IND vs WI: ఆ అవార్డు మా అమ్మకిస్తున్నా.. ఎందుకంటే..?: మెకాయ్‌

ఐదు టీ20ల సిరీస్‌లో భారత్‌, వెస్టిండీస్‌ చెరో మ్యాచ్‌లో విజయం సాధించి 1-1తో సమంగా నిలిచాయి. విండీస్‌ బౌలర్‌ ...

Updated : 02 Aug 2022 10:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఐదు టీ20ల సిరీస్‌లో భారత్‌, వెస్టిండీస్‌ చెరో మ్యాచ్‌లో విజయం సాధించి 1-1తో సమంగా నిలిచాయి. విండీస్‌ బౌలర్‌ మెకాయ్‌ (6/17) ధాటికి టీమ్‌ఇండియా 138 పరుగులకే ఆలౌటైంది. అయితే చివరి ఓవర్‌ దాకా సాగిన మ్యాచ్‌లో విండీస్‌ అతికష్టం మీద గెలవగలిగింది. ఆఖరి ఓవర్‌లో 10 పరుగులు చేయాల్సిన క్రమంలో కెప్టెన్‌ రోహిత్ శర్మ యువబౌలర్‌ అవేశ్‌ ఖాన్‌కు బంతినిచ్చాడు. తీవ్ర ఒత్తిడి ఉండే పరిస్థితుల్లో తొలి బంతిని అవేశ్‌ నోబాల్‌గా వేశాడు. తర్వాతి రెండు బంతుల్లో విండీస్‌ బ్యాటర్ థామస్‌ సిక్స్‌, ఫోర్‌ కొట్టేసి భారత్‌ను ఓడించాడు. ఆఖరి ఓవర్‌లో అవేశ్‌ ఖాన్‌కు బదులు సీనియర్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ (2-0-12-0)కు బౌలింగ్‌ ఇస్తే ఫలితం వేరేలా ఉండేదేమోనని క్రీడా విశ్లేషకులు అంచనా వేశారు. దాదాపు మూడు గంటలపాటు ఆలస్యంగా మ్యాచ్‌ జరగడం కూడానూ ఓరకంగా టీమ్ఇండియా ఓటమికి కారణంగా పేర్కొన్నారు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం భారత్‌, విండీస్‌ సారథులు రోహిత్ శర్మ, నికోలస్‌ పూరన్‌, ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌ మెకాయ్ మాట్లాడారు. 

మా పంథా మార్చుకోం: రోహిత్‌

తొలుత బ్యాటింగ్‌ చేసినప్పుడు స్కోరు బోర్డుపై కావాల్సినన్ని పరుగులను ఉంచలేకపోయాం. పిచ్‌ బాగానే స్పందించినా మేం సరిగా బ్యాటింగ్‌ చేయలేకపోయాం. అయితే ఒక్కోసారి అనుకున్నవిధంగా ఆడలేం. లోపాలను అధిగమించి పాఠాలను నేర్చుకుంటాం. ప్రతి ఒక్కరికి నేర్చుకునేందుకు అవకాశాలు వస్తుంటాయి. ఇక చివరి ఓవర్‌ గురించి ప్రతి ఒక్కరూ చర్చిస్తారని తెలుసు. అప్పటికి భువి అందుబాటులో ఉన్నప్పటికీ అవేశ్‌ ఖాన్‌కు బంతిని ఇవ్వడంపై వ్యాఖ్యలు వస్తుంటాయి. అయితే డెత్‌ ఓవర్లలో యువ బౌలర్లకు అవకాశం ఇస్తే బాగుంటుందని భావించాం. కాస్త తడబాటుకు గురైనప్పటికీ అద్భుతంగా బౌలింగ్ చేశారు. 138 పరుగుల లక్ష్యాలను ఇలాంటి పిచ్‌పై 14 ఓవర్లలోపే ఛేదించే అవకాశం ఉన్నా మ్యాచ్‌ను చివరి ఓవర్‌ వరకూ తీసుకెళ్లడంలో బౌలర్లు సఫలీకృతమయ్యారు. తదుపరి మ్యాచుల్లో మా బ్యాటింగ్‌పై దృష్టిసారిస్తాం. అయితే ఇలాంటి విధానంతోనే బ్యాటింగ్‌ను కొనసాగిస్తాం. ఏదో ఒక మ్యాచ్‌లో ఇలా జరిగిందని కంగారుపడిపోయేది లేదు. ఒక్క ఓటమితో మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు.

మాకెంతో కఠినమైన సవాళ్లు: పూరన్‌

గత కొంతకాలంగా మాకు కఠినమైన సమయం నడుస్తోంది. చాలా మ్యాచ్‌ల్లో చివరి వరకూ వచ్చి ఓడిపోతున్నాం. ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకున్నట్లు అయింది. మెకాయ్‌ చాలా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. టీ20ల్లో బ్యాటర్లు చాలా దూకుడుగా ఆడతారు. అలాంటి సమయంలో బౌలింగ్‌ వేయడం సవాళ్లతో కూడుకున్నదే. మ్యాచ్‌ చివరి ఓవర్‌ వరకూ వెళ్లినా విజయం సొంతం కావడం సంతోషం. మ్యాచ్‌ విజయంలో బ్రాండన్‌ కింగ్‌ కూడా కీలక పాత్ర పోషించాడు. ఇక నేను, హెట్మయేర్ ఎక్కువ బాధ్యతతో ఆడాల్సిన అవసరం ఉంది. గాయపడి మళ్లీ జట్టులోకి వచ్చిన థామస్ తన సొంత మైదానంలో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మాకు విజయం సాధించి పెట్టడంలో మెకాయ్‌ బౌలింగ్ ప్రదర్శనే కీలకం. మరీ ముఖ్యంగా ధాటిగా ఆడే దినేశ్‌ కార్తిక్‌కు బౌలింగ్‌ చేసిన విధానం అద్భుతం. ఫుల్‌ అండ్‌ లెంగ్త్‌ బౌలింగ్‌తో కార్తిక్‌ను అడ్డుకోవడంలో మెకాయ్‌ సక్సెస్‌ అయ్యాడు. 

ఫస్ట్‌ బంతికే వికెట్‌ తీయడం .. : మెకాయ్‌ (6/17), ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌

(ఫొటో సోర్స్‌: విండీస్‌ క్రికెట్‌ ట్విటర్)

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ను మా అమ్మకు అంకితమిస్తున్నా. అనారోగ్యంతో బాధపడుతూ ఉండే ఆమె నన్ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండేది. అందుకే ఈ అవార్డును అమ్మకిస్తున్నా. మొదటి బంతికే వికెట్ తీయడం ఎప్పుడూ బ్యాటర్‌పై ఒత్తిడిని పెంచినట్లు అవుతుంది. పవర్‌ప్లేలో వికెట్లు తీసేందుకు చూస్తుంటా. గత మ్యాచ్‌ (మొదటి టీ20)లో అతిగా ఆలోచించడం వల్లే సరైన ప్రదర్శన చేయలేకపోయా. ఇప్పుడు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా బౌలింగ్‌పైనే దృష్టిపెట్టా. ప్రతి మ్యాచ్‌ నాకు సవాల్‌తో కూడుకున్నదే. అయితే ఇలాంటి మ్యాచుల్లో ఆడినప్పుడు వచ్చే అనుభవం భవిష్యత్తులో అక్కరకొస్తుంది. 

భారత్‌, విండీస్‌ రెండో టీ20 మ్యాచ్‌ విశేషాలు..

* టీ20ల్లో ఆరు వికెట్ల ప్రదర్శన చేసిన ఆరో బౌలర్‌ మెకాయ్‌. అతడి కంటేమందు దీపక్‌ చాహర్‌ (6/7), అజంతా మెండిస్ (6/8, 6/16), యుజ్వేంద్ర చాహల్ (6/25), అగర్ (6/30) ఉన్నారు.

* భారత్‌పై అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన చేసిన బౌలర్‌ కూడా మెకాయ్‌ కావడం విశేషం. గతంలో వహిందు హసరంగ (4/9), మిచెల్‌ సాంట్నర్ (4/11), డారెన్ సామీ (4/16) ఉన్నారు.

* టీ20ల్లో విండీస్‌ ప్లేయర్‌ అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలను నమోదు చేసిన బౌలర్‌ మెకాయ్‌. అంతకుముందు కీమో పాల్ (5/15), డారెన్ సామీ (5/26), జాసన్ హోల్డర్ (5/27), థామస్‌ (5/38) ఉన్నారు.

* టీ20 కెరీర్‌లో తొమ్మిదో సారి రోహిత్ శర్మ డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. అత్యధిక డకౌట్లు అయిన టీమ్‌ఇండియా క్రికెటర్లలో రోహిత్‌ శర్మే ముందున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని