IPL Mega Auction : కనీస ధర రూ. 2 కోట్లు.. టీమ్‌ఇండియా నుంచి వీరే..

ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ 2022 మెగా వేలంలో పాల్గొనే జాబితాను...

Published : 12 Feb 2022 02:07 IST

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్లో ప్రదర్శన ఎంత ముఖ్యమో.. ఫిట్‌నెస్‌ కూడా అంతే కీలకం. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో కుర్రాళ్లతోపాటు పోటీ పడాల్సి ఉంటుంది. ఒక్కసారి భారీ మొత్తం దక్కించుకుంటే చాలు ఉన్నత శిఖరాలకు చేరుకున్నట్లే.. అయితే అదే ఫామ్‌ను కొనసాగిస్తేనే మరుసటి వేలంలో మంచి ధర పలికేది. లేకపోతే కనుమరుగు కావాల్సి ఉంటుంది. రేపటి నుంచి రెండు రోజులపాటు జరిగే ఐపీఎల్ మెగా వేలం ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. ఈ ఐపీఎల్‌ మెగా వేలంలో అత్యంత ఆకర్షణీయమైన కనీస ధర (బేస్ ప్రైస్) రూ. 2 కోట్లు. అంతర్జాతీయంగా మొత్తం 48 మంది ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో భారత్‌కు చెందిన 17 మంది టాప్‌ ప్లేయర్లు ఉండటం విశేషం.  మొత్తం పది ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు దాదాపు రూ. 500 కోట్లకుపైగా వెచ్చించనున్నాయి. మరి ఆ టీమ్‌ఇండియా టాప్‌ ప్లేయర్లు ఎవరంటే? 

  1. రవిచంద్రన్ అశ్విన్‌ : టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాడు. మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు. 2020లో పంజాబ్‌ కింగ్స్‌  వదిలేయడంతో దిల్లీ క్యాపిటల్స్‌ రూ. 7.60 కోట్లకు సొంతం చేసుకుంది. ఆ సీజన్‌లో 15 మ్యాచ్‌లకుగాను 13 వికెట్లు పడగొట్టి ఫర్వాలేదనిపించినా.. గత సీజన్‌లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడనే చెప్పాలి. 13 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్‌ కేవలం ఏడు వికెట్లను మాత్రమే తీశాడు. బ్యాటింగ్‌లోనూ 37 పరుగులే చేసి నిరుత్సాహపరిచాడు. అయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా వికెట్లను పడగొట్టగల సామర్థ్యం అశ్విన్‌ సొంతం. 
  2. శిఖర్‌ ధావన్‌: ఫామ్‌లో ఉంటే ఎంత భీకరంగా ఆడతాడో పద్నాలుగో ఐపీఎల్‌ సీజన్‌లో చూశాం. అత్యధిక పరుగు వీరుల జాబితాలో ధావన్‌ (587) నాలుగో స్థానంలో ఉన్నాడు. దిల్లీ ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నుంచి రూ. 5.2 కోట్లకు ధావన్‌ను దిల్లీ క్యాపిటల్స్‌ తీసుకుంది. వరుసగా మూడేళ్లు 500కిపైగా పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. దీంతో ఈ సారి భారీ మొత్తాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. 
  3. శ్రేయస్‌ అయ్యర్‌: దిల్లీ క్యాపిటల్స్‌ను 2020 సీజన్‌లో ఫైనల్‌కు చేర్చిన సారథి.. పద్నాలుగో సీజన్‌లో  8 మ్యాచ్‌లు ఆడిన శ్రేయస్‌ కేవలం 175 పరుగులు మాత్రమే చేశాడు. కెప్టెన్సీని కోల్పోవడంతోపాటు సగం మ్యాచ్‌లు కూడా ఆడలేదు. ఒకానొక దశలో కొత్త ఫ్రాంచైజీలు ఎంచుకుని నాయకత్వ బాధ్యతలను అప్పగిస్తాయని అంతా భావించారు. అయితే అలాంటిందేమీ జరగకపోవడంతో మెగా వేలంలోకి వచ్చేశాడు. ప్రస్తుతమున్న ఆటగాళ్లలో హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయే వారిలో శ్రేయస్‌ ముందుంటాడు. వరుసగా నాలుగేళ్లపాటు రూ. 7 కోట్లతో దిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. 
  4. దేవ్‌దుత్‌ పడిక్కల్‌: ఆర్సీబీ ఓపెనర్‌గా 14 మ్యాచుల్లో 411 పరుగులు చేసి రాణించిన పడిక్కల్‌కు మంచి డిమాండ్ ఉంటుంది. అంతకుముందు 2020 సీజన్‌లోనూ 473 పరుగులు చేసి అద్భుతమనిపించాడు. గత వేలంలో కేవలం రూ. 20 లక్షలకే ఆర్సీబీ దక్కించుకోవడం గమనార్హం. ఈసారి ఏకంగా బేస్‌ ప్రైస్‌నే రూ. 2 కోట్లకు పెంచడంతో ఇప్పుడు అందరి కళ్లూ దేవదుత్‌ పడిక్కల్‌ మీదనే ఉంటాయి. మరోసారి ఆర్సీబీనే కైవసం చేసుకునే అవకాశాలు లేకపోలేదు. 
  5. సురేశ్‌ రైనా: 2018లో రూ. పదకొండు కోట్లకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ సురేశ్‌ రైనాను కొనుగోలు చేసుకుంది. 2021లో 160 పరుగులు, 2020లో ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేదు, 2019లో 383, 2018లో 445 పరుగులు చేశాడు. గత సీజన్‌ ప్రదర్శన ఆధారంగా అయితే ఈసారి భారీ ధర దక్కకపోవచ్చు. మరోసారి సీఎస్‌కే ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తుందో లేదో వేచి చూడాలి. అయితే రైనాను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వేలంలో దక్కించుకుంటుందనే వార్తలూ వినిపిస్తున్నాయి. 
  6. కృనాల్ పాండ్య: పాండ్య బ్రదర్స్‌లో హార్దిక్‌ను ఇప్పటికే అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీ తీసేసుకుంది. కృనాల్ పాండ్య గత సీజన్‌లో 13 మ్యాచుల్లో కేవలం 143 పరుగులు మాత్రమే చేశాడు. కేవలం ఐదు వికెట్లను మాత్రమే తీసి ఘోరంగా విఫలమయ్యాడు. 2018లో ముంబయి ఇండియన్స్ కృనాల్‌ను రూ. 8.90 కోట్లకు దక్కించుకుంది. ఈసారి అంత భారీ మొత్తం రాకపోయినా.. బేస్‌ ప్రైస్‌ (రూ. 2 కోట్లు) కంటే ఎక్కువగానే వచ్చే అవకాశం ఉంది. 
  7. హర్షల్‌ పటేల్‌ : దిల్లీ క్యాపిటల్స్‌ నుంచి 2021లో ఆర్సీబీ రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది. గతేడాది అత్యధిక వికెట్లు తీసి పర్పల్‌ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. 15 మ్యాచులకుగాను 32 వికెట్లు పడగొట్టి ఎవరికీ అందనంత ఎత్తుకు వెళ్లిపోయాడు. దీంతో ఈసారి భారీ మొత్తం వెచ్చించి ఫ్రాంచైజీలు కొనుగోలు చేయడం పక్కా. వేలంలో అత్యధి. క ధరను సొంతం చేసుకునే అవకాశాలూ లేకపోలేదు
  8. ఇషాన్ కిషన్‌ : ముంబయి ఇండియన్స్‌ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. రోహిత్, డికాక్‌ వంటి హేమీహేమీలు ఉన్నప్పటికీ తనకు వచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకున్నాడు. మరోసారి ముంబయి కొనుగోలు చేయనుందనేది సమాచారం. గత వేలంలో రూ. 7 కోట్లు సొంతం చేసుకున్న ఇషాన్‌.. దానిని మించిన మొత్తాన్ని అందుకునే అవకాశాలు పుష్కలం. బ్యాటర్లకు జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉండే ముంబయి ఇండియన్స్‌లో ఇషాన్‌ కిషన్‌ 10 మ్యాచుల్లో 241 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. 
  9. శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్ చాహర్‌: ఇటీవల కాలంలో టీమ్ఇండియా తరఫున ఆల్‌రౌండర్లుగా ఎదుగుతున్నారు. దీపక్‌ చాహర్‌ను 2021లో సీఎస్‌కే  రూ.80 లక్షలకే చేజిక్కించుకుంది. ఓపెనింగ్‌ బౌలర్‌గా పవర్‌ప్లేలో వికెట్లు పడగొట్టడం దీపక్ ప్రత్యేకత. గతేడాది 15 మ్యాచుల్లో 14 వికెట్లు తీశాడు.   అలానే మిడిల్‌ ఓవర్లలో కీలకమైన శార్దూల్‌ ఠాకూర్‌ను కూడా సీఎస్‌కేనే రూ. 2.60 కోట్లకు కొనుగోలు చేసుకుంది. ఫైనల్‌తో సహా 16 మ్యాచుల్లో 21 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు జరగబోయే మెగా వేలంలో వీరిద్దరికీ మంచి ధర దక్కే అవకాశం ఉంది. 
  10. భువనేశ్వర్‌ కుమార్‌: గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ స్వల్ప స్కోర్లను కూడా కాచుకుని విజయాలు సాధించడంలో భువనేశ్వర్‌ది కీలక పాత్ర. వికెట్‌కు ఇరువైపులా స్వింగ్‌ రాబట్టే బౌలర్. పవర్‌ప్లేతోపాటు డెత్‌ ఓవర్లలో సత్తా చాటగలిగే ఆటగాడు. అయితే గత కొన్నాళ్లుగా ఫామ్‌ పరంగా తేలిపోతున్నాడు. గత ఐపీఎల్‌లో 11 మ్యాచుల్లో కేవలం 6 వికెట్లను మాత్రమే తీయడం గమనార్హం. ఎస్‌ఆర్‌హెచ్‌ రూ. 8.50 కోట్లతో భువిని సొంతం చేసుకుంది. అయితే ఈసారి మాత్రం అంత ధర దక్కకపోవచ్చు. 
  11. చాహల్‌ : ఆర్సీబీకి వెన్నెముక లాంటి బౌలర్. క్లిష్టసమయాల్లో వికెట్‌ తీసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచగలడు. అయితే చాహల్‌ను ఆర్సీబీ రిటెయిన్‌ చేసుకోలేదు.  దీంతో రూ. 2 కోట్ల బేస్‌ ప్రైస్‌తో మెగా వేలంలోకి వచ్చాడు. ఈ సారికూడానూ ఆర్సీబీనే సొంతం చేసుకుంటుందో లేదో వేచి చూడాలి. గత వేలంలో రూ. 6 కోట్లు పలికిన చాహల్‌ పద్నాలుగో సీజన్‌లో 15 మ్యాచ్‌లకుగాను 18 వికెట్లు తీసి రాణించాడు. 
  12. అంబటి రాయుడు (రూ.2.2 కోట్లు), రాబిన్‌ ఉతప్ప (రూ. 3 కోట్లు), దినేశ్ కార్తిక్‌ (రూ. 7.4 కోట్లు), ఉమేశ్‌ యాదవ్‌ (రూ. కోటి), షమీ (రూ. 4.8 కోట్లు) కూడా తమ బేస్‌ ప్రైస్‌ను రూ. 2 కోట్లుగా పెట్టుకున్నారు. అయితే మెగా వేలంలో భారీ ధర రాకపోయినా.. ఏదొక ఫ్రాంచైజీ మాత్రం వీరిని తీసుకుంటుంది. అలానే మరో 20 మంది ఆటగాళ్లు రూ. 1.5 కోట్లతో, 34 మంది ప్లేయర్లు రూ. కోటి ధరతో వేలంలోకి వచ్చారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని