Diabetes: టైప్‌-2 మధుమేహంతో ఆయుక్షీణం

ప్రపంచవ్యాప్తంగా మధుమేహ బాధితులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ రుగ్మత మన సగటు ఆయుర్దాయంపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందనే విషయమై లాన్సెట్‌ విస్మయకరమైన విషయాలను వెల్లడించింది.

Updated : 04 Oct 2023 07:33 IST

30 ఏళ్ల ప్రాయంలో వస్తే 14 సంవత్సరాలు...
40 ఏళ్ల వయసులో వస్తే పదేళ్లు..
లాన్సెట్‌లో ప్రచురితమైన నివేదిక వెల్లడి

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా మధుమేహ బాధితులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ రుగ్మత మన సగటు ఆయుర్దాయంపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందనే విషయమై లాన్సెట్‌ విస్మయకరమైన విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల సమస్యలు, క్యాన్సర్‌కు దారితీసే టైప్‌-2 మధుమేహం(Diabetes) సగటు జీవిత కాలాన్ని ఏ విధంగా తగ్గిస్తుందో విస్తృత అధ్యయనాల ఆధారంగా వివరించింది. 30 ఏళ్ల వయసులో టైప్‌-2 మధుమేహం వస్తే...సగటు ఆయుర్దాయం 14 ఏళ్ల వరకు క్షీణిస్తుందని తెలిపింది. 40 ఏళ్ల వయసులో ఈ రుగ్మతకు గురైతే పదేళ్లు, 50ఏళ్లప్పుడు వస్తే కనీసంగా ఆరు సంవత్సరాలు ముందుగానే మృత్యువాత పడే అవకాశం ఉందని పేర్కొంది. అధిక ఆదాయం ఉన్న 19 దేశాల్లోని 15 లక్షల మంది ప్రజల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఈ నిర్ధారణకు వచ్చినట్లు ‘ది లాన్సెట్‌ డయాబెటిస్‌ అండ్‌ ఎండోక్రైనాలజీ’లో ప్రచురితమైన నివేదిక వివరించింది. యువత టైప్‌-2 మధుమేహానికి గురికాకుండా నివారించడం, సాధ్యమైనంత వరకు జాప్యం చేయడానికి తగిన చర్యలు తీసుకోవడం వల్ల మరణాల ముప్పును తగ్గించవచ్చని సూచించింది. ఊబకాయం, నాణ్యతలేని ఆహారం, అధిక సమయం కూర్చునే ఉండడం, శారీరక వ్యాయామం లేకపోవడం వంటి కారణాలు ప్రపంచవ్యాప్తంగా టైప్‌-2 మధుమేహం అధికమవడానికి దోహదపడుతున్నాయని వివరించింది. ఈ రుగ్మతకు గురయ్యే యువత సంఖ్య ఏటేటా పెరిగిపోతోంది. కేంబ్రిడ్జి, గ్లాస్గో విశ్వవిద్యాలయాలకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ నివేదికను రూపొందించింది. అమెరికా, ఐరోపా దేశాల్లో ఈ పరిశోధన కొనసాగింది. ఫలితాలు దాదాపు సమానంగానే ఉన్నాయని ప్రొఫెసర్‌ ఇమాన్యులే డి ఏంజెలాంటోనియో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని