News In Pics: చిత్రం చెప్పే సంగతులు
Updated : 27 May 2022 11:08 IST
1/16
అల్లూరి సీతారామరాజు జిల్లాలో మంచినీటి సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం రూ.లక్షలు వెచ్చిస్తున్నా ప్రయోజనం ఉండటం లేదు. అక్కడక్కడా నిర్మించిన తాగునీటి పథకాలు పర్యవేక్షణ కొరవడటంతో మూలకు చేరుతున్నాయి. పాడేరు మండలంలోని సలుగు పంచాయతీ కక్కి గ్రామంలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు కొండకోనలు దాటి మైళ్ల దూరం కాలినడకన వెళ్లి ఊటగెడ్డల నుంచి కలుషిత నీటిని సేకరిస్తున్నారు.
2/16
అమ్మఒడి పథకానికి బయోమెట్రిక్ వేసేందుకు లబ్ధిదారులకు సిగ్నల్ కష్టాలు తప్పడం లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలంలోని మారుమూల గెమ్మెలి, వంజరి పంచాయతీల్లో సిగ్నల్స్ సదుపాయం లేదు. వంజరి సమీప కొండల్లో సిగ్నల్ పాయింట్ వద్ద సచివాలయాల ఉద్యోగులు,
వాలంటీర్లు లబ్ధిదారులతో బయోమెట్రిక్ వేయించారు.
3/16
అందమైన పూలను చూడగానే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడెనిమిది రంగుల్లో గులాబీలు ఒకే దగ్గర కనిపిస్తే చూడటానికి రెండు కళ్లు సరిపోవు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఓ మహిళ ఆయా రంగుల్లో ఉన్న గులాబీలు విక్రయిస్తూ కనిపించింది. దగ్గరకు వెళ్లి చూస్తే అవి పూలుకావు. వాటి ఆకారంలో ఉన్న జడ రబ్బర్లు. చూసేందుకు బాగుండటంతో హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.
4/16
చూడముచ్చటైన చిన్న ఇల్లు... లారీ ఎక్కింది. రియల్ వ్యాపారం విస్తరిస్తుండటంతో ఫాంహౌస్లు, వెంచర్ల వద్ద కార్యాలయాలు, ఇతర అవసరాలకు ఉపయోగపడేవిధంగా ఇనుప రేకులతో తయారు చేయిస్తున్న రెడీమేడ్ ఇళ్లు (కంటైనర్ల) వాడకం పెరిగింది. ఇందులోనే పడక గది, వంటశాల, అటాచ్డ్ బాత్రూంలు ఉంటున్నాయి. పాపిరెడ్డిగూడ శివారులో ప్రధాన రహదారిపై లారీపై తరలిస్తున్నారు.
5/16
ఎండలు మండుతుండడంతో.. యువకులు, విద్యార్థులు పంట కాల్వలు, బావులు, చెరువుల్లో ఈత కొట్టేందుకు వెళ్తున్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని పాపయ్యపేట శివారు పాకాల వాగులో కొందరు యువకులు ఈత కొడుతూ ‘న్యూస్టుడే’ కెమెరాకు చిక్కారు. సరదా కోసం వెళ్లి విషాదానికి గురి కావద్దంటూ చుట్టు పక్కల వారు కోరుతున్నారు.
6/16
కరీంనగర్లోని మానేరు నది సమీపంలోని చెత్త డంపింగ్ యార్డుకు మంటలు అంటుకున్నాయి. నీటిని చల్లిస్తూ, ఇసుక పోయడంతో కొంత మేర మంటలు తగ్గినా దట్టంగా పొగ కమ్ముకుంటోంది. రెండు రోజులుగా ఈదరుగాలులు వీస్తుండటంతో పొగ నగరంలోకి వ్యాపించి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బయో మైనింగ్ ప్రక్రియ ఆలస్యమవుతుండటంతో సమస్య పరిష్కారం కావడం లేదు.
7/16
అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం ఖండివరం వద్ద పేదలకు ఇచ్చిన జగనన్న కాలనీలో ఏ మాత్రం వర్షం కురిసినా నీరు నిలిచిపోతుంది. దీంతో నిర్మాణ పనులు ఆపేయక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఇక్కడ ఇళ్ల నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నా.. తరచూ కురుస్తున్న వర్షాలు అడ్డంకిగా మారుతున్నాయి. ఇళ్ల స్థలాలు అంతంతమాత్రంగానే మెరక చేయడంతో ఈ సమస్య ఏర్పడుతోందని లబ్ధిదారులు చెబుతున్నారు.
8/16
హైదరాబాద్లో ఐఎస్బీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్) ద్విదశాబ్ది వేడుకలు, 2022 పీజీపీ బ్యాచ్ విద్యార్థుల స్నాతకోత్సవ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఎస్బీ ఆవరణలో మొక్క నాటి నీరు పోశారు.
9/16
గురువారం రాత్రి హైదరాబాద్ హైటెక్స్లో జరిగిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుమార్తె వివాహానికి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్, శోభ దంపతులు.
10/16
11/16
వీరంతా వరద బాధితులో, నిరాశ్రయులో కాదు. గాంధీ ఆసుపత్రికి వచ్చిన రోగుల సంబంధికులు. లోపల రోగులు అనారోగ్యంతో ఇబ్బందిపడుతుంటే కొత్తగా నిర్మించిన షెడ్డులో చాలీచాలని స్థలంలో సతమతమవుతున్నారు. మరికొందరు ఓపీకి వచ్చి మరుసటి రోజు తిరిగి రాలేక రాత్రికి ఇక్కడే సేద తీరుతున్నారు. దోమలు అధికంగా ఉండడంతో నిద్ర పట్టక అవస్థలు పడుతున్నారు.
12/16
మొక్కలు నాటగానే సరిపోదు.. వాటికి సంరక్షణ చర్యలూ అవసరమే. మొక్క దశలోనే అవి పాడవకుండా సాధారణంగా ఇనుప ట్రీగార్డులు ఏర్పాటు చేస్తుంటారు. అంతెందుకులే అనుకున్నారేమో.. ముళ్లకంప పెట్టి మమ.. అనిపించారు. బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు వద్ద కనిపించిన దృశ్యం.
13/16
పచ్చని పందిరి వేసినట్లు కనువిందు చేస్తున్న ఇవి ‘అందిరి’ చెట్లు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం కేంద్రంలోని వాల్మీకి గుడి కూడలిలో సుమారు 50 ఏళ్ల క్రితం నాటిన రెండు అందిరి మొక్కలు నేడు మానులై చల్లదనాన్ని పంచుతున్నాయి. పక్కపక్కనే ఉన్న ఈ రెండు వృక్షాలు సుమారు 100 అడుగులకు మించి విస్తరించి నీడని పంచుతున్నాయి.
14/16
ఐడియల్ డిగ్రీ కళాశాల(దిల్సుఖ్నగర్) 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం రవీంద్రభారతి ప్రధాన మందిరంలో రజతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యువతులు ర్యాంప్పై ఫ్యాషన్షో నిర్వహించారు. సినిమా పాటలు, జానపద నృత్యాలతో హోరెత్తించారు.
15/16
బ్రిటన్లోని మిడిల్టన్లో ఆల్ సెయింట్స్ చర్చి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లవర్ టవర్ ఇది. దీని కోసం 4300 పుష్పాలను చేతితో తయారు చేశారు. ఎలిజబెత్ రాణి ప్లాటినం జూబ్లీ వేడుకల్లో భాగంగా దీనిని ఏర్పాటు చేశారు.
16/16
అస్సాంలోని నగావ్ జిల్లా చపార్ముఖ్ గ్రామంలో వరద నీరు పోటెత్తడంతో రైలు పట్టాల పక్కనున్న జాగాలో గుడారాలు వేసుకున్న ప్రజలు.
Tags :