Kate Middleton: కేట్‌ మిడిల్టన్‌ తొలి పోస్ట్‌.. ఆ ఫొటో నిజం కాదా..?

Kate Middleton: సర్జరీ అనంతరం కేట్‌ మిడిల్టన్‌ తన పిల్లలతో దిగిన ఫొటోను రాజకుటుంబం విడుదల చేసింది. అయితే, ఈ ఫొటో నిజం కాదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated : 11 Mar 2024 11:17 IST

లండన్‌: బ్రిటన్‌ (Britain) యువరాజు విలియం సతీమణి, ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ కేట్‌ మిడిల్టన్‌ (Kate Middleton) అనారోగ్యం గురించి మరోసారి చర్చ మొదలైంది. తాజాగా రాజకుటుంబం విడుదల చేసిన ఫొటోనే ఇందుకు కారణం. సర్జరీ తర్వాత కేట్‌ తొలిసారి సోషల్‌ మీడియాలో స్పందిస్తూ ఓ ఫొటోను పంచుకున్నారు. అయితే అది ఎడిట్‌ చేసిన ఫొటో అంటూ కొన్ని మీడియా ఏజెన్సీలు అనుమానాలు వ్యక్తం చేయడం చర్చకు దారితీసింది. అసలేం జరిగిందంటే..?

కేట్‌ అనారోగ్యం గురించి గత కొన్ని రోజులుగా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమె శస్త్రచికిత్స చేయించుకున్నారని ప్రిన్స్‌ అండ్‌ ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ కార్యాలయం జనవరిలో వెల్లడించింది. అప్పటి నుంచి ఆమె బాహ్య ప్రపంచానికి కన్పించకపోవడంతో అనేక వదంతులు మొదలయ్యాయి. ఆమె కోమాలోకి వెళ్లి ఉండొచ్చని ప్రచారం జరిగింది.

సర్జరీ అనంతరం యువరాణి కేట్‌ తొలిపోస్టు..

ఈ క్రమంలోనే బ్రిటన్‌లో మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని కెన్సింగ్టన్‌ ప్యాలెస్‌ ఆదివారం ఓ ఫొటో విడుదల చేసింది. అందులో కేట్‌ తన ముగ్గురు పిల్లలతో కలిసి కన్పించారు. గత రెండు నెలలుగా మద్దతుగా నిలిచిన వారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఆ ఫొటోను తన భర్త, ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ విలియం తీసినట్లు ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

అయితే, కొద్ది గంటల్లోనే ఈ పోస్ట్‌పై నెట్టింట చర్చ మొదలైంది. రాజకుటుంబం విడుదల చేసింది ‘ఎడిటెడ్‌’ ఫొటో అయి ఉంటుందని కొన్ని అంతర్జాతీయ మీడియా ఏజెన్సీలు అనుమానం వ్యక్తం చేశాయి. ఫొటోలో కేట్‌ కుమార్తె ఎడమ చేయి సరైన అలైన్‌మెంట్‌లో లేకపోవడంతో అది నిజమైనది కాకపోవచ్చని ఆరోపించాయి. ఆ చిత్రాన్ని తమ వేదికల నుంచి తొలగించాయి. ఇక, కేట్‌ చేతికి ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ లేకపోవడం కూడా ఈ అనుమానాలను మరింత బలపరుస్తోంది. ఇది ఏఐ జనరేటెడ్‌ ఇమేజ్‌ అయి ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే, దీనిపై స్పందించేందుకు కెన్సింగ్టన్‌ ప్యాలెస్‌ నిరాకరించినట్లు యూకే మీడియా కథనాలు వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు