ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా డ్రోన్లు

రష్యా క్షిపణలు, డ్రోన్లు బుధవారం తెల్లవారుజామున ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డాయి. ముఖ్యంగా పౌరనివాస ప్రాంతాలకు తీవ్ర నష్టం కలిగించాయి.

Updated : 23 Mar 2023 03:59 IST

8 మంది మృతి.. 25 మందికిపైగా ఆసుపత్రి పాలు

కీవ్‌: రష్యా క్షిపణలు, డ్రోన్లు బుధవారం తెల్లవారుజామున ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డాయి. ముఖ్యంగా పౌరనివాస ప్రాంతాలకు తీవ్ర నష్టం కలిగించాయి. రాజధాని కీవ్‌ సమీపంలోని విద్యార్థుల డార్మిటరీపై జరిగిన డ్రోన్ల దాడిలో కొంతమంది విద్యార్థులు సహా ఏడుగురు పౌరులు మరణించారు. ర్జిచివ్‌ నగరంలోని ఓ హైస్కూల్‌ భవనాన్ని, రెండు డార్మిటరీలను డ్రోన్‌ దాడి పాక్షికంగా ధ్వంసం చేసిందని స్థానిక అధికారులు తెలిపారు. ఆ సమయానికి డార్మిటరీల్లో ఎంతమంది ఉన్నారనేదానిపై స్పష్టత లేదు. రష్యా ప్రయోగించిన మొత్తం 21 డ్రోన్లలో 16 డ్రోన్లను ఉక్రెయిన్‌ గగనతల రక్షణ వ్యవస్థ నేలకూల్చిందని ఉక్రెయిన్‌ జనరల్‌ స్టాఫ్‌ వెల్లడించారు. వాటిలో ఎనిమిదింటిని రాజధాని సమీపంలో ధ్వంసం చేశారు. మరోపక్క ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ రష్యా దాడికి సంబంధించిన ఓ వీడియోను టెలిగ్రామ్‌లో పోస్టు చేశారు. అందులో ఆగ్నేయ నగరం జపోరిజియాలో ఓ తొమ్మిది అంతస్తుల భవనాన్ని క్షిపణి ఢీకొట్టిన సీసీటీవీ దృశ్యం కనిపించింది. ఈ ఘటనకు సంబంధించి ధ్వంసమైన భవనం, అందులోంచి మంటలు చెలరేగుతున్న చిత్రాలను ఉక్రెయిన్‌ మీడియా ప్రసారం చేసింది. ఈ సంఘటనలో అయిదవ అంతస్తులోని శిథిలాల నుంచి 40 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక పోలీసు అధికారి అండ్రి నెబిటొవ్‌ తెలిపారు. 25 మంది ఆసుపత్రి పాలైనట్లు చెప్పారు. అయితే రష్యా క్షిపణిని అడ్డగించేందుకు ఉక్రెయిన్‌ గగనతల రక్షణ వ్యవస్థ ప్రయోగించిన క్షిపణే ఆ భవనాన్ని ఢీకొట్టిందని జపోరిజియాలో రష్యా నియమించిన ప్రాంతీయ పరిపాలన అధికారి వ్లాదిమిర్‌ రోగోవ్‌ వెల్లడించారు. దీనికి రుజువులను ఆయన చూపించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని