LSG vs MI: ‘రిటైర్డ్‌ హర్ట్‌’ కావడానికి కారణమదే: కృనాల్ పాండ్య

ముంబయిపై లఖ్‌నవూ (LSG vs MI) అద్భుత విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఐదు పరుగుల తేడాతో గెలిచిన లఖ్‌నవూ ప్లేఆఫ్స్‌ అవకాశాలను మెరుగుపర్చుకుంది.

Updated : 17 May 2023 11:15 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో (IPL 2023) ప్లేఆఫ్స్‌ స్థానాల కోసం పోటీ రసవత్తరంగా సాగుతోంది. కీలక సమయంలో ముంబయి ఇండియన్స్‌ (MI) తడబాటుకు గురై లఖ్‌నవూ (LSG) చేతిలో ఓటమిపాలైంది.  ప్రస్తుతం పాయింట్ల పట్టికలో లఖ్‌నవూ (15 పాయింట్లు) మూడో ప్లేస్‌కు చేరింది. ముంబయి (14 పాయింట్లు) నాలుగులో కొనసాగుతోంది. ముంబయిపై లఖ్‌నవూ విజయం సాధించడంలో కెప్టెన్ కృనాల్‌ పాండ్య (49*) కీలక పాత్ర పోషించాడు. వరుసగా వికెట్లు పడినప్పుడు స్టాయినిస్‌ (89)తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. అయితే, పాండ్య హాఫ్‌ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో రిటైర్డ్‌ హర్ట్‌గా  డగౌట్‌కు వెళ్లాడు. తొడ కండరాలు పట్టేయడంతో ఆడేందుకు ఇబ్బంది పడ్డాడు. దీంతో మరో పరుగు చేస్తే హాఫ్ సెంచరీ తన ఖాతాలో పడే అవకాశం ఉన్నప్పటికీ.. రిటైర్డ్‌ హర్ట్‌ అయ్యాడు. 

‘‘తొడ కండరాలు పట్టేశాయి. దీంతో కాలు తిమ్మిరికి గురైంది. నేను ఎప్పుడూ జట్టు ఆటగాడినే. ఏదైనా సరే జట్టు కోసం ఏం చేయడానికైనా సిద్ధం. చివరి మ్యాచ్‌లో విజయం సాధించడం ఆనందంగా ఉంది. ఈ సీజన్‌లో మోసిన్‌ కేవలం మూడో మ్యాచ్‌ ఆడాడు. సర్జరీ తర్వాత ఐపీఎల్‌లో పాల్గొన్నాడు. ఇలా బౌలింగ్‌ చేయడం అంత సులువేం కాదు. సొంత మైదానం వేదికగా చివరి లీగ్‌ మ్యాచ్‌లో విజయం సాధించడం మరింత ఆనందంగా ఉంది.

ఆ మూడు ఓవర్లే..: రోహిత్ శర్మ

‘‘మేం విజయం సాధించే దిశగా ఆడలేకపోయాం. గెలుపు కోసం కొన్ని అవకాశాలు ఉన్నప్పటికీ.. దురదృష్టవశాత్తూ విజయం దక్కలేదు. బ్యాటింగ్‌కు అనుకూలంగానే ఉంది. టార్గెట్‌ కూడా ఛేదన చేసేలా అనిపించింది. అయితే, మేం బ్యాటింగ్‌ చేసే సమయంలో తడబాటుకు గురయ్యాం. అలానే లఖ్‌నవూకు చివరి మూడు ఓవర్లలో అదనంగా పరుగులు ఇవ్వడం నష్టం చేసింది. ఇప్పుడు పాయింట్లు, నెట్‌రన్‌రేట్‌ గురించి ఆలోచించడం లేదు. చివరి మ్యాచ్‌లో (హైదరాబాద్‌తో) విజయం సాధించడంపైనే దృష్టిపెడతాం’’ అని ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్ శర్మ తెలిపాడు.

అశ్విన్ స్పందన..

కృనాల్ పాండ్య రిటైర్డ్‌ హర్ట్‌ కావడంపై టీమ్‌ ఇండియా స్టార్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ట్విటర్‌లో స్పందించాడు. ‘‘రిటైర్డ్‌ ఔట్‌..?’’ అని ట్వీట్ చేశాడు. దీనికి ఓ అభిమాని..  ‘‘ఇదంతా చీటింగ్‌’’ అంటూ రిప్లయ్‌ ఇచ్చాడు.  వెంటనే అశ్విన్‌ స్పందిస్తూ.. ‘‘అలా కావడానికి నిబంధనలు అనుమతిస్తాయి. ఇక్కడ మోసం ఏమీ లేదు’’ కామెంట్‌ చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని