Arvind Kejriwal: బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్‌కు సుప్రీం సూచన

Arvind Kejriwal: మద్యం కేసులో అరవింద్‌ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే.. ఆయన సీఎంగా అధికారిక విధులు నిర్వర్తించొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే, దీనిపై ప్రస్తుతానికి కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు.

Published : 07 May 2024 15:10 IST

దిల్లీ: మద్యం విధానానికి (Delhi excise policy scam case) సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు సుప్రీంకోర్టులో ఇంకా ఊరట లభించలేదు. ఆయనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసే అంశంపై మంగళవారం విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం (Supreme Court).. లోక్‌సభ ఎన్నికల వేళ ఓ పార్టీ అధినేతగా ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఒకవేళ బెయిల్‌ మంజూరు చేస్తే ముఖ్యమంత్రిగా అధికారిక బాధ్యతలు నిర్వర్తించొద్దని సూచించింది. అయితే, ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. మరోవైపు, ఈ కేసులో కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌ కస్టడీని దిల్లీ రౌజ్‌ అవెన్యూ కోర్టు మే 20వ తేదీ వరకు పొడిగించింది.

ఈ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై విచారణకు సమయం పట్టే అవకాశం ఉన్నందున.. మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఇది అసాధారణ పరిస్థితి. అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రజలు ఎన్నుకున్న ఓ ముఖ్యమంత్రి. తరచూ నేరాలు చేసే వ్యక్తి కాదు. లోక్‌సభ ఎన్నికలు ఐదేళ్లకోసారి వస్తాయి. పార్టీ అధినేతగా ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది’’ అని వ్యాఖ్యానించింది.

అయితే, సుప్రీం అభిప్రాయాన్ని ఈడీ వ్యతిరేకించింది. ‘‘సీఎం అయినంత మాత్రాన ఈ కేసును ప్రత్యేకంగా పరిగణించకూడదు. కేసుల్లో రాజకీయ నాయకులకు మినహాయింపులు ఉండకూడదు. ఇప్పుడు బెయిల్‌ మంజూరు చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఇక, ఈ కేసులో కేజ్రీవాల్‌ దర్యాప్తునకు సహకరించలేదు. 9 సమన్లను పట్టించుకోలేదు. అందుకే అరెస్టు చేయాల్సి వచ్చింది’’ అని దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలిపింది.

అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ఒకవేళ ఈ కేసులో మీకు బెయిల్‌ మంజూరు చేస్తే అధికారిక విధులు నిర్వర్తించేందుకు మేం అనుమతించబోం. అలా చేస్తే ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటుంది. బెయిల్‌పై విడుదలైతే ఫైళ్లపై సంతకాలు చేయొద్దు’’ అని తెలిపింది. దీనికి కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. సీఎం ఎలాంటి పత్రాలపై సంతకాలు చేయరని, అయితే ఆ కారణంతో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వాటిని తిరస్కరించకుండా చూడాలని కోరారు.  ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. మధ్యంతర బెయిల్‌పై తీర్పును రిజర్వ్‌ చేసింది.

తొలుత అరెస్టుకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా దర్యాప్తులో జరుగుతున్న ఆలస్యంపై సుప్రీం అసహనం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్‌ అరెస్టు ముందు నాటి కేసు ఫైళ్లను సమర్పించాలని ఈడీని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు సంస్థ వాటిని ధర్మాసనం ముందు ఉంచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు