
తాజా వార్తలు
ఆర్థిక అత్యయిక స్థితి రాబోతోంది: దేవినేని
హైదరాబాద్: అవినీతిలో కూరుకుపోయిన సీఎం జగన్.. అందరినీ అందులోకి లాగేందుకు చూస్తున్నారని తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. వైకాపా నేతలు ఇష్టారాజ్యంగా అవాస్తవాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. మంగళగిరిలోని తెదేపా జాతీయ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దేవినేని మాట్లాడారు. తెదేపా అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో రూ.2లక్షల నగదు, 12 తులాల బంగారం మాత్రమే ఐటీ అధికారులు గుర్తించారని చెప్పారు. దొంగే.. దొంగా అన్నట్లు వైకాపా నేతల వ్యవహారశైలి ఉందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో జీతాలు, పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేదని.. ఆర్థిక అత్యయిక పరిస్థితి రాబోతోందని ఉమ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల రేషన్కార్డులు, 7లక్షల పింఛన్లు తొలగించి ఇప్పుడు రీవెరిఫికేషన్ డ్రామా ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన కేబినెట్లోని 8మంది మంత్రులతో పాటు వైకాపా ఎంపీలపై ఐటీ దాడులు జరగకుండా ఉండేందుకే జగన్ దిల్లీ పర్యటకు వెళ్తున్నారని దేవినేని ఉమ ఆరోపించారు. ఐటీ దాడుల నుంచి తమవారిని రక్షించుకునేందుకే సీఎం దిల్లీ పర్యటన అని విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్కు సంబంధించిన సంస్థలపై ఐటీ దాడులు జరిగితే వైకాపా నేతలు నోరు మెదపట్లేదని ఆరోపించారు. మీడియా ప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టించి కోర్టులో చీవాట్లు తింటున్నారని ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన విమర్శించారు. డీజీపీయే న్యాయస్థానం ముందుకు కావాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారని ఆక్షేపించారు. 90శాతానికి పైగా వైకాపా కార్యకర్తలకే గ్రామ వాలంటీర్ల పోస్టులు ఇచ్చారని.. పింఛన్లలో ఇచ్చే రూ.2,250లో రూ.250వాళ్లే దోపిడీ చేస్తున్నారని ఉమ ఆరోపించారు. ఈ విషయాన్ని గ్రామాల్లో ఎవరిని అడిగినా ఈ వాస్తవాలు తెలుస్తాయన్నారు.