సత్వర వృద్ధికి అనువైన వ్యాపార రంగాలను గుర్తించాలి

దక్షిణాది రాష్ట్రాలు సత్వర వృద్ధి సాధించేందుకు అనువైన వ్యాపార రంగాలను గుర్తించాల్సిన అవసరం ఉందని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) - దక్షిణ ప్రాంత ఛైర్‌పర్సన్‌ సుచిత్ర ఎల్ల అన్నారు.

Updated : 02 Jul 2022 06:59 IST

దక్షిణాది రాష్ట్రాలకు సుచిత్ర ఎల్ల సూచన

చెన్నై: దక్షిణాది రాష్ట్రాలు సత్వర వృద్ధి సాధించేందుకు అనువైన వ్యాపార రంగాలను గుర్తించాల్సిన అవసరం ఉందని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) - దక్షిణ ప్రాంత ఛైర్‌పర్సన్‌ సుచిత్ర ఎల్ల అన్నారు. సులభతర వాణిజ్య ర్యాంకుల్లో దక్షిణాది రాష్ట్రాలు అగ్రభాగాన ఉండటంపై ఆమె అభినందనలు తెలియజేశారు. దక్షిణాది రాష్ట్రాలు 2025 నాటికి 1.5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే అవకాశం ఉందని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో సత్వర వృద్ధి సాధించటం లక్ష్యంగా అనువైన వ్యాపార రంగాలను ఎంపిక చేసుకుని, భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి కృషి చేయాలని సూచించారు. దక్షిణాది రాష్ట్రాల కోసం సీఐఐ ప్రత్యేకంగా ఒక టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని నియమించిందని, ఈ బృందం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోందని సీఐఐ- దక్షిణ ప్రాంత డిప్యూటీ ఛైర్మన్‌ కమల్‌ బాలి తెలిపారు. సీఐఐ- ఆంధ్రప్రదేశ్‌ ఛైర్మన్‌ నీరజ్‌ సర్దా, సీ ఐఐ- తెలంగాణ ఛైర్మన్‌ వగీష్‌ దీక్షిత్‌ స్పందిస్తూ, తమ తమ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు సులభతర వ్యాపార నిర్వహణకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాయని అన్నారు. తమిళనాడు ప్రభుత్వ విభాగాలతో విధాన నిర్ణయాల విషయంలో, ఇతర ముఖ్యమైన అంశాలకు సంబంధించి తాము ఎప్పటికప్పుడు సంప్రదింపులు సాగిస్తూ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నట్లు సీఐఐ- తమిళనాడు ఛైర్మన్‌ సత్యకమ్‌ ఆర్య తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని