2.29 కోట్ల క్లెయిముల పరిష్కారం

ఎల్‌ఐసీ ఆఫ్‌ ఇండియా 2020-21లో 2.29 కోట్ల క్లెయిములు పరిష్కరించి రూ.1.47 లక్షల కోట్లు చెల్లించింది. రెండు దశాబ్దాల క్రితం బీమా....

Published : 01 Sep 2021 06:21 IST

రూ.1.47 లక్షల కోట్ల చెల్లింపు

2020-21లో ఎల్‌ఐసీ ఘనత

ఈనాడు, హైదరాబాద్‌: ఎల్‌ఐసీ ఆఫ్‌ ఇండియా 2020-21లో 2.29 కోట్ల క్లెయిములు పరిష్కరించి రూ.1.47 లక్షల కోట్లు చెల్లించింది. రెండు దశాబ్దాల క్రితం బీమా రంగంలో పైవేటు సంస్థలకు ప్రవేశం కల్పించినా, ఎల్‌ఐసీయే అగ్రస్థానంలో కొనసాగుతోంది. సెప్టెంబరు 1వ తేదీ నాటికి ఈ సంస్థ 65 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకుని, 66 ఏట అడుగుపెడుతోంది. వివిధ విభాగాల్లో తాను అందిస్తున్న సేవలు, ఇతర ప్రత్యేకతలను ఎల్‌ఐసీ వివరించింది.

ప్రభుత్వ రంగ బీమా సేవల సంస్థగా ఎల్‌ఐసీ 1956లో రూ.5 కోట్ల మూలధనంతో ప్రారంభమైంది. ప్రస్తుతం సంస్థ అజమాయిషీలో రూ.38,04,610 కోట్ల నిధులున్నాయి. ‘బ్రాండ్‌ ఫైనాన్స్‌ ఇన్సూరెన్స్‌ 100’ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా అధిక విలువైన బ్రాండ్లలో ఎల్‌ఐసీ మూడో స్థానంలో ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో 2.10 కోట్ల కొత్త పాలసీలు విక్రయించి, రూ.1.84 లక్షల కోట్ల మొదటి సంవత్సర ప్రీమియం ఆదాయాన్ని ఆర్జించింది. దేశీయంగా మొదటి సంవత్సర ప్రీమియం ఆదాయంలో 66.18 శాతం, పాలసీల సంఖ్యలో 74.58 శాతం వాటా దీనికి ఉంది. దేశవ్యాప్తంగా 8 జోనల్‌, 113 డివిజనల్‌ కార్యాలయాలు, 2048 శాఖలు, లక్ష మందికి పైగా ఉద్యోగులు, 13.53 లక్షల ఏజెంట్లతో పాలసీదార్లకు సేవలు అందిస్తోంది. 32 రకాల పాలసీలను జారీ చేస్తోంది.

వినియోగదారులు సులువుగా ప్రీమియం చెల్లించడానికి వివిధ బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకోవడంతో పాటు డెబిట్‌/ క్రెడిట్‌/ ప్రీ-పెయిడ్‌ కార్డులు, నెట్‌ బ్యాంకింగ్‌, ఐఎంపీఎస్‌, వాలెట్లు, యూపీఐ, ద్వారా చెల్లింపుల సదుపాయాన్ని కల్పించింది. ప్రీమియం చెల్లింపుల్లో 75 శాతం డిజిటల్‌ పద్ధతుల్లో జరుగుతోంది. రద్దయిన పాలసీలను పురుద్ధరించుకునేందుకు ఆగస్టు 23 నుంచి అక్టోబరు 22 వరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. పాలసీదార్లు ఏ శాఖ లేదా శాటిలైట్‌ కార్యాలయంలో అయినా పాలసీ పునరుద్ధరణ దరఖాస్తు దాఖలు చేయొచ్చని ఎల్‌ఐసీ స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని