స్థిరాస్తి ప్రాజెక్టులపై నివేదికలు కీలకం

స్థిరాస్తి సంస్థలు తమ ప్రాజెక్టుల పురోగతి, విక్రయాలపై క్రమం తప్పకుండా ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చే విధానంతో అక్రమాలకు అడ్డుకట్టపడుతుందని రాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ అన్నారు.

Published : 02 Sep 2023 01:06 IST

వాటిద్వారానే అక్రమాలకు అడ్డుకట్ట
శిక్షణ కార్యక్రమంలో రెరా ఛైర్మన్‌ సత్యనారాయణ

ఈనాడు, హైదరాబాద్‌: స్థిరాస్తి సంస్థలు తమ ప్రాజెక్టుల పురోగతి, విక్రయాలపై క్రమం తప్పకుండా ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చే విధానంతో అక్రమాలకు అడ్డుకట్టపడుతుందని రాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ అన్నారు. నిర్మాణ సంస్థలు, లేఅవుట్ల ద్వారా ప్లాట్లను విక్రయించే సంస్థలు ప్రతి మూడు నెలలకు నివేదికలు ఇవ్వాలని స్పష్టంచేశారు. ఆయా అంశాలపై అవగాహన లేకపోవటంతో ఇప్పటివరకూ నివేదికలు ఇచ్చే విధానం కొరవడిందని పేర్కొన్నారు. రెరా చట్టం అమలుపై సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో ప్రారంభించి మాట్లాడారు. ‘బిల్డర్లు, ప్రమోటర్లు ఇచ్చే నివేదికలను అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించాలి. లోటుపాట్లను గుర్తించి ఆయా సంస్థలకు నోటీసులు ద్వారా తెలియజేయాలి. దీంతో తరువాత మూడు నెలలకు ఇచ్చే నివేదికల విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటారు. తద్వారా 90 శాతం అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది’ అని సత్యనారాయణ అన్నారు.

పరిహారం చెల్లింపుల్లో ముందున్న కర్ణాటక, తమిళనాడు
స్థిరాస్తి ప్రాజెక్టులపై నివేదికలు ఇవ్వడంలో గుజరాత్‌ అగ్రస్థానంలో ఉందని, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక తరవాత స్థానాల్లో ఉన్నాయని బెంగళూరుకు చెందిన ట్రయిల్‌ బేస్‌ అడ్వకేట్స్‌ అండ్‌ లీగల్‌ కన్సల్టెంట్స్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు. శిక్షణ కార్యక్రమంలో వీరు పాల్గొని మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన నిర్మాణదారుల నుంచి కొనుగోలుదారులకు నష్టపరిహారం చెల్లింపుల్లో కర్ణాటక, తమిళనాడు ముందువరుసలో ఉన్నాయని వివరించారు. రెరా నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన ప్రాజెక్టులు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. శిక్షణ కార్యక్రమంలో రెరా సభ్యులు కె.శ్రీనివాస్‌రావు, జె.లక్ష్మీనారాయణ, అధికారులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు