Rohit Sharma: కొత్త కిట్‌ కొనేందుకు రోహిత్‌ పాల ప్యాకెట్ల డెలివరీ చేశాడు: ఓజా

కెరీర్‌ ఆరంభంలో ప్రతి ఒక్కరూ శ్రమించాల్సిందే. అయితే, ఆర్థికంగా ఇబ్బంది పడినప్పుడు ఇంకాస్త కష్టపడాల్సి ఉంటుంది. దానికి చక్కని ఉదాహరణ టీమ్‌ఇండియా సారథి రోహిత్ శర్మ (Rohit Sharma). గత అనుభవాలను భారత మాజీ ఆటగాడు ప్రజ్ఞాన్‌ ఓజా గుర్తుకు తెచ్చుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. 

Published : 28 Mar 2023 19:55 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సాధారణ కుటుంబం నుంచి వచ్చిన రోహిత్ శర్మ (Rohit Sharma) టీమ్‌ఇండియా కెప్టెన్‌గా ఎదిగిన తన ప్రస్థానంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెటర్‌గా మారేందుకు తీవ్రంగా శ్రమించాడని భారత మాజీ ఆటగాడు, ఐపీఎల్‌ (IPL) గవర్నింగ్‌  కౌన్సిల్ సభ్యుడు ప్రజ్ఞాన్‌ ఓజా తెలిపాడు. అండర్‌ - 15 క్రికెట్‌ స్థాయి నుంచి రోహిత్, ఓజా కలిసి ఆడారు. ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్‌ తరఫున కొన్ని మ్యాచ్‌లు ఆడిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 16వ సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఓజా ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ... క్రికెట్‌ ఆడే తొలి రోజుల్లో తాము ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకున్నాడు. కొత్త కిట్‌ను కొనుగోలు చేసుకునేందుకు రోహిత్ శర్మ పాల ప్యాకెట్లను కూడా డెలివరీ చేసినట్లు చెప్పాడు. 

‘‘నేను తొలిసారి అండర్ - 15 జాతీయ క్యాంప్‌లో రోహిత్‌ను కలిశా. అతడొక ప్రత్యేకమైన ప్లేయర్‌గా అందరూ చెప్పేవారు. రోహిత్‌కు ప్రత్యర్థిగా ఆడి ఔట్ చేశా. అయితే, ఆటలో దూకుడుగా ఉండే రోహిత్‌ పెద్దగా మాట్లాడేవాడు కాదు. నాతో ఆడేటప్పుడు మాత్రం చాలా దూకుడుగా ఉండేవాడు. ఎందుకు అలా ఉన్నాడో కూడా తెలియదు. కొన్నాళ్లకు మా మధ్య స్నేహం పెరిగింది. రోహిత్ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాడు. ఒకసారి క్రికెట్‌ కిట్ బడ్జెట్‌ గురించి చర్చ జరుగుతుండగా రోహిత్ భావోద్వేగానికి గురయ్యాడు.  దాని కోసం అతడు పాల ప్యాకెట్ల డెలివరీ కూడా చేశాడు. ఇదంతా జరిగి చాలాకాలమైంది. మా క్రికెట్‌ ప్రయాణం ఎలా ప్రారంభమైంది.. ఇప్పుడు రోహిత్‌ ఎదిగిన తీరును చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది’’ అని ఓజా తెలిపాడు.ఓజా, రోహిత్ కలిసి భారత్‌ తరఫున 24 మ్యాచ్‌లు ఆడారు. ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్‌  జట్టుకు ఆడిన వీరిద్దరూ తర్వాత ముంబయి ఇండియన్స్‌ వెళ్లిపోయారు. ఓజాకు 2015 సీజన్‌ చివరిది కాగా.. రోహిత్ ప్రస్తుతం ముంబయి ఇండియన్స్‌కు సారథిగా వ్యవహరిస్తున్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని