IND vs SL: ఇప్పుడంతా బాగుంది.. సడెన్‌గా నేను కూడా బ్యాడ్‌ కెప్టెన్‌గా కనిపిస్తా..: రోహిత్

శ్రీలంకతో మ్యాచ్‌కు సన్నాహాల సందర్భంగా భారత కెప్టెన్‌ రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కీలక విషయాలపై మాట్లాడాడు.

Updated : 02 Nov 2023 12:50 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) లీగ్‌ దశలో భాగంగా శ్రీలంకతో ముంబయి వేదికగా తలపడేందుకు భారత్‌ (IND vs SL) సిద్ధమైంది. వరుసగా ఆరు విజయాలను నమోదు చేసిన టీమ్ఇండియా (Team India) సెమీస్‌ బెర్తును ఖాయం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) వ్యక్తిగత ప్రదర్శనతోపాటు నాయకత్వ పటిమతో భారత్‌ను అద్భుతంగా నడిపిస్తున్నాడు. శ్రీలంకతో మ్యాచ్‌ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ తన కెప్టెన్సీ స్టైల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘‘పరిస్థితులును ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ నిర్ణయాలు తీసుకుంటా. ప్రతి చిన్న విషయంపైనా విశ్లేషణ చేసి అందుకు తగ్గట్టుగా ప్రణాళికల్లో మార్పులు చేసుకోవాలి. కొన్నిసార్లు అవి ఫలితం చూపవచ్చు. లేదా మరికొన్నిసార్లు ప్రయోజనం ఉండకపోవచ్చు. కానీ, ప్రయత్న లోపం మాత్రం ఉండకూడదు. ప్రతి మ్యాచ్‌కు తగినంత సన్నద్ధత అవసరం. మైదానంలో తీసుకునే నిర్ణయాలు విజయం కోసం మాత్రమేనని నేను నమ్ముతా. ప్రత్యర్థి జట్ల బలాలు ఏంటి? ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో వారేం చేస్తారు? అనే దిశగానూ ఆలోచించి నిర్ణయం తీసుకుంటా. ఇదే విషయన్ని బౌలర్లకూ చెబుతా. ఇప్పటి వరకు సమష్టిగా మేము చేసిందిదే. వికెట్ల కోసం వెళ్లడం లేదా బ్యాటర్లను పరుగులు చేయకుండా అడ్డుకొనేందుకు ఫీల్డింగ్‌లో చురుగ్గా మార్పులు చేయడం కీలకం. చిన్నపాటి మార్పులు, వ్యూహాత్మక నిర్ణయాల వల్ల గేమ్‌‌లో మనం ఆధిక్యత ప్రదర్శించేందుకు అవకాశాలు లభిస్తాయి. దానికి తగ్గట్టు వ్యూహ రచనలో సహచర ఆటగాళ్లూ భాగస్వాములు కావడం చాలా ముఖ్యం. ఇది తేలికైన విషయం కాదు. వారు పాటించకపోతే ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా సఫలీకృతం కావు. 

జట్టు విజయాల్లో నాతోపాటు మిగతా పది మందికీ క్రెడిట్‌ ఇవ్వాలి. జట్టు నిర్ణయాలకు కట్టుబడి మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లేది వారే. ఇది కేవలం కెప్టెన్‌గా నా ఒక్కడి ఆలోచనే కాదు. ఇప్పుడు పరిస్థితులన్నీ సానుకూలంగా ఉన్నాయి కాబట్టి అంతా ఓకే. ప్రతి మ్యాచ్‌ ఫలితంపై నాకు అవగాహన ఉంది. వరుసగా విజయాలు సాధిస్తున్నాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది కనిపించదు. అయితే, ఎప్పుడో ఒకప్పుడు నేను కూడా బ్యాడ్‌ కెప్టెన్‌గా కనిపిస్తా. ఇప్పటికైతే జట్టు విజయం కోసం ఏం అవసరమనే దానిపైనే దృష్టిసారించా’’ అని రోహిత్ శర్మ వెల్లడించాడు. 

బ్యాటర్‌గా నా బాధ్యత అదే: రోహిత్

జట్టు కోసం నిస్వార్థంగా బ్యాటింగ్‌ చేసే రోహిత్ శర్మకు మాజీ క్రికెటర్లు కీలక సూచనలు చేశారని.. కాస్త స్వార్థపూరితంగా బ్యాటింగ్‌ చేయాలని చెప్పినట్లు విలేకర్లు భారత సారథి దృష్టికి తీసుకెళ్లారు. అయితే, సమాధానం చెప్పేందుకు కాసేపు వేచి చూసిన రోహిత్..  తర్వాత టీమ్‌ మేనేజర్‌ వైపు చూడటంతో హాలంతా నవ్వులు విరిశాయి. ఆ తర్వాత రోహిత్ మాట్లాడుతూ.. ‘‘ఎల్లవేళలా నా బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తా. అయితే, పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాల్సిన అవసరమూ ఉంది. అంతేకానీ, ఇష్టమొచ్చినట్లు బ్యాటింగ్‌ చేయలేను. టీమ్ మెరుగైన స్థితికి చేరే వరకూ మంచి ఇన్నింగ్స్‌ ఆడాల్సి ఉంటుంది. అలానే ఆడేందుకు ప్రయత్నిస్తా. ఓపెనర్‌గా నేను ఇన్నింగ్స్‌ను సున్నా నుంచి ప్రారంభిస్తా. మ్యాచ్‌లో మంచి స్థితిలో జట్టు నిలవాలంటే ఆరంభం బాగుండాలి. పవర్‌ప్లేను అందుకు వినియోగించుకుంటాం. కానీ, ఒక్కోసారి పవర్‌ ప్లేలోనూ ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. గత మ్యాచ్‌లో త్వరగా మూడు వికెట్లను కోల్పోయాం. అప్పుడు గేమ్‌ను మార్చాల్సిన అవసరం ఉంది. బ్యాటర్‌గా జట్టు కోసం ఏం చేయాలనేది ఆలోచిస్తా. తొలి ఓవర్‌లో ఎలా ఆడాలి..? ఐదో ఓవర్‌, పదో ఓవర్‌ నాటికి గేమ్‌ను ఏ వ్యూహంతో ముందుకు తీసుకెళ్లాలి? ఎంత స్కోరు చేస్తే పోరాడగలం? అనే అంశాలు ఉంటాయి. అందుకు తగ్గట్టుగా ఆడేందుకు మాత్రమే ప్రయత్నిస్తా’’ అని వ్యాఖ్యానించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని