మలంలోని వైరస్తోనూ ప్రమాదమే!
మల విసర్జన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని వైద్యులు చాలాకాలంగా చెబుతున్నదే....
Published : 23 Jun 2020 00:32 IST
మల విసర్జన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని వైద్యులు చాలాకాలంగా చెబుతున్నదే. దీంతో అతిసారం, కలరా, హెపటైటిస్ వంటి జబ్బులను నివారించుకోవచ్ఛు అంతేకాదు, కరోనా జబ్బు రాకుండానూ కాపాడుకోవచ్చు! దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా వైరస్ వ్యాపిస్తుంది కదా. మలానికి సంబంధమేంటని అనుకుంటున్నారా? కరోనా వైరస్ ఆనవాళ్లు మలంలోనూ ఉంటున్నాయి! కొవిడ్-19 బారినపడ్డ దాదాపు సగం మందిలో మలంలోనూ వైరస్ ఉంటున్నట్టు ఇప్పటికే వెల్లడైంది. గొంతు, ముక్కు స్రావాలతో పోలిస్తే మలంలో ఇంకాస్త ఎక్కువకాలం వైరస్ ఉంటున్నట్టూ తేలింది. మలంలో ఉంటోంది వైరస్ జన్యు పదార్థమేనని, ఇది జబ్బుకు దారితీయకపోవచ్చనే ఇప్పటివరకూ భావిస్తూ వస్తున్నారు. కానీ ఇదీ ఇన్ఫెక్షన్కు దారితీయగలదని ప్రయోగశాలలో నిర్వహించిన తాజా అధ్యయనంలో బయటపడటం గమనార్హం. కరోనా బాధితుల్లో విరేచనాలు, వాంతుల వంటి జీర్ణకోశ లక్షణాలు తరచూ చూస్తున్నవే. అందువల్ల మల విసర్జన అనంతరం చేతుల శుభ్రత చాలా కీలకమని అంతా గుర్తుంచుకోవాలి. మనం తాకే వస్తువులన్నింటి మీదా మలంలోని బ్యాక్టీరియా ఉంటున్నట్టు గత అధ్యయనాలు పేర్కొంటున్న విషయాన్ని విస్మరించరాదు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ
దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి
కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి
సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు
యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు
లేదు.