Andhra news: గర్భిణుల సాయానికీ డబ్బుల్లేవ్‌

పేద గర్భిణులకు ఆర్థిక సాయం అందించే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన (పీఎంఎంవీవై) అమలుకు రాష్ట్ర ప్రభుత్వం మోకాలడ్డుతోంది. దీంతో సుమారు రెండు లక్షల మంది ఆర్థిక సాయం కోసం నెలల

Updated : 15 Aug 2022 12:17 IST

2 లక్షల మంది గర్భిణులకు అందని చేయూత

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేంద్రం అసహనం

మీ వాటా పెండింగ్‌ సొమ్ము

చెల్లిస్తేనే నిధులిస్తామని స్పష్టీకరణ

ఈనాడు - అమరావతి

పేద గర్భిణులకు ఆర్థిక సాయం అందించే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన (పీఎంఎంవీవై) అమలుకు రాష్ట్ర ప్రభుత్వం మోకాలడ్డుతోంది. దీంతో సుమారు రెండు లక్షల మంది ఆర్థిక సాయం కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. ఈ పథకం కింద ఒక్కో గర్భిణికి మూడు దఫాలుగా మొత్తం రూ.5,000 అందిస్తారు. పీఎంఎంవీవై కింద ఏడాదికయ్యే మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరించాలి. కేంద్రం నిధులిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా సొమ్ములు చెల్లించడానికి మీనమేషాలు లెక్కిస్తోంది. పెండింగ్‌లో ఉన్న మీ వాటా సొమ్మంతా చెల్లించండి.. ఆ తర్వాత మా నిధులిచ్చే సంగతి చూస్తామని చెబుతోంది. మరో నెలలో రెండో త్రైమాసికం కూడా ముగియబోతున్నా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం గమనార్హం.
శ్రద్ధ పెడితే కదా!

తల్లీబిడ్డల సంరక్షణ నిమిత్తం గర్భిణులకు ఆర్థిక సాయం చేసేందుకు కేంద్రం 2016 నుంచి పీఎంఎంవీవై అమలు చేస్తోంది. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి దీనిలో సమస్యలు మొదలయ్యాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరాల్లోని గర్భిణులకూ ఈ పథకం ప్రయోజనం కల్పిస్తామని కేంద్రం ప్రకటించడంతో 2019-20లో లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఆ ఏడాది తొలి మూడు త్రైమాసికాలకు కేంద్రం మొత్తం రూ.101.25 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా రూ.67 కోట్లను ఆ సంవత్సరం ఇవ్వకపోవడంతో కేంద్రం నాలుగో విడత నిధులు విడుదల చేయలేదు. 2021-22లో కొత్త నిబంధనల ప్రకారం దాదాపు 1.91 లక్షల మంది గర్భిణులకు సాయం అందుతుందని అంచనా వేశారు. తొలి త్రైమాసికంలో కేంద్రం రూ.14 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.9 కోట్లు జమ చేయాల్సి ఉంది. రాష్ట్రం ఇవ్వాల్సింది రూ.70 కోట్లకు చేరింది. అవి ఎప్పటికప్పుడు ఇవ్వకపోవడంతో సమస్యలు మొదలయ్యాయి. రాష్ట్రం వాటా సొమ్ములు ఇస్తేనే తాము నిధులు విడుదల చేస్తామంటూ కేంద్రం షరతు విధించింది. ఎట్టకేలకు 2022 మార్చి చివర్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.70 కోట్లు చెల్లించింది. వెంటనే మిగిలిన మొత్తం ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ రాసింది. అప్పటికే ఆర్థిక సంవత్సరం ముగియడంతో కేంద్రం చివర్లో కేవలం రూ.5 కోట్లు మాత్రమే ఇచ్చింది. దాంతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో కేంద్రంనుంచి రావాల్సిన మొత్తం నిధులు అందలేదు. 2021-22లో తన వాటాగా చెల్లించాల్సిన రూ.4 కోట్లపై ప్రభుత్వం స్పందించడం లేదు.


కోల్పోయింది రూ. 85 కోట్లు

2019-20 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రం దాదాపు రూ.85 కోట్లు నష్టపోయినట్లు కేంద్ర, రాష్ట్ర ఆర్థిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2019-20లో రూ.37.75 కోట్లు, 2020-21లో రూ.38.30 కోట్లు కేంద్రం నుంచి రాలేదు. ప్రస్తుత (2022-23) ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.14 కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటి వరకూ విడుదల కాలేదు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.4 కోట్లు చెల్లించలేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ తీరును రెండేళ్లుగా గమనిస్తున్న కేంద్రం ఈ ఏడాది తొలి త్రైమాసికం నిధులు కూడా ఇవ్వను పొమ్మంటోంది.


* ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కలిపి 15 వేల మంది లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.

* కొందరికి ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతాల నిర్వహణ, ఇతర సమస్యల కారణంగా పంపిణీ సకాలంలో జరగడం లేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని