PM Modi: వేసవిలో మోదీకి బైడెన్‌ ఆతిథ్యం..!

భారత ప్రధాని మోదీకి జూన్‌లో ప్రత్యేకమైన విందు ఇచ్చేందుకు అమెరికా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. 

Updated : 18 Mar 2023 11:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ సారి వేసవిలో భారత (India) ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)కి అమెరికా (USA) తరఫున విందు ఏర్పాటు చేసేందుకు ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌ (President Biden )సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ  కార్యక్రమం జూన్‌లో నిర్వహించాలని శ్వేతసౌధం భావిస్తోంది. ఈ అంశంపై మాట్లాడేందుకు అమెరికా జాతీయ భద్రతా సమితి నిరాకరించింది. స్వేచ్ఛాయుత  ఇండో-పసిఫిక్‌ కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా  భారత్‌-అమెరికా మధ్య బలపడుతున్న బంధానికి ఈ విందు ఓ కీలక సంకేతంగా నిలవనుంది. ఇప్పటికే గత నెలలో బైడెన్‌ సర్కార్‌ భారత్‌తో ఇనీషియేటీవ్‌ ఆన్‌ క్రిటికల్‌ అండ్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీ కార్యక్రమాన్ని ప్రకటించింది. దీని కింద కంప్యూటింగ్‌, జెట్‌ ఇంజిన్ల సంయుక్త అభివృద్ధి వంటి ప్రాజెక్టులు ఉన్నాయి.  భారత్‌పై రష్యా ప్రభావాన్ని తగ్గించడానికి అమెరికా తీసుకొన్న కీలక నిర్ణయంగా దీనిని భావిస్తున్నారు.

ఇక, ఇటీవల కాలంలో బైడెన్‌ ప్రభుత్వం విదేశీ అతిథులకు ఇచ్చే మూడో విందుగా ఇది నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే డిసెంబర్‌లో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌కు ఆతిథ్యం ఇచ్చారు. ఇక ఏప్రిల్‌ 26వ తేదీన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌సుక్‌ యోల్‌కు విందు ఏర్పాటు చేశారు. జూన్‌లో మోదీకి ఆతిథ్యం ఇచ్చేందుకు శ్వేతసౌధం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు, ఈ ఏడాది మే నెలలో బైడెన్‌-మోదీ ఆస్ట్రేలియాలో భేటీ కానున్నారు. క్వాడ్‌ సదస్సుల్లో భాగంగా వీరి సమావేశం జరగనుంది. దీనిలో జపాన్‌, ఆస్ట్రేలియా ప్రధానులు కూడా పాల్గొననున్నారు.

ప్రస్తుతం భారత్‌ జీ-20 సదస్సుల నిర్వహణలో బిజీగా ఉంది. దీని ప్రధాన సదస్సు ఈ ఏడాది సెప్టెంబర్‌లో న్యూ దిల్లీలో జరగనుంది. దీనిలో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కూడా ప్రధానంగా చర్చకు రానుంది. ఈ సదస్సుకు రష్యా తరపున అధ్యక్షుడు పుతిన్‌ హాజరవుతారా.. లేదా అన్న విషయంపై స్పష్టత రాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని