అగ్నికీలల్లో అమలాపురం

అడుగడుగునా ఉద్రిక్తత.. అంతటా ఉత్కంఠ.. ఓవైపు లాఠీలు ఝుళిపించిన పోలీసులు.. ప్రతిగా రాళ్ల దాడులకు దిగిన ఆందోళనకారులు.. కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా రణరంగంగా మారింది.

Updated : 25 May 2022 09:00 IST

కోనసీమ జిల్లా పేరు మార్చొద్దంటూ చేపట్టిన ఆందోళన హింసాత్మకం
మంత్రి విశ్వరూప్‌, ఎమ్మెల్యే సతీష్‌ నివాసాలకు నిప్పు
‘చలో అమలాపురం’ ఉద్రిక్తం.. పోలీసుల లాఠీఛార్జి
నిరసనకారుల రాళ్ల దాడి.. ఎస్పీ సహా 100 మందికి గాయాలు  
3 బస్సుల ధ్వంసం
గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు
- ఈనాడు, అమలాపురం, న్యూస్‌టుడే, అమలాపురం పట్టణం, గ్రామీణం, అల్లవరం, పి.గన్నవరం

అడుగడుగునా ఉద్రిక్తత.. అంతటా ఉత్కంఠ.. ఓవైపు లాఠీలు ఝుళిపించిన పోలీసులు.. ప్రతిగా రాళ్ల దాడులకు దిగిన ఆందోళనకారులు.. కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా రణరంగంగా మారింది. కోనసీమ జిల్లా పేరును డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మార్చొద్దంటూ ఆరంభమైన ఆందోళన హింసకు దారితీసింది. మంత్రి విశ్వరూప్‌, ఎమ్మెల్యే సతీష్‌ నివాసాలకు నిరసనకారులు నిప్పుపెట్టారు.

సెక్షన్‌ 144, 30 పోలీస్‌ యాక్టు ఆంక్షలను లెక్కచేయని ఆందోళనకారులు తీవ్ర నిరసన తెలపడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న అమలాపురం వీధులు వేల మంది ఆందోళనకారులతో నిండి పరిస్థితి చేయిదాటింది. సామాన్యులు, ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉరుకులు పరుగులు తీశారు. నెలన్నర కిందట జిల్లాల విభజనలో భాగంగా కోనసీమ జిల్లాను ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కోనసీమ పేరును కొనసాగించాలనే డిమాండ్లు మళ్లీ తెరమీదకొచ్చాయి. ఇప్పటికే వందల సంఖ్యలో వినతులు కలెక్టరు కార్యాలయానికి చేరాయి. కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ ‘కోనసీమ జిల్లా సాధన సమితి’ చలో అమలాపురానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచే భారీగా మోహరించిన పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. వీటిని ఛేదించుకుని ఆందోళనకారులు భారీ సంఖ్యలో గడియార స్తంభం దగ్గరకు చేరుకున్నారు. ‘కోనసీమ పేరే ముద్దు.. మరే పేరూ వద్దు’ అని నినదిస్తూ కలెక్టరేట్‌ వైపు దూసుకెళ్లారు. వారిని నియంత్రించే క్రమంలో పోలీసులు లాఠీలు ఝుళిపించారు. రెచ్చిపోయిన ఆందోళనకారులు వారిపై రాళ్లు రువ్వారు. రాళ్ల దాడి నుంచి తప్పించుకోవడానికి పోలీసులు పరుగులు పెట్టారు. ఉదయం నుంచి పరిస్థితి పోలీసుల అదుపులోనే ఉన్నట్లు కనిపించినా మధ్యాహ్నానికి అదుపుతప్పింది.

* నిరసనకారులు కలెక్టరేట్‌కు రాకుండా కట్టడి చేయడంలో పోలీసుల ప్రయత్నాలు ఫలించలేదు. లాఠీఛార్జి, రాళ్లు రువ్వుకునే క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. ఎస్పీ సుబ్బారెడ్డి, మరో పోలీసు అధికారి, ఓ గన్‌మెన్‌, మహిళా కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. డీఎస్పీ వై.మాధవరెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. పోలీసులు, ఆందోళనకారులు 100 మందికి పైగా గాయపడ్డారు. కొందరు మీడియా ప్రతినిధులకూ గాయాలయ్యాయి.

భారీగా మోహరించినా...

కోనసీమ జిల్లా పేరును డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసిన ప్రభుత్వం అభ్యంతరాలు, సూచనల స్వీకరణకు నెల రోజుల గడువిచ్చింది. వినతులు కలెక్టర్‌ కార్యాలయానికి అందించే వెసులుబాటు కల్పించింది. ఆందోళనలు నిర్వహించకుండా 144 సెక్షన్‌, 30 పోలీసు యాక్టు అమల్లోకి తెచ్చారు. వాస్తవానికి సోమవారం నాటి స్పందన కార్యక్రమం రోజునే ఉద్రిక్తతకు అవకాశం ఉందని భావించిన పోలీసులు భారీగా మోహరించారు. ఆంక్షల నడుమ కలెక్టరేట్‌ లోపలికి సందర్శకులను పరిమితంగా అనుమతించారు. మంగళవారం కోనసీమ ఉద్యమ సమితి చలో అమలాపురానికి సిద్ధమైంది. దీనిని ముందే గ్రహించిన పోలీసులు ప్రధాన కూడళ్లలో మోహరించారు. మంగళవారం ఉదయం నుంచి తనిఖీలు ముమ్మరం చేశారు. అమలాపురంలోని ఎర్రవంతెన, నల్లవంతెన, ఈదరపల్లి, కొంకాపల్లి, గడియార స్తంభం, హైస్కూల్‌ సెంటర్‌ తదితర ప్రాంతాల్లో పోలీస్‌ పికెట్లు ఏర్పాటు చేశారు. కోనసీమ ఎస్పీ సుబ్బారెడ్డి, ఏఎస్పీ లతామాధురి, డీఎస్పీ మాధవరెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ సిబ్బందికి సూచనలు చేశారు. ఆందోళనకారులు వచ్చే మార్గాలను నిలువరించే ప్రయత్నం చేశారు.  

పోలీసులకు ముచ్చెమటలు...

నిరసనకారులు క్షణక్షణానికీ తమ వ్యూహాలు మారుస్తూ పోలీసులకు ముచ్చెమటలు పట్టించారు. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పోలీసులు వ్యవహరించిన తీరు, వారి ఏర్పాట్లను నిశితంగా పరిశీలించిన ఆందోళనకారులు మధ్యాహ్నం దాకా స్తబ్దుగా ఉండి ఒక్కసారిగా వివిధ మార్గాల నుంచి వేలాదిగా రహదారులపైకి వచ్చారు.

* మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆర్టీసీ బస్టాండ్‌ వైపు నుంచి వేల మంది యువత ప్రదర్శనగా గడియార స్తంభం కూడలికి చేరుకున్నారు. వీరిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఆందోళనకారులను నిలువరించేందుకు కొందరు పోలీసులు లాఠీఛార్జికి దిగారు. గడియార స్తంభం కూడలి నుంచి నల్లవంతెన.. అక్కడి నుంచి కలెక్టరేట్‌ వైపు ఆందోళనకారులు దూసుకెళ్లారు. ఈక్రమంలో అమలాపురం పట్టణం రణరంగాన్ని తలపించింది. మంగళవారం రాత్రి అమలాపురం చేరుకున్న... ఏలూరు రేంజీ డీఐజీ పాలరాజు, కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రాజమహేంద్రవరం, కాకినాడ, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి కోనసీమకు అదనపు బలగాల్ని రప్పించారు.  

మేం ఉగ్రవాదులం కాదు...

ఆందోళనను నిలువరించేందుకు పోలీసులు నల్లవంతెనపై రహదారికి అడ్డంగా లారీలు, ట్రాక్టర్లను పెట్టారు. అడ్డు తొలగించకపోవడంతో ఆందోళనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మేమేమీ ఉగ్రవాదులం, మావోయిస్టులం కాదు.. ప్రభుత్వ నిబంధనలకు లోబడే అభ్యంతరాలను తెలిపేందుకు కలెక్టరేట్‌కు వెళుతున్నామనీ, ఇదెక్కడి న్యాయమంటూ నిలదీశారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు.


మంటల్లో మంత్రి, ఎమ్మెల్యే నివాసాలు

ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని తరలించడానికి సిద్ధంగా ఉంచిన వాహనాలపై పలువురు దాడికి దిగారు. కలెక్టరేట్‌ ఆవరణలో ఆందోళనకారులను తరలించేందుకు తెచ్చిన ప్రైవేటు కళాశాల బస్సును ధ్వంసం చేసి.. నిప్పంటించారు. కొందరు కలెక్టరేట్‌ లోపలికి దూసుకెళ్లారు. మరోవైపు ఎర్రవంతెన దగ్గర పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఆగ్రహించిన ఆందోళనకారులు రెండు ఆర్టీసీ బస్సులకు నిప్పంటించారు. అమలాపురంలో ఎస్బీఐ కాలనీలో మంత్రి పినిపే విశ్వరూప్‌ క్యాంపు కార్యాలయం, నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టి నిప్పంటించారు. ముఖ్యమంత్రి డౌన్‌డౌన్‌.. మంత్రి డౌన్‌ డౌన్‌.. జై కోనసీమ.. జైజై కోనసీమ అంటూ నినదించారు. మంత్రి భార్య, పిల్లలను ఆందోళనకారులు వచ్చేకంటే ముందే పోలీసులు సురక్షితంగా వేరే వాహనంలో పంపించారు. అమలాపురంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో ఉన్న ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ నివాసం దగ్గరకు చేరుకున్న ఆందోళనకారులు రాళ్లు రువ్వి.. ధ్వంసం చేసి నిప్పంటించారు. అక్కడా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఆ సమయంలో సతీష్‌ కుమార్‌, కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారు. వారిని రక్షించే క్రమంలో పోలీసులు ఐదు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో ఆందోళనకారులు వెనక్కి తగ్గారు. మరోవైపు భట్నవిల్లిలో నిర్మాణంలో ఉన్న మంత్రికి చెందిన మరో ఇంటికి నిప్పుపెట్టారు.



 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని