Andhra News: రైతుభరోసా ఇచ్చేందుకు కులమేంటి?: జడ్పీ మీటింగ్‌లో వైకాపా ఎమ్మెల్సీ

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 80 శాతానికిపైగా కౌలు రైతులే భూములు సాగు చేస్తున్నారని, వారికి సీసీఆర్‌సీ కార్డులు లేనందున ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేకపోతున్నారని వైకాపా ఎమ్మెల్యేలు, జడ్పీటీసీ సభ్యులు పేర్కొన్నారు.

Updated : 17 Aug 2022 09:22 IST

ఈనాడు, కాకినాడ: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 80 శాతానికిపైగా కౌలు రైతులే భూములు సాగు చేస్తున్నారని, వారికి సీసీఆర్‌సీ కార్డులు లేనందున ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేకపోతున్నారని వైకాపా ఎమ్మెల్యేలు, జడ్పీటీసీ సభ్యులు పేర్కొన్నారు. కాకినాడలో మంగళవారం జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్తు సమావేశంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ సాగు హక్కుపత్రాలు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం లేదని, అందుకే కౌలుదారులు నష్టపోయినా పరిహారం రావడం లేదని చెప్పారు. మంత్రి వేణుగోపాలకృష్ణ స్పందిస్తూ దీనిపై ప్రభుత్వం జీవో విడుదల చేసిందని చెప్పారు. ‘ఓసీలకు సీసీఆర్‌సీ కార్డులు ఇవ్వడం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలురైతులకు ఇస్తున్న రైతుభరోసా సొమ్ము.. ఓసీలకు ఎందుకివ్వరు? రైతులకు కులమేంటి?’ అని త్రిమూర్తులు ప్రశ్నించారు.

స్వాతంత్య్ర వేడుకల్లో తమకు కనీస ప్రొటోకాల్‌ పాటించలేదని, మండల కార్యాలయాల్లో ఛాంబర్లు, కుర్చీలు కూడా లేవని పలువురు జడ్పీటీసీ సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. రోడ్లు చూస్తే తమకే సిగ్గేస్తోందని, ప్రజలకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదని ప్రజాప్రతినిధులు వ్యాఖ్యానించారు. ఓ దశలో సభ్యులంతా లేచి నిల్చొని నిరసన తెలిపారు. జడ్పీటీసీ సభ్యుల సమస్యలను వివరించే క్రమంలో ఎమ్మెల్యే చంటిబాబు, మంత్రి వేణు మధ్య సంవాదం నడిచింది. ‘చంటిబాబూ నాట్‌ రైట్‌.. నువ్వు సమావేశం నడుపుతానంటే పైకొచ్చి నడుపు. ప్రతి విషయంలోనూ అడ్డురావొద్ద’ని మంత్రి అసహనం వ్యక్తంచేయగా, ‘నడుపమంటే నడుపుతాం’ అని చంటిబాబు బదులివ్వడం గమనార్హం.


సముచిత ఆసనం!

ళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా జైల్లో ఉన్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు కోసం జడ్పీ సమావేశంలో కేటాయించిన సీటు. అనంతబాబు ఖైదీగా ఉన్నారని తెలిసినా.. ప్రొటోకాల్‌ ప్రకారం ముందు వరుసలో కుర్చీ వేయడం చర్చనీయాంశమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని