ఆన్‌లైన్‌లో ట్రేడింగ్ ఖాతా తెరుస్తున్నారా.. నామినీ న‌మోదు మ‌ర‌వ‌ద్దు..

నామినీని నియ‌మించేందుకు ఒక ప్ర‌త్యేక ఫారం ఉంటుంది. ఆ ఫారం నింపి, సంత‌కం చేసి బ్రోకింగ్ హౌస్‌కి భౌతికంగా అంద‌జేయాలి. 

Published : 23 Mar 2021 15:32 IST

ఆన్‌లైన్ ద్వారా ట్రేడింగ్ ఖాతాల‌ను తెరిచేందుకు చాలా మంది మ‌దుప‌రులు ఆశ‌క్తి చూపుతున్నారు. అయితే అధిక శాతం నామినీని జోడిచ‌టం మ‌ర్చిపోతున్నార‌ని, కొంత‌మంది న‌మోదు ప్ర‌క్రియ‌ను ఆల‌స్యం చేస్తున్నార‌ని బ్రోకింగ్ హౌస్‌లు చెబుతున్నాయి. 

పెట్టుబ‌డిదారులు వారి ఖాతాలో ఉన్న షేర్లు, ఇత‌ర సెక్యూరిటీలు త‌‌మ‌ త‌ద‌నంత‌రం కావాల్సిన‌వారికి చ‌ట్ట‌బ‌ద్ధంగా బ‌దిలీ అయ్యేలా  నామినేష‌న్ స‌హ‌క‌రిస్తుంది. ఈ ప్ర‌క్రియ‌ను పూర్తిచేయ‌డంలో ఆల‌స్యం చేస్తున్నారు చాలామంది. ఒక‌వేళ నామినీని నియ‌మించ‌కుండానే ఖాతాదారుడు మ‌ర‌ణిస్తే, అది భ‌విష్య‌త్తులో చట్టపరమైన వారసులకు సమస్యలను సృష్టిస్తుంది.

నామినీని నియ‌మించేందుకు ఒక ప్ర‌త్యేక ఫారం ఉంటుంది. ఆ ఫారంని డౌన్‌లోడ్ చేసుకుని, అవ‌స‌ర‌మైన అన్ని వివ‌రాల‌ను పూర్తి చేసి, సంత‌కం చేసి బ్రోకింగ్ హౌస్‌కి కొరియ‌ర్ చేయాలి. 

డీమ్యాట్ ఖాతాలో ఉన్న షేర్లు, ఇత‌ర సెక్యూరిటీలు ఖాతాదారుని అనంత‌రం నామినీకి బ‌దిలీ చేస్తారు. అందువల్ల స్టాక్ బ్రోకర్లు, డిపాజిటరీలు, సెంట్రల్ డిపాజిటరీ సెక్యూరిటీస్ లిమిటెడ్(సీడీఎస్ఎల్‌), నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎస్ఎస్‌డీఎల్‌) నిర్దేశించిన విధానాన్ని అనుసరించి నామినీ వివ‌రాలు న‌మోదు చేయాలి.

ఒక‌వేళ నామినీ న‌మోదు చేయ‌కుండానే ఖాతాదారుడు మ‌రణిస్తే, వాటాలా బ‌దిలీ కోసం చ‌ట్ట‌ప‌ర‌మైన వార‌సులు చాలా క‌ష్ట‌ప‌డాలి. ఎక్కువ పేప‌ర్ వ‌ర్క్ అవ‌స‌ర‌మ‌వుతుంది. సంస్ధ అడిగిన అన్ని ప‌త్రాల‌ను ఇవ్వాల్సి ఉంటుంది.  ఖాతాలో ఉన్న షేర్ల విలువపై కూడా ఇది ఆధార‌ప‌డి ఉంటుంది. సెక్యూరిటీల విలువ రూ.5 ల‌క్ష‌లు, అంత‌కంటే త‌క్కువ ఉన్న‌ప్పుడు కంటే, రూ.5 ల‌క్ష‌లకు మించి ఉన్న‌ప్పుడు ఎక్కువ ప‌త్రాలు అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు. 

ఈ రెండు సంద‌ర్భాల‌లోనూ రెండు ప‌త్రాల‌ను త‌ప్ప‌నిస‌రిగా ఇవ్వాలి.  బ్రోక‌ర్ లేదా డిపాజిట‌రీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ట్రాన్స్‌మిష‌న్ అభ్యర్ధ‌న ఫార‌మ్‌ను చ‌ట్ట‌ప‌ర‌మైన వార‌సులు డౌన్‌లోడ్ చేసుకుని పూర్తి చేయాలి. ఈ ప‌త్రంతో పాటు గెజిటెడ్ అధికారి నోటరైజ్ చేసిన లేదా ధృవీకరించిన‌ మరణ ధృవీకరణ పత్రం స్టాక్ బ్రోకర్‌కు ఇవ్వాలి.

సెక్యూరిటీల విలువ రూ. 5 లక్షలు, అంతకంటే తక్కువ ఉంటే, చట్టబద్ధమైన వారసుడు ఈ కింది పత్రాలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది. నిర్ధిష్ట కేసు ఆధారంగా ప‌త్రాలు అడుగుతారు.  ఇండెమ్నిటీ బాండు, అఫిడవిట్, కుటుంబ‌ పరిష్కార దస్తావేజు. చట్టపరమైన వారసులలో ఒకరు బదిలీ కోసం దరఖాస్తు చేసుకుంటే, ఇతరులు నో అబ్జ‌క్ష‌న్ స‌ర్టిఫికెట్ అందించాలి.

షేర్ల విలువ రూ.5 ల‌క్ష‌ల కంటే ఎక్కువ అయితే, నిర్ధిష్ట కేసును బ‌ట్టి వారసత్వ ధృవీకరణ పత్రం-స‌క్సెష‌న్ స‌ర్టిఫికేట్ , అడ్మినిస్ట్రేష‌న్ లెట‌ర్‌, ఖాతాదారుని వీలునామా కాపీ స‌మ‌ర్పించాలి. వార‌స‌త్వ ధృవీక‌ర‌ణ ప‌త్రాన్ని న్యాయ‌స్థానం జారీ చేస్తుంది. కాబ‌ట్టి ఇందుకు స‌మ‌యం ప‌డుతుంది. 

చ‌ట్ట‌ప‌ర‌మైన వార‌సుల‌ను నామినీలుగా నియ‌మించ‌డం మంచిది. చ‌ట్ట ప్ర‌కారం నామిని ఆస్తుల సంర‌క్ష‌కుడు మాత్ర‌మే. చ‌ట్ట‌ప‌ర‌మైన వార‌సులే నిజ‌మైన య‌జ‌మానులు. అయితే, ఖాతాదారుని మ‌ర‌ణానంత‌రం డిపాజిట‌రీలు వాటాల‌ను నామినికి బ‌దిలీ చేస్తాయి. చ‌ట్ట‌ప‌ర‌మైన వార‌సులు, నామిని భిన్నంగా ఉంటే వివాదాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది. అందువ‌ల్ల సాధ్య‌మైనంత వ‌ర‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన వార‌సుల‌ను నామినీగా ఎంచుకోవ‌డం మంచింది. 

ఆన్‌లైన్ ద్వారా డీమ్యాట్ ఖాతాను తెరిచిన వారు, ఇప్ప‌టికీ నామినీని న‌మోదు చేయ‌క‌పోతే స్టాక్‌బ్రోక‌రుకు భౌతికంగా నామినేష‌న్ ఫారంను పంపడంలో ఆల‌స్యం చేయ‌ద్దు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని