న్యాయస్థానంలో లొంగిపోయిన తహసీల్దారు

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం పంపిణీలో అక్రమాలకు పాల్పడిన తహసీల్దారు వీర్రాజు గురువారం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం కోర్టులో లొంగిపోయారు. దేవీపట్నం తహసీల్దారుగా పనిచేసిన

Published : 24 Jun 2022 05:17 IST

పోలవరం నిర్వాసితులకు పరిహారంలో అక్రమాల కేసు

రంపచోడవరం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం పంపిణీలో అక్రమాలకు పాల్పడిన తహసీల్దారు వీర్రాజు గురువారం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం కోర్టులో లొంగిపోయారు. దేవీపట్నం తహసీల్దారుగా పనిచేసిన వీర్రాజుతోపాటు వీఆర్వో సత్తార్‌లపై ప్రభుత్వం ఇటీవల సస్పెన్షన్‌ వేటువేసింది. వీరితోపాటు మరో ఏడుగురిపై దేవీపట్నం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. దేవీపట్నం మండలం గుబ్బలంపాలెంలో నిర్వాసిత గిరిజన రైతులకు భూ పరిహారం పంపిణీలో రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడ్డారు. గుబ్బలంపాలెంలో కొత్త సర్వే నంబర్లు సృష్టించి రూ.2.24 కోట్లు కాజేశారు. దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే, తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి వంతల రాజేశ్వరి స్థానిక ఐటీడీఏ ఎదుట గతంలో ఐదురోజులపాటు నిర్వాసితులతో కలిసి నిరాహార దీక్ష చేపట్టారు. అధికారులు స్పందించి విచారణ చేపట్టి అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. తహసీల్దారుగా పనిచేస్తున్న వీర్రాజు, వీఆర్వో సత్తార్‌లను సస్పెండ్‌ చేశారు. వీరితోపాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు వారెంట్‌ సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం తహసీల్దారు కోర్టులో లొంగిపోయారు. జులై 7 వరకు కోర్టు రిమాండ్‌ విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని