News in Pics: చిత్రం చెప్పే సంగతులు -01(21-03-2023)
Updated : 21 Mar 2023 10:35 IST
1/18
ఈ సీతకోకచిలుకను చూశారా! చిత్రంగా, తెల్లని రెక్కలతో అందంగా కనిపిస్తోంది కదూ. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని పొలాల్లో కనిపించిన దృశ్యమిది.
2/18
శోభకృత్ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఉగాది ప్రసాదానికి వినియోగించే దినుసులను పూర్ణకుంభంతో సహా మర్రిఆకుపై సుందరంగా చిత్రీకరించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం మహ్మదాపురానికి చెందిన విశ్రాంత చిత్రలేఖనం ఉపాధ్యాయులు పచ్చా పెంచలయ్య వేసిన ఈ దృశ్యం ఆకట్టుకుంటోంది.
3/18
అనగనగా ఓ కోతి దానికి దాహం వేసింది.. అటు ఇటు చూసింది.. ఓ బోర్డు వద్దకు చేరింది.. తాగునీటికి దారిని చూసుకుని దాహం తీర్చుకుంది.. పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో సోమవారం కనిపించిన దృశ్యమిది.
4/18
ఉగాది నుంచి శ్రీరామ నవమి ఉత్సవాలు ఆరంభం కానుండడంతో భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి కోవెల పరిసరాలు కల్యాణానికి ముస్తాబవుతున్నాయి. ఆలయానికి విద్యుత్తు దీపాలను అలంకరించారు.
5/18
తిరుపతి జిల్లా వడమాలపేట, ఏర్పేడు మండలాల పరిధిలోని సదాశివకోనలో పురాతన శిలాశాసనం సోమవారం లభ్యమైంది. ఇది తెలుగులో శాఖయుగం 147(6) ఆనంద, శ్రావణ, భ 10, మంగళవారం= 1554 సీఈ ఆగస్టు 22వ తేదీన చెక్కబడినట్లు దానిపై ఉన్న సమాచారం ద్వారా తెలుస్తోంది.
6/18
అనంతపురం జిల్లాలోని కదిరి నుంచి గొడ్డవెలగల గ్రామానికి, తలుపుల మండలం పరిధిలోని గ్రామాలకు వెళ్లే రహదారిలో మారన్నకుంట మరువ వంతెన రక్షణ గోడ కూలిపోయింది. మలుపు ఉన్న ప్రాంతంలో ఉన్న వంతెన గోడ కూలిపోవడంతో ప్రయాణ సమయంలో అప్రమత్తంగా వెళ్లాల్సిన పరిస్థితి.
7/18
రాయలసీమ ప్రాంత వెలుగుల దివ్వె.. ఎర్రగుంట్లలోని రాయలసీమ తాప విద్యుదుత్పత్తి కేంద్రం (ఆర్టీపీపీ) ప్రాంతంలో విద్యుత్తు దీపాల వెలుగులు లేక అంధకారం నెలకొంటోంది. కేంద్రం ముంగిట ఏర్పాటు చేసిన విద్యుత్తు దీపాలు దెబ్బతిని దాదాపు ఏడాది కావస్తున్నా పట్టించుకునేవారు కరవయ్యారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించే ఉద్యోగులు, స్థానికులు నిత్యం తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అంధకారంతో పలు ప్రమాదాలు చోటుచేసుకోవడమే కాకుండా ప్రాణనష్టం కూడా జరగడం గమనార్హం.
8/18
సాగరంలో ప్రాణాలు కోల్పోయిన జీవులు విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం అన్నవరం గ్రామం తీరానికి పెద్ద సంఖ్యలో కొట్టుకొస్తున్నాయి. మృతి చెందిన పెద్దపెద్ద చేపలు, తాబేళ్లు, ముళ్లకప్పలు ఇక్కడి తీరంలోని దాదాపు రెండు కి.మీ. పరిధిలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాగరతీరానికి వచ్చే సందర్శకులు, స్థానికులు, మత్స్యకారులు ఈ పరిస్థితిని చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
9/18
సరకు రవాణా వాహనాల్లో ప్రయాణించడం ప్రమాదకరమని అధికారులు ఎంతగా చెప్తున్నా కొందరి చెవికెక్కడం లేదు. ఏవైనా శుభకార్యాలకు పెద్ద సంఖ్యలో వెళ్లేందుకు జనం వీటినే ఉపయోగిస్తున్నారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో కన్పించిన దృశ్యమిది.. జీవాలను తరలించేందుకు వీలుగా రెండు అంతస్తులుగా విభజించిన మినీ లారీలో కిక్కిరిసి కూర్చొని ప్రయాణిస్తున్న జనం.
10/18
ఓ వైపు అకాల వర్షాలు తీవ్ర నష్టం కలిగిస్తుంటే.. మరోపక్క పుడమి తడారి భూగర్భ జలాలు అడుగంటి వరి పంటలు ఎండి పోతున్నాయి. ప్రకృతి వైపరీత్యం కారణంగా చివరకు నష్టపోయేది కర్షకుడే. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయి. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండ ప్రాంతంలో రైతు పాండు నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశాడు. ఇటీవలి కాలంలో అతడి బోరుబావి ఇంకిపోయింది. దీంతో నీరు లేక పంట ఎండిపోతోంది. చేసేదేమీ లేక ఎండిన వరిని ఇలా పశువుల కోసం కోస్తున్నాడు. రాచకొండ ప్రాంతంలో అక్కడక్కడ ఈ పరిస్థితి నెలకొంది.
11/18
పచ్చని చెట్ల మధ్య విశాల డైనింగ్.. పార్కింగ్తో సర్వాంగ సుందరంగా కళావేదికను నిర్మిస్తోంది హెచ్ఎండీఏ. హైదరాబాద్లోని ఉప్పల్ శిల్పారామం వెనుక దాదాపు మూడు ఎకరాల్లో 1500 మందికి పైగా కూర్చునే సామర్థ్యంతో సాంస్కృతిక కార్యక్రమాల కోసం చేపట్టిన మల్టీపర్పస్ ఎయిర్ కూల్డ్ వేదిక పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతోంది.
12/18
ఆందోళనకారులు లోపలికి రాకుండా హైదరాబాద్లోని టీఎస్పీఎస్సీ కార్యాలయం ఎదుట డివైడర్పై పోలీసులు ఇలా ముళ్ల కంచెను ఏర్పాటు చేయడంతో అటుగా వెళ్లే వారికి ప్రమాదకరంగా మారింది
13/18
సోమవారం రాత్రి హైదరాబాద్లోని రాజ్ భవన్లో నిర్వహించిన శోభకృత్ నామ సంవత్సర ‘యువ ఉగాది’ ఉత్సవాల్లో కళాకారుల శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
14/18
అకాలవర్షాలు.. వాతావరణ మార్పులతో విషజ్వరాలు, అంటువ్యాధులు పంజా విసురుతున్నాయి. తీవ్రజ్వరం, దగ్గు, జలుబు తదితర లక్షణాలతో రోగులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. సోమవారం హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రి వద్ద ఓపీ కోసం తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. కనీసం నిలబడేందుకు సైతం చోటులేనంతగా రోగులతో నిండిపోయింది. మరోవైపు కోఠి ఈఎన్టీ, నల్లకుంట ఫీవరాసుపత్రుల్లోనూ ఓపీ వద్ద రోగుల వరుస చాంతాడంత కనిపించింది.
15/18
పంజాబ్లో పరిస్థితుల దృష్ట్ట్యా సోమవారం జలంధర్లో భద్రతా సిబ్బంది కవాతు
16/18
దిల్లీలోని బుద్ధ జయంతి పార్కులో అల్పాహారం తీసుకుంటున్న మోదీ, కిషిద
17/18
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం కొమరారం, మసివాగు, పోచారం, బోయితండా, మాణిక్యారం పంచాయతీల పరిధిలో ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. కొమరారం నర్సరీ కోసం వేసిన షేడ్నెట్ మీద పడిన వడగళ్లు పెద్దపెద్ద రాళ్లలా మారి ఇలా కనిపించాయి.
18/18
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఆదివారం సాయంత్రం కురిసిన వడగళ్ల వర్షంతో పంటలకు నష్టం వాటిల్లడంతోపాటు ఇళ్ల పైకప్పులకు చిల్లులు పడ్డాయి. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో ఓ బియ్యం మిల్లు పైకప్పునకు ఇలా పెద్దసంఖ్యలో చిల్లులు పడ్డాయి.