గృహరుణం.. వడ్డీ రేట్లు పెరిగితే...

ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దీంతో వడ్డీ రేట్ల పెంపు అనివార్యం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నేడు ఆర్‌బీఐ పరపతి సమావేశంలో నిర్ణయం ఎలా ఉండబోతోందో అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు కాకున్నా.. రాబోయే

Updated : 08 Apr 2022 03:09 IST

ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దీంతో వడ్డీ రేట్ల పెంపు అనివార్యం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నేడు ఆర్‌బీఐ పరపతి సమావేశంలో నిర్ణయం ఎలా ఉండబోతోందో అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు కాకున్నా.. రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లు మారేందుకు అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో గృహరుణం భారం కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

రోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపడంతో రెండేళ్లుగా ఆర్‌బీఐ వడ్డీ రేట్లను అందరికీ అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నించింది. పరిస్థితులు మెరుగవడంతో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే ప్రయత్నాల్లో రెపో రేటును పెంచేందుకు అవకాశాలున్నాయి. బ్యాంకులు గృహరుణ వడ్డీ రేట్లకు రెపో రేటును ప్రామాణికంగా తీసుకుంటాయి. ఫలితంగా ఈ రేటు మారితే.. బ్యాంకులూ ఆ మేరకు రుణగ్రహీతలకు ఆ భారాన్ని బదిలీ చేస్తాయి.

ఉదాహరణకు రెపో రేటు 25 బేసిస్‌ పాయింట్లు పెరిగి, ప్రస్తుతం ఉన్న 4 శాతం నుంచి 4.25 శాతానికి మారిందనుకుందాం. రుణం తీరడానికి దీర్ఘకాలం ఉంటే.. ఇది రుణగ్రహీతలకు కాస్త భారమే. దీన్ని సాధ్యమైనంత మేరకు తగ్గించుకునేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

తక్కువ రేటుకు..

ఒకసారి గృహరుణ మార్కెట్‌ను పరిశీలించండి. ఇప్పుడు ఎన్నో సంస్థలు తమ వడ్డీ రేటు 6.95 శాతమే అని ప్రకటనలు ఇస్తున్నాయి. ఆదాయం, క్రెడిట్‌ స్కోరు, రుణం తదితర అంశాలను బట్టి, వడ్డీ రేటు ఎంత వర్తిస్తుందనేది ఆధారపడుతుంది. అయితే, మహిళలకు, ఉద్యోగులకు, క్రెడిట్‌ స్కోరు 750కి మించి ఉన్నవారికి, రూ.30లక్షల లోపు రుణం తీసుకోవాలనుకునే వారికే ఈ వడ్డీ రేటు వర్తిస్తుందని షరతులు విధిస్తాయి. మీరు చెల్లిస్తున్న వడ్డీ కన్నా.. 50 బేసిస్‌ పాయింట్లకు తక్కువ వడ్డీకి మారినప్పుడు భారం గణనీయంగా తగ్గుతుంది. కొన్నిసార్లు మీకు రుణం ఇచ్చిన బ్యాంకూ వడ్డీ రేటును తగ్గిస్తానని చెప్పొచ్చు. అప్పుడు ఆ బ్యాంకునే సంప్రదించి, తక్కువ వడ్డీ రేటుకు మారడం మేలు. ఇతర బ్యాంకులకు వెళ్తే ఖర్చులు అధికంగానే ఉండవచ్చు. మీ మిగులు మొత్తం, ఇప్పుడు అవుతున్న ఖర్చులను బేరీజు వేసుకొని, నిర్ణయం తీసుకోవాలి.

వాయిదా పెంచండి..

రుణం తీసుకున్న నాటితో పోలిస్తే ఇప్పుడు మీ ఆదాయం అధికంగానే ఉండొచ్చు. దీనికి అనుగుణంగా ఈఎంఐని పెంచుకోవడం వల్ల పెరుగుతున్న వడ్డీ భారాన్ని కొంతమేరకు తట్టుకునే వీలుంటుంది. తక్కువ వడ్డీ ఉన్న బ్యాంకుకు మారినప్పుడు మీ రుణ వాయిదా తగ్గుతుంది. దీన్ని ఉపయోగించుకోకుండా.. గతంలో చెల్లించిన ఈఎంఐనే కొనసాగించేలా చూసుకోండి. గత ఉదాహరణలో చెప్పినట్లు రూ.50లక్షల రుణానికి రూ.46,351 ఈఎంఐ చెల్లిస్తున్నారు. దీన్ని 5 శాతం పెంచుకున్నప్పుడు రూ.48,668 అవుతుంది. దీనివల్ల మీ రుణం 186 నెలలకు బదులు 170 నెలల్లోనే పూర్తవుతుంది. ఇలా ఏడాదికి 5 శాతం చొప్పున ఈఎంఐ పెంచుకుంటూ వెళ్తే మీరు త్వరగా రుణ విముక్తులవుతారు.

అప్పుడప్పుడూ..

మీరు చెల్లిస్తున్న ఈఎంఐని అలాగే కొనసాగిస్తూ.. అప్పుడప్పుడూ కొంత మొత్తాన్ని అసలులో జమ చేసేందుకు ప్రయత్నించాలి. మీ ఆర్థిక లక్ష్యాలకు పెట్టుబడులు కొనసాగిస్తూనే.. రుణాన్ని తొందరగా తీర్చేందుకున్న మార్గాలనూ అన్వేషించాలి. ఏటా నిర్ణీత తేదీ నాడు.. రుణ మొత్తంలో కనీసం 5 శాతాన్ని చెల్లించేలా ఏర్పాటు చేసుకోవాలి. రూ.50లక్షల్లో 5 శాతం అంటే.. రూ.2.50లక్షలు. ఇలా చేయడం వల్ల మీ రుణం 186 నెలలకు బదులు 97 నెలల్లోనే పూర్తవుతుంది. ఏటా మిగిలిన అసలు నిల్వపై 5 శాతం చొప్పున చెలిస్తూ వస్తే.. 120 నెలల్లో రుణం ముగుస్తుంది.

గృహరుణం దీర్ఘకాలిక ఒప్పందం. దీన్నుంచి సాధ్యమైనంత తొందరగా బయటపడేందుకు ప్రయత్నించాలి. అప్పుడే మిగతా లక్ష్యాలకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు కేటాయించే వెసులుబాటు కలుగుతుంది.


భారం ఎలా?

గృహరుణం వడ్డీ రేటు పెరిగినప్పుడు.. నెలవారీ వాయిదా (ఈఎంఐ) లేదా రుణ వ్యవధి అధికం అవుతుంది. ఉదాహరణకు.. మీరు రూ.50లక్షల రుణం తీసుకున్నారనుకుందాం. వడ్డీ రేటు 7.50శాతం. ఇంకా 15 ఏళ్లు వాయిదాలు చెల్లించాల్సి ఉంది. ఈఎంఐ రూ.46,351. ఇప్పటి నుంచి మిగిలిన వ్యవధికి రూ.33.43 లక్షల వడ్డీ చెల్లించాలి. ఇప్పుడు 25 బేసిస్‌ పాయింట్లు వడ్డీ పెరిగిందనుకోండి. వడ్డీ రేటు 7.75శాతం అవుతుంది. అప్పుడు వడ్డీ భారం రూ.2.46 లక్షలు పెరిగి, రూ.35.89 లక్షలు అవుతుంది. అంటే మీ రుణం తీరే వ్యవధి మరో ఆరు నెలలు (మొత్తం 186 నెలలు) పెరుగుతుందన్నమాట. లేదా వ్యవధి పెరగకుండా ఉంటే.. ఈఎంఐ రూ.47,063 చెల్లించాల్సి వస్తుంది. మొత్తం వడ్డీ రూ.1.28 లక్షలు అధికంగా రూ.34.71లక్షలకు చేరుతుంది. రుణ వ్యవధిని బట్టి, ఈ భారం మారుతూ ఉంటుంది.

- అధిల్‌ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని