Dhoni - Jadeja : జడేజా.. ధోని నమ్మకాన్ని నిలబెడతాడా.?

మిస్టర్ కూల్‌ మహేంద్ర సింగ్ ధోని అనూహ్య నిర్ణయంతో క్రికెట్ అభిమానులకు షాక్‌ ఇచ్చాడు. మెగా టోర్నీలో అత్యంత విజయవంతమైన చెన్నై జట్టు పగ్గాలను ఆల్..

Updated : 25 Mar 2022 20:22 IST

మిస్టర్ కూల్‌ మహేంద్ర సింగ్ ధోని అనూహ్య నిర్ణయంతో క్రికెట్ అభిమానులకు షాక్‌ ఇచ్చాడు. మెగా టోర్నీలో అత్యంత విజయవంతమైన చెన్నై జట్టు పగ్గాలను ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు అప్పగించాడు. అయితే, ఇంతకు మునుపు ఎన్నడూ నాయకత్వ బాధ్యతలు చేపట్టని జడేజా.. ధోని నమ్మకాన్ని నిలబెడతాడా... ఏమో చూడాలి!

క్రికెట్లో ఎప్పుడు ఏం చేయాలో ధోనికి బాగా తెలుసు. వేరే వాళ్లు చెప్పాల్సిన అవసరం లేదు. తన వ్యూహాలతో మైదానంలో ప్రత్యర్థి జట్లను బోల్తా కొట్టించే ధోని.. తన కెరీర్‌ విషయంలోనూ ఎవరి ఊహకు అందని రీతిలో అనూహ్య నిర్ణయాలు తీసుకుని అందరినీ ఆశ్చర్య పరిచాడు. 2014-15లో ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే విరాట్ కోహ్లీకి టెస్టు బాధ్యతలు అప్పగించినప్పుడు అభిమానులు ఎంత ఆశ్చర్యపోయారో.. 2017 జనవరిలో వన్డే పగ్గాలను వదిలేసినప్పుడు కూడా అంతే షాక్‌కి గురయ్యారు. 2008-2016 వరకు టీ20 కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని.. ఆ తర్వాత విరాట్‌ కోహ్లీకి బాధ్యతలు అప్పగించాడు. తాజాగా, ఐపీఎల్‌లోనూ అదే రీతిలో నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం ప్రపంచంలోనే మేటి ఆల్ రౌండర్‌గా రాణిస్తున్న రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ అప్పగించాడు.

ధోని నమ్మకం గెలుచుకుని..

ఎంతో నమ్మకం ఉంటే గానీ ధోని.. రవీంద్ర జడేజాకు చెన్నై సారథ్య బాధ్యతలు అప్పగించనడంలో ఎలాంటి సందేహం లేదు. గత కొన్నేళ్లుగా జడేజా ఆటగాడిగా ఎంతో పరిణతి సాధించాడు. భారత జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహరించాడు. ఇటు బంతి, అటు బ్యాటు రెండింటితోనూ గొప్పగా రాణిస్తున్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన జడేజా 175* రికార్డు స్కోరు నమోదు చేశాడు. అదే మ్యాచులో 9 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ ఏ స్థానంలో బరిలోకి దించినా మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. మరోవైపు, గత సీజన్‌లో చెన్నై తరఫున జడేజా ఇదే స్థాయిలో రాణిస్తున్నాడు. 227 పరుగులు సహా.. 13 వికెట్లు పడగొట్టాడు. జడేజాలోని టాలెంట్‌ని గుర్తించాడు కాబట్టే అతడిని తన తర్వాతి కెప్టెన్‌గా ధోని ఎంపిక చేశాడని విశ్లేషకులు భావిస్తున్నారు.

అనుభవం లేకపోయినప్పటికీ..

2008 అండర్ - 19 ప్రపంచకప్‌ పోటీల్లో యువ భారత జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. ఆ జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించగా.. రవీంద్ర జడేజా వైస్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. జడేజాకు ఇదొక్కటి మినహాయిస్తే ఇంతకు మునుపెన్నడూ జట్టుని ముందుండి నడపించిన అనుభవం లేదు. అయితే, ధోని పగ్గాలు వదిలేసినా.. జడేజా వెనకుండి జట్టుని నడిపిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతకు ముందు కూడా కోహ్లీకి వన్డే కెప్టెన్సీ అప్పగించినా.. తను క్రికెట్లో కొనసాగినంత కాలం జట్టుకి పెద్ద దిక్కుగా క్లిష్ట పరిస్థితుల్లో తన క్రికెటింగ్ బుర్రతో గొప్ప విజయాలను అందించాడు. ప్రస్తుతం జడేజాకు కూడా అదే రీతిలో ధోని సహకారం అందిస్తాడని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

జడేజాకు కలిసొచ్చే అంశం అదే..

ప్రస్తుత సీజన్‌లో టీమ్‌ఇండియా ఆల్ రౌండర్లు హార్దిక్‌ పాండ్య గుజరాత్ టైటాన్స్ జట్టుకు, రవీంద్ర జడేజా చెన్నై జట్టుకు కెప్టెన్లుగా వ్యవహరిస్తుండటం విశేషం. గతంలో వీరిద్దరూ ధోని సారథ్యంలో టీమ్‌ఇండియాకు ఆడారు. అయితే, వెన్నెముక గాయం కారణంగా భారత జట్టులో చోటు కోల్పోయిన హార్దిక్‌ మునుపటి స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ముఖ్యంగా బౌలింగ్ చేయడంలో విఫలమవుతున్నాడు. మరోవైపు, జడేజా అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. కెప్టెన్సీ విషయంలో ఇద్దరికీ పెద్దగా అనుభవం లేదు. అయితే, జడేజా వెనుక ధోని ఉన్నాడు. కెప్టెన్‌గా ధోనికున్న అనుభవం జడేజాకు కలిసొస్తుంది. అంతే కాకుండా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు జడేజా ఆపద్బాంధవుడి పాత్ర పోషించడం ఇటీవల తరచూ చూస్తూనే ఉన్నాం. మరోవైపు, హార్దిక్‌ చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. ఇది గుజరాత్ జట్టుకు ప్రతికూలంగా మారొచ్చు.!

ఏం చేసినా జట్టు కోసమే..

‘ధోని ఏం చేసినా చెన్నై జట్టు అత్యుత్తమ ప్రయోజనాల కోసమే. చెన్నై జట్టు భవిష్యత్తు కోసమే ధోని ఈ నిర్ణయం తీసుకున్నాడు. తన నిర్ణయంతో మేమంతా చాలా సంతోషిస్తున్నాం. రవీంద్ర జడేజాకు పగ్గాలు అప్పగించినా.. ధోని జట్టుతోనే కొనసాగుతాడు. ప్రస్తుతం రవీంద్ర జడేజా ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్‌ రౌండర్‌. చాలా ఏళ్లుగా జట్టులో సభ్యుడిగా కొనసాగుతున్న అతడికి.. జట్టు అవసరాలేంటో బాగా తెలుసు. ధోని సహకారంతో అతడు మెరుగ్గా రాణించగలడనే నమ్మకం ఉంది’ అని చెన్నై సీఈవో కాశీ విశ్వనాథన్ అభిప్రాయపడ్డాడు. 

ధోనీ స్థానంలో బాధ్యతలు చేపట్టినా.. ఆ స్థాయి ప్రభావం చూపడం జడేజాకు ఏమంత సులభం కాదు. భారీ అంచనాల మధ్య చెన్నై జట్టు పగ్గాలు చేపట్టిన జడేజా.. ధోని నమ్మకాన్ని నిలబెడతాడా.? చెన్నై జట్టుని మరో స్థాయికి తీసుకెళ్తాడా.? అనే విషయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. త్వరలో ప్రారంభం కానున్న మెగా టోర్నీలో జడేజా నాయకుడిగా ఏ మేరకు విజయవంతమవుతాడో చూడాలి!

-ఇంటర్నెట్ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు