News In Pics: చిత్రం చెప్పే సంగతులు-1 (25-03-2023)
Updated : 25 Mar 2023 12:32 IST
1/20
చిత్తూరు జిల్లాలోని గుడుపల్లె మండలం చిన్నపర్తికుంట గ్రామానికి చెందిన పురుషోత్తం అనే వ్యక్తి సినీ నటుడు రామ్చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ప్లాస్టిక్ బాటిళ్లపై ప్రత్యేక చిత్రాన్ని రూపొందించారు. ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన కల్పించేందుకు ఈ విధంగా చేసినట్లు చెప్పారు.
2/20
సినిమా కథలో మలుపుల మాదిరి సిద్దిపేట జిల్లాలో శుక్రవారం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వాతావరణం ఒక్కోరకంగా ఉంది. రాకపోకలు సాగించేవారికి ప్రతి పూటా కొత్త అనుభూతిని మిగిల్చింది.
3/20
ఇవి అరుదుగా కనిపించే గురువింద గింజలు. పూర్వం కంసాలి వృత్తి చేసే వారు గురువింద గింజల్ని బంగారం తూకం వేయడానికి ఉపయోగించేవారు. పది గింజల బరువుని ఒక గ్రాముగా లెక్కించేవారు. కనుమరుగైపోయిన గురువింద మొక్క హనుమకొండ జిల్లా కోమటిపల్లి గ్రామ శివారులోని నిరూప్నగర్లో కనిపించింది.
4/20
గుట్టల ఒడిలో రాతి శిల్పాలు వివిధ ఆకృతుల్లో కనిపిస్తుంటాయి. సహజంగా ఏర్పడిన రూపాలు జీవకళను సంతరించుకుంటాయి. హనుమకొండ జిల్లా దేవన్నపేట గ్రామ శివారులోని కత్తిగుట్ట వద్ద సర్ప రూపం పోలిన రాతి రూపం సాక్షాత్తు నాగేంద్రుడే పడగ విప్పినట్లు కనిపిస్తోంది. దీంతో బాహ్య వలయ రహదారిపై వెళ్తున్న వాహనదారులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు.
5/20
విశాఖ నగరంలో సినీతారల సందడి అభిమానులను అలరించింది. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పోటీలలో పాల్గొన్న పలు భాషల నటులు తమ ఆటతీరుతో ఆకట్టుకున్నారు. పీఎం పాలెంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు వచ్చిన అభిమానులు కరతాళధ్వనులతో వారిని ప్రోత్సహించారు.
6/20
కాకినాడ సముద్రతీరంలో మత్స్యకారులకు శుక్రవారం 16 కిలోల బరువైన చేప దొరికింది. స్థానికంగా దీన్ని పులిటేకు చేపగా పిలుస్తారు. కుంభాభిషేకం చేపల రేవులో దీన్ని వేలం వేయగా స్థానిక వ్యాపారి రాజు రూ.నాలుగు వేలకు కొనుగోలు చేశారు. హిమంతుర ఉర్నాక్ జాతికి చెందిన రెటిక్యులేట్ విప్రేగా దీన్ని పిలుస్తారు. దీని గురించి ఇన్ఛార్జి జిల్లా మత్స్యశాఖ అధికారిణి శ్రావణి వద్ద ప్రస్తావించగా.. ఇది అత్యంత అరుదైన చేప అని అన్నారు.
7/20
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలకేంద్రం నుంచి ఎర్రగుంట్లకు వెళ్లే రహదారి అర కిలోమీటరు మేర మిడ్పెన్నార్ కుడికాలువ పక్కనే ఉంది. రహదారి నుంచి కాలువ సుమారు 25 అడుగుల లోతులో ఉంటుంది. వాహనాలు ఏ మాత్రం అదుపుతప్పినా కాలువలోకి వెళ్లిపోవాల్సిందే. గట్టు పొడవునా చిన్నపాటి రక్షణగోడనైనా నిర్మించాలని గ్రామస్థులు, వాహనదారులు కోరుతున్నారు
8/20
ఖమ్మం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లో ఓ కోడి పెట్ట ఉసిరికాయ పరిమాణంలో ఉండే గుడ్డు పెట్టింది. గతం వారం రోజులుగా సాధారణ పరిమాణంలోనే గుడ్డు పెడుతోందని, శుక్రవారం మాత్రం అతి చిన్న పరిమాణంలో గుడ్డు పెట్టిందని యజమాని తెలిపారు
9/20
అసలే వేసవికాలం.. దీనికితోడు ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు సీహెచ్సీ ఆసుపత్రిలో సరిపడా ఫ్యాన్లు లేవు. ఫలితంగా శస్త్రచికిత్సల కోసం వచ్చిన మహిళలు ఉక్కపోతను భరించలేక ఇలా టేబుల్ ఫ్యాన్లను తెచ్చుకొని ఉపశమనం పొందుతున్నారు.
10/20
అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లికి చెందిన కరేటి శ్రీను గ్రామ సమీపంలోని రెండెకరాల్లో మిరప పంటను సాగు చేశారు. తోట చుట్టూ ముళ్లతీగతో కంచె ఏర్పాటు చేసినా కోళ్లు లోపలికి వెళ్లి కాయలు తింటున్నాయి. పశువులు, ఇతర జంతువులు తల లోపలికి పెట్టి మొక్కలను మేస్తున్నాయి. దీని నివారణకు రైతు కొత్తగా ఆలోచించారు. చేనుకు రక్షణగా ఖాళీ సంచులను ఇలా ఫెన్సింగ్ మాదిరి ఏర్పాటు చేశారు
11/20
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమ ప్రదేశాన్ని సందర్శించేందుకు భక్తులు తరలొస్తుంటారు. పుష్కర ఘాట్ వద్ద పుణ్యస్నానాలు ఆచరించి అక్కడే శివాలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం గోదావరి, మంజీర, హరిద్రా సంగమ ప్రదేశాన్ని చూసేందుకు ఈ మార్గం మీదుగా వెళ్తుంటారు. దారి మధ్యలో ఉన్న వారధిపై గత వానాకాలంలో కురిసిన భారీ వర్షాలకు ఎక్కడికక్కడ పగుళ్లు వచ్చి రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు ఆర్నెల్లు గడిచినా ఇంత వరకు మరమ్మతులకు నోచుకోలేదు
12/20
యాదాద్రిలోని కొండ కింద ఆధ్యాత్మిక వాడలోని లక్ష్మీపుష్కరిణి చెంత నీడనిచ్చే వసతుల్లేక భక్తజనులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటల దాటిందంటే భానుడి ప్రభావం వల్ల పుణ్యస్నానమాచరించలేక పోతున్నారు. మధ్యాహ్నం వేళ మరింత ఇబ్బంది పడుతున్నారు. క్షేత్రాభివృద్ధితో సదరు పుష్కరిణిని కొండ కింద ఏర్పరచిన విషయం తెలిసిందే. చలువపందిళ్లు, షెడ్ల సౌకర్యాలు కల్పించకపోవడంతో ఇక్కట్లకు మార్గం ఏర్పడిందని పలువురు భక్తులు అంటున్నారు.
13/20
రంజాన్ మాసం ప్రారంభం కావడంతో శుక్రవారం హైదరాబాద్లోని మక్కా మసీద్లో వేలాది మంది ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మసీద్ను విద్యుద్దీపాలతో అలంకరించారు.
14/20
విద్యుత్తు ఉద్యోగుల నిరసనతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. శుక్రవారం హైదరాబాద్లోని సోమాజిగూడలోని విద్యుత్తు సౌధలో జరిగిన మహా ధర్నాకు ఉద్యోగులు భారీగా తరలివచ్చి ప్రధాన రహదారిపైకి చేరుకోవడంతో నాంపల్లి నుంచి ఖైరతాబాద్ వరకు గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించింది.
15/20
రంగారెడ్డి జిల్లా పరిధి.. కర్మన్ఘాట్ ప్రధాన రహదారి మీదుగా మీర్పేటలోని టీఆర్ఆర్ పాలిటెక్నిక్ కళాశాలకు నిత్యం వందల సంఖ్యలో విద్యార్థులు వెళుతుంటారు. అతి తక్కువగా బస్సులు నడుస్తుండటంతో ఫుట్బోర్డుపై వేలాడుతూ ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు.
16/20
హైదరాబాద్లోని కూకట్పల్లిలో జేఎన్టీయూ బస్టాప్ పక్కన ఉన్న ఐసీఐసీఐ భవనం చెంత పరిస్థితి ఇది. దాదాపు పదడుగుల లోతున్న సెల్లార్ చుట్టూ గోడ లేకపోవడంతో పాదచారులకు ప్రమాదకరంగా మారింది. కాలిబాటపై నిత్యం రాకపోకలు సాగించేవారు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇందులో పడిపోయే ప్రమాదముంది.
17/20
ఫ్రాన్స్ రాజధాని పారిస్లోని గ్రెవిన్ వ్యాక్స్ మ్యూజియంలో ఏర్పాటుచేసిన బ్రిటన్ రాజు చార్లెస్-3 మైనపు విగ్రహం
18/20
గుజరాత్ రాజధాని గాంధీనగర్లో శుక్రవారం జీ-20 పర్యావరణ సుస్థిరత కార్యబృందం సమావేశం సందర్భంగా శాకాహారంపై ప్రచారం కల్పించడం కోసం ఆకుకూరలతో రూపొందించిన ప్రత్యేక దుస్తులను ధరించిన పెటా కార్యకర్తలు
19/20
పుట్టలు సాధారణంగా 3 నుంచి 4 అడుగుల ఎత్తు ఉంటాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం మత్య్సపురం పంచాయతీ బంగారుమెట్ట గ్రామ సమీపంలో సుమారు 15 అడుగుల ఎత్తు పుట్ట పెరిగింది. కొన్నేళ్లుగా ఈ పుట్ట పెరుగుతూ వస్తోందని గ్రామస్థులు తెలిపారు.
20/20
ఆకాశంలో శుక్రవారం రెండు అరుదైన ఘటనలు చోటుచేసుకున్నట్లు ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎన్.శ్రీరఘునందన్ తెలిపారు. ‘చంద్రునితో శుక్ర గ్రహణం, శుక్రునితో చంద్ర సంయోగం జరిగాయి. ఇవి సూర్యాస్తమయానికి ముందే జరగడంతో మనకు కనిపించలేదు. ఈ శుక్రగ్రహణం సాయంత్రం 4:45 గంటలకు మొదలై 5.30 గంటలకు ముగిసింది. లద్దాక్లోని అన్లే అబ్జర్వేటరీలో శాస్త్రవేత్తలు దీన్ని పరిశీలించారు.