UGC: యూనివర్సిటీలు, కాలేజీల్లో సెల్ఫీ పాయింట్లు పెట్టండి..!
వివిధ రంగాల్లో భారత్ సాధించిన విజయాలపై యువతలో అవగాహన పెంచేలా కాలేజీలు, యూనివర్సిటీలకు యూజీసీ కీలక సూచనలు చేసింది.
Selfie Points in Colleges | దిల్లీ: పలు రంగాల్లో భారత్ సాధించిన విజయాలపై యువతలో అవగాహన పెంచడమే లక్ష్యంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కీలక ప్రకటన చేసింది. యూనివర్సిటీలు, కాలేజీ క్యాంపస్ల్లోని వ్యూహాత్మక ప్రదేశాల్లో సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ సెల్ఫీ పాయింట్లు కేంద్ర విద్యా శాఖ షేర్ చేసిన 3డీ లే అవుట్ల డిజైన్లకు అనుగుణంగా ఉండేలా చూడాలని కోరింది. దేశానికి గర్వకారణమైన అంశాలతో పాటు ప్రపంచ వేదికపై భారత్ అభివృద్ధిని ముందు తీసుకెళ్లిన పలు కార్యక్రమాలపై ప్రతి పౌరుడికీ అవగాహన కల్పించేలా ఈ Selfie points ఉండాలని యూజీసీ కార్యదర్శి మనీష్ జోషి తెలిపారు.
విద్యార్థులు, సందర్శకులు ఈ సెల్ఫీ పాయింట్ల వద్ద ఫొటోలు తీసుకొని, ఈ ప్రత్యేక క్షణాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసేలా ప్రోత్సహించాలన్నారు. అయితే, ఈ సెల్ఫీ పాయింట్లు ‘ఏక్భారత్ శ్రేష్ఠ్ భారత్’, ‘జాతీయ విద్యావిధానం-2020’ వంటి జాతీయ కార్యక్రమాల ఇతివృత్తాన్ని, వాటిలోని కీలక అంశాలను నొక్కి చెప్పేలా తీర్చిదిద్దాలని కోరారు. తద్వారా విభిన్న రంగాల్లో భారత్ సాధించిన అభివృద్ధిని యువత స్ఫూర్తిగా తీసుకొనే అవకాశం ఉంటుందని మనీష్ జోషి పేర్కొన్నారు. కళాశాలలు, యూనివర్సిటీల్లో ఏర్పాటు చేసే ఈ సెల్ఫీ పాయింట్లు యువతకు గర్వకారణంగానే కాకుండా, వారిలో అవగాహన పెంచడం, భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చే డైనమిక్, ఆకర్షణీయ ప్రదేశాలుగా నిలుస్తాయన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.