‌ లేకపోవడం కూడా ప్రతికూలంగా మారొచ్చు. బిష్ణోయ్‌ విఫలమైతే అతని స్థానాన్ని భర్తీ చేసే ప్రధాన స్పిన్నర్‌ కనిపించడం లేదు. మరోవైపు వేలంలో రూ.7.5 కోట్లు పెట్టి దక్కించుకున్న పేసర్‌ మార్క్‌ వుడ్‌ మోచేతి గాయం కారణంగా సీజన్‌ మొత్తానికి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అతను ఆడకపోతే జట్టుకది గట్టి దెబ్బే. మరో పేసర్‌ చమీర ఇప్పటివరకూ ఐపీఎల్‌లో ఆడలేదు. గతేడాది సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీకి ముందు బరోడా శిబిరంలో కృనాల్‌, దీపక్‌ మధ్య విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే. వాళ్ల మధ్య దూరాన్ని తగ్గించకుంటే జట్టుకు ఇబ్బందే.

దేశీయ ఆటగాళ్లు: కేఎల్‌ రాహుల్‌, మనన్‌ వోహ్రా, మనీశ్‌ పాండే, ఆయూష్‌ బదోని, దీపక్‌ హుడా, కృష్ణప్ప గౌతమ్‌, కర్ణ్‌ శర్మ, కృనాల్‌ పాండ్య, అంకిత్‌ రాజ్‌పుత్‌, అవేశ్‌ ఖాన్‌, మయాంక్‌ యాదవ్‌, మోసిన్‌ ఖాన్‌, రవి బిష్ణోయ్‌, షాబాజ్‌ నదీమ్‌
విదేశీయులు: లూయిస్‌, డికాక్‌, హోల్డర్‌, కైల్‌ మేయర్స్‌, స్టాయినిస్‌, దుష్మంత చమీర, మార్క్‌వుడ్‌

కీలక ఆటగాళ్లు: కేఎల్‌ రాహుల్‌, డికాక్‌, హోల్డర్‌, స్టాయినిస్‌, అవేశ్‌ఖాన్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని