సిరాజ్‌.. ఆ క్షణంలో ఇలా చెప్పాడు: అశ్విన్‌

ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ శతకం సాధించినప్పుడు మహ్మద్‌ సిరాజ్‌ చేసిన సంబరాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. సహచర ఆటగాడు మూడంకెల స్కోరును...

Published : 18 Feb 2021 01:47 IST

ఇంటర్నెట్‌డెస్క్: ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ శతకం సాధించినప్పుడు మహ్మద్‌ సిరాజ్‌ చేసిన సంబరాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. సహచర ఆటగాడు మూడంకెల స్కోరును అందుకున్నాడని సిరాజ్ సంతోషంతో గాల్లోకి పంచ్‌లు విసిరాడు. కాగా, అంతకుముందు టీమిండియా 237 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోవడంతో.. అప్పటికి 77 పరుగులే చేసిన అశ్విన్‌ సెంచరీ సాధిస్తాడా లేదా అని అందరిలో ఉత్కంఠ పెరిగింది. అయితే ఆ సమయంలో సిరాజ్‌ ఆఖరి వరకు నిలబడతానని తనకి భరోసా ఇచ్చాడని అశ్విన్‌ తెలిపాడు.

‘‘సిరాజ్‌కు అభిమానులు ఎంతో మద్దతు ఇచ్చారు. నేను 90 పరుగులకు చేరిన తర్వాత.. అతడు డిఫెన్స్‌ చేస్తున్న ప్రతిసారి కేరింతలతో ఉత్సాహపరిచారు. అప్పుడు సిరాజ్‌ నా దగ్గరికి వచ్చి.. ‘నా డిఫెన్స్‌కు మా నాన్న కూడా ఇలా చప్పట్లు కొట్టలేదు. కానీ, ఇప్పుడు నన్ను ఎంతో మంది ఉత్సాహపరుస్తున్నారు. నువ్వు తప్పక శతకం సాధిస్తావ్‌. ఆఖరి వరకు నేను నిలబడతా’నని చెప్పాడు’’ అని అశ్విన్ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో పేర్కొన్నాడు.

చెన్నై అభిమానుల గురించి మాట్లాడుతూ.. ‘‘తమిళ ప్రజలకి సినిమాలంటే అంతలా ఇష్టమని నాకు తెలియదు. బౌండరీ లైన్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్నప్పుడు అశ్విన్.. అశ్విన్.. అని పిలిచారు. దానికి బదులుగా వెనక్కి తిరిగితే.. ‘వాలిమై’ సినిమా అప్‌డేట్ ఏంటి అని ఓ అభిమాని అడిగాడు. తర్వాత రోజు గూగుల్‌లో దాని గురించి తెలుసుకున్నా. అయితే మొయిన్‌ అలీ కూడా నా దగ్గరకు వచ్చి వాలిమై అంటే ఏంటని అడిగాడు. అప్పుడు నాకు అర్థమైంది. అలీని కూడా వాళ్లు అడిగారని. అయితే ఆ సినిమా గురించి ఇంగ్లాండ్ ఆటగాడిని అడగటమే చాలా ఫన్నీగా అనిపించింది’’ అని యాష్‌ వెల్లడించాడు. కాగా, స్టార్‌ హీరో అజిత్‌ కుమార్‌ నటిస్తున్న ‘వాలిమై’ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని