Telecom sector: టెలికాం సెక్టార్‌లో 100% ఎఫ్‌డీఐ.. కేంద్ర కేబినెట్‌ నిర్ణయం

అప్పుల్లో కూరుకుపోయిన టెలికాం రంగానికి కేంద్రం ఊరటనిచ్చింది. టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చేయాల్సిన చెల్లింపులపై మారటోరియం ప్రకటించింది.

Updated : 15 Sep 2021 16:18 IST

దిల్లీ: టెలికాం రంగంలో కేంద్రం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఆటోమేటిక్‌ రూట్‌లో ఈ రంగంలో నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) అనుమతిస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. అలాగే, అప్పుల్లో కూరుకుపోయిన టెలికాం రంగానికి ఊరటనిచ్చేలా ఏజీఆర్‌ బకాయిలపై నాలుగేళ్ల మారటోరియం ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో టెలికాం రంగానికి సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. సంబంధిత వివరాలను టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు వెల్లడించారు.

టెలికాం రంగానికి సంబంధించి పలు నిర్మాణాత్మక సంస్కరణలకు కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు మంత్రి వెల్లడించారు. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయానికి (ఏజీఆర్‌) సంబంధించి ప్రస్తుతం ఉన్న నిర్వచనం ఈ రంగంపై భారానికి ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. అందుకే ఏజీఆర్‌ నిర్వచనాన్ని హేతుబద్ధీకరిస్తున్నట్లు తెలిపారు. ఇకపై టెలికామేతర ఆదాయాలను ఏజీఆర్‌ నుంచి మినహాయించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. అలాగే, ఏజీఆర్‌ బకాయిల కింద టెలికాం కంపెనీలు చెల్లించాల్సిన మొత్తాలపై మారటోరియం విధిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ రంగంలో నూరు శాతం ఎఫ్‌డీఐలు అనుమతించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు వివరించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల టెలికాం రంగంలో కొన్ని కంపెనీలకు నగదు కొరత తీరుతుందని ఆశిస్తున్నట్లు మంత్రి చెప్పారు.

ఏజీఆర్‌ బకాయిలు చెల్లించాలని టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. వేల కోట్ల రూపాయలు ఒక్కసారి చెల్లించడం భారంతో కూడుకున్నదని పేర్కొంటూ ఆయా కంపెనీలు సుప్రీంను ఆశ్రయించగా.. ఏజీఆర్‌ బకాయిలను 10ఏళ్లలో చెల్లించేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఎక్కువగా బకాయి పడిన వొడాఫోన్‌ ఐడియా ఇప్పటికే రూ.7,854 కోట్లు చెల్లించింది. మరో రూ.50వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అప్పుల్లో కూరుకుపోయిన తమ కంపెనీని ప్రభుత్వమే ఆదుకోవాలని పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో కేబినెట్‌  ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు టెలికాం రంగానికి అనుకూలంగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో స్టాక్‌ మార్కెట్‌లో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా షేర్లు రాణించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని