స్పష్టమైన ప్రణాళికతో విజయవంతంగా ఎన్నికలు

స్పష్టమైన ప్రణాళిక, సిబ్బందికి సరైన శిక్షణ ద్వారా ఎన్నికలను విజయవంతంగా నిర్వహించవచ్చని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు.

Updated : 10 Jun 2023 05:28 IST

రాష్ట్ర ముఖ్యఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌

ఈనాడు, హైదరాబాద్‌: స్పష్టమైన ప్రణాళిక, సిబ్బందికి సరైన శిక్షణ ద్వారా ఎన్నికలను విజయవంతంగా నిర్వహించవచ్చని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. 2024 సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్రంలో ఎన్నికల విధుల్లో కీలకమైన అధికారులకు.. దిల్లీలోని ‘ఇండియా ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెమాక్రసీ అండ్‌ ఎలక్షన్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఐడీఈఎం)’ ఆధ్వర్యాన హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఈనెల 5 నుంచి 9 వరకు రాష్ట్రస్థాయి మాస్టర్‌ ట్రైనర్స్‌ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వివిధ విభాగాలకు చెందిన అధికారులు హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణలో కీలకమైన వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. అభ్యర్థుల అర్హతలు, అనర్హత, నామినేషన్లు, గుర్తుల కేటాయింపు, జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళిక, సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు, పోలింగ్‌ రోజు ఏర్పాట్లు, పోలింగ్‌ స్టేషన్లు, మీడియా ఫిర్యాదులు, చెల్లింపువార్తలు, నియమావళి, భారతీయ ఎన్నికలు సోషల్‌మీడియా, ఎన్నికల ఖర్చు పర్యవేక్షణ, ఐటీ, ఈ-రోల్‌, ఈవీఎం, వీవీప్యాట్‌, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి, పోస్టల్‌ బ్యాలెట్‌, బ్యాలెట్‌ పేపర్‌ తదితర విషయాలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ అధికారులు జిల్లాలో మాస్టర్‌ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారని వికాస్‌రాజ్‌ తెలిపారు. శిక్షణ పూర్తిచేసుకున్న అధికారులకు ట్రైనింగ్‌ మెటీరియల్‌ త్వరలోనే అందిస్తామని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని