Murder: ప్రియుడే హంతకుడు..

నంగనూరు మండలంలోని బద్దిపడగ శివారులో గతనెల 30న జరిగిన యువకుడి హత్య కేసును సిద్దిపేట, రాజగోపాలపేట పోలీసులు సంయుక్తంగా ఛేదించారు.

Updated : 11 Nov 2021 05:03 IST

యువకుడి హత్య కేసు ఛేదించిన పోలీసులు


ముగ్గురు నిందితులను చూపుతున్న సీఐ సురేందర్‌రెడ్డి

నంగునూరు, సిద్దిపేట అర్బన్‌, న్యూస్‌టుడే: నంగనూరు మండలంలోని బద్దిపడగ శివారులో గతనెల 30న జరిగిన యువకుడి హత్య కేసును సిద్దిపేట, రాజగోపాలపేట పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడనే అక్కసుతో ఇద్దరు స్నేహితులతో కలిసి హత్యకు పాల్పడినట్లు గుర్తించి ముగ్గురిని అరెస్టు చేశారు. సిద్దిపేట రూరల్‌ సీఐ సురేందర్‌రెడ్డి తెలిపిన వివరాలు... హుస్నాబాద్‌కు చెందిన గుర్రాల హరీశ్‌రెడ్డి అదే పట్టణానికి చెందిన యువతి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో పెళ్లి చేసుకునేందుకు యువకుడి తల్లిదండ్రులు అభ్యంతరపెట్టారు. దీంతో యువతి తల్లిదండ్రులు కోహెడ మండలం తంగళ్లపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్‌కు ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించారు. విషయం తెలుసుకున్న హరీశ్‌రెడ్డి, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ముందుకొచ్చిన రాజశేఖర్‌ను చంపాలనుకుని.. స్నేహితుడు సింగసారం నాగరాజుతో కలిసి ప్రణాళిక రూపొందించాడు. కారు అద్దెకు నడుపుతూ జీవినం సాగిస్తున్న యువకుడి ఫోన్‌ నంబరును ప్రేమించిన యువతి నుంచి తీసుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు కారు కావాలని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారు. వారి సూచన మేరకు రాజశేఖర్‌ అక్టోబరు 29న తన తవేరా వాహనంలో కొహెడ మండలం ఆరెపల్లికి వచ్చాడు. ముందస్తు ప్రణాళికలో భాగంగా అప్పటికే హుస్నాబాద్‌లో కత్తులు, సర్జికల్‌ మాస్కులు, గ్లౌసులు కొనుగోలు చేసిన హరీశ్‌రెడ్డి స్నేహితుడు నాగరాజుతో కలిసి వాహనం ఎక్కారు. మరికొందరు నంగునూరు మండలం బద్దిపడగలో ఎక్కుతారని చెప్పగా రాజశేఖర్‌ అటువైపు మళ్లించాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో రంగధాంపల్లి క్రాస్‌ రోడ్డుకు వెళ్లాలని చెప్పారు. మార్గమధ్యలో చంపాలని భావించినా వీలు కాకపోవడంతో విమానాశ్రయానికి వచ్చేవారు బద్దిపడగలో ఉన్నారని చెప్పి వాహనాన్ని వెనక్కి మళ్లించారు. బద్దిపడగ శివారులో మూత్రవిసర్జన నిమిత్తం వాహనాన్ని ఆపాలని చెప్పి, రాజశేఖర్‌ను దారుణంగా హతమార్చారు. అనంతరం హరీశ్‌రెడ్డి తన స్నేహితుడు ఇల్లందుల శివకు ఫోన్‌ చేయగా.. అతను ద్విచక్ర వాహనంపై వచ్చి ఇద్దరిని తీసుకుని హుస్నాబాద్‌ చేరుకున్నారు. మార్గమధ్యలో రాజశేఖర్‌ హత్యకు ఉపయోగించిన కత్తులు, వారితో పాటు ఉన్న సెల్‌ఫోన్లను బస్వాపూర్‌ వాగులో పడేశారు. ఈనేపథ్యంలో సీఐ ఆధ్వర్యంలో రాజగోపాలపేట ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి, పీఎస్‌ఐ తేజస్విణి, సిద్దిపేట రూరల్‌ ఎస్‌ఐ శంకర్‌, ఎస్‌హెచ్‌ఓ గణేష్‌, సిబ్బందితో కలిసి దర్యాప్తు చేశారు. తవేరా వాహనం నంబరు ఆధారంగా మృతుడిని గుర్తించారు. అనంతరం అతని సెల్‌ఫోన్‌కు వచ్చిన కాల్స్‌ ఆధారంగా హరీశ్‌రెడ్డితోపాటు నాగరాజు, శివను హంతకులుగా తేల్చారు. మంగళవారం హుస్నాబాద్‌లో ఓ ఇంట్లో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు సీఐ తెలిపారు. వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు