ప్రాణాలు కాపాడారు.. అవార్డులు సాధించారు

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనలో చాలామందికి నీళ్లన్నా, అందులో ఆడుకోవడమన్నా భలే ఇష్టం. కొందరికి మాత్రం నీళ్లంటేనే భయం.. నీటి దగ్గరకు వెళ్లాలంటే.. అమ్మో అంటాం! అలాంటిది ముగ్గురు బాలురు మాత్రం ధైర్యంగా నీళ్లలోకి దూకి మునిగిపోతున్న వాళ్లను రక్షించారు.

Published : 03 Mar 2021 01:37 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనలో చాలామందికి నీళ్లన్నా, అందులో ఆడుకోవడమన్నా భలే ఇష్టం. కొందరికి మాత్రం నీళ్లంటేనే భయం.. నీటి దగ్గరకు వెళ్లాలంటే.. అమ్మో అంటాం! అలాంటిది ముగ్గురు బాలురు మాత్రం ధైర్యంగా నీళ్లలోకి దూకి మునిగిపోతున్న వాళ్లను రక్షించారు. అంతేకాదు.. జాతీయ అవార్డులకూ ఎంపికయ్యారు. వాళ్లెవరో, ఆ విశేషాలేంటో తెలుసుకుందామా..!!

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ చిల్డ్రన్‌ వెల్ఫేర్‌(ఐసీసీడబ్ల్యూ) విభాగం దేశవ్యాప్తంగా పలువురిని జాతీయ ధైర్య పురస్కారాలకు ఎంపిక చేసింది. వారిలో కేరళ రాష్ట్రం నుంచి ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఇంకో విశేషం ఏంటంటే.. ఆ చిన్నారుల చదువులకయ్యే పూర్తి ఖర్చును ఐసీసీడబ్ల్యూ భరించనుందట.

చెరువులో మునిగిపోతున్న రైతును..

ప్రస్తుతం ఇంటర్‌ చదువుతున్న మహమ్మద్‌ హమ్రస్‌ది మలప్పురం. ఓ రైతు తన పొలానికి నీళ్లు పెడుతుండగా ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడు. నీటిలో మునిగిపోతున్న రైతును చూసిన హమ్రస్‌.. తన ప్రాణాలకు తెగించి అందులోకి దూకాడు. ఎలాగోలా కష్టపడి రైతును ఒడ్డుకు తీసుకొచ్చి శెభాష్‌ అనిపించుకున్నాడు. హమ్రస్‌ చూపిన తెగువకు ఐసీసీడబ్ల్యూ అవార్డుతో పాటు రూ.40 వేలు అందుకోనున్నాడు.


కాల్వలో కొట్టుకుపోతుండగా..

మలప్పురానికి చెందిన ఉమర్‌ ముక్తర్‌ ప్రస్తుతం ఆరో తరగతి చదువుతున్నాడు. అక్కడి ఓ కాలువలో మునిగిపోతున్న ఇద్దరు చిన్నారులను ఎంతో కష్టపడి రక్షించాడు. వారిద్దరూ ఉమర్‌కు బంధువులేనట. అతడి ధైర్యానికి గుర్తింపుగా ఐసీసీడబ్ల్యూ పురస్కారానికి ఎంపికయ్యాడు. రూ.75వేల నగదు బహుమతితో పాటు మెడల్‌ పొందనున్నాడు. 


క్వారీ గుంతలోకి దిగి..

వయనాడ్‌కు చెందిన జయకృష్ణన్‌ బాబు క్వారీ గుంతలో మునిగిపోతున్న ఇద్దరిని రక్షించాడు. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్న అతడి తండ్రి కూలీ పనులకు వెళ్తుండగా.. తల్లి కాఫీ తోటల్లో కార్మికురాలు. జయకృష్ణన్‌ సాహసాన్ని మెచ్చుకున్న ఐసీసీడబ్ల్యూ ఈసారి అవార్డుకు ఎంపిక చేసింది. రూ.40 వేలతో పాటు మెడల్‌ అందించనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని