అనిశాకు చిక్కిన సంగారెడ్డి డీఈవో

సంగారెడ్డి జిల్లా విద్యాధికారి(డీఈవో) నాంపల్లి రాజేశ్‌ అవినీతి నిరోధక శాఖ(అనిశా)కు చిక్కారు. సీనియర్‌ అసిస్టెంట్‌ ద్వారా ఒక ప్రైవేటు పాఠశాల యాజమాన్యం నుంచి రూ.50 వేలను లంచంగా తీసుకుంటూ పట్టుబడ్డారు.

Updated : 25 Mar 2023 06:12 IST

ఎన్‌వోసీకి రూ.1.10 లక్షల డిమాండ్‌
రూ.50 వేలు తీసుకుంటూ దొరికిన వైనం

ఈనాడు, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా విద్యాధికారి(డీఈవో) నాంపల్లి రాజేశ్‌ అవినీతి నిరోధక శాఖ(అనిశా)కు చిక్కారు. సీనియర్‌ అసిస్టెంట్‌ ద్వారా ఒక ప్రైవేటు పాఠశాల యాజమాన్యం నుంచి రూ.50 వేలను లంచంగా తీసుకుంటూ పట్టుబడ్డారు. అనిశా మెదక్‌ రేంజ్‌ డీఎస్పీ ఆనంద్‌ తెలిపిన ప్రకారం... రామచంద్రాపురం మండలానికి చెందిన ఒక ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ఎస్సెస్సీ సిలబస్‌ నుంచి ఐసీఎస్‌ఈకి మారాలనుకుంది. నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) కోసం అవసరమైన అన్ని ధ్రువపత్రాలను సమర్పించింది. ఎంఈవో సంబంధిత దస్త్రాన్ని జిల్లా కార్యాలయానికి పంపారు. ఈ పని పూర్తి చేయడానికి రూ.1.10 లక్షలు లంచమివ్వాలంటూ డీఈవో రాజేశ్‌ డిమాండ్‌ చేశారు. అంగీకరించని పాఠశాల యజమాని ఈ నెల 15న అనిశాను సంప్రదించారు. వారి సూచనల మేరకు, రెండు విడతలుగా లంచం ఇస్తానని డీఈవోను ఒప్పించారు. శుక్రవారం మధ్యాహ్నం రూ.50 వేలు తీసుకొని సంగారెడ్డి డీఈవో కార్యాలయానికి వెళ్లి, విధుల్లో ఉన్న సీనియర్‌ అసిస్టెంట్‌ రామకృష్ణగౌడ్‌కు అందించారు. ఆ సమయంలో రాజేశ్‌ అక్కడే ఉన్నారు. డబ్బులు తీసుకోగానే అనిశా డీఎస్పీ ఆనంద్‌తోపాటు ఇన్‌స్పెక్టర్లు వెంకట్‌రాజ్‌, నాగేష్‌, శ్రీనివాస్‌, రమేష్‌లు నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తర్వాత వారిద్దరి ఇళ్లలోనూ తనిఖీలు చేశారు.

నాంపల్లి రాజేశ్‌ 2016-18 వరకు నిజామాబాద్‌ డీఈవోగా పనిచేశారు. అప్పట్లో మరికొన్ని రోజుల్లో ప్రాంతీయ సంయుక్త సంచాలకులు(ఆర్‌జేడీ)గా పదోన్నతి వస్తుందనగా.. నిజామాబాద్‌ జిల్లా ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆయనపై అవినీతి ఆరోపణలు చేశారు. విచారణలో వాస్తవాలు వెలుగుచూడటంతో రాజేశ్‌ను 2018 అక్టోబరులో బాధ్యతల నుంచి తప్పించి, హైదరాబాద్‌ ప్రధాన కార్యాలయానికి అటాచ్‌ చేశారు. తర్వాత 2020లో సంగారెడ్డి డీఈవోగా నియమించారు. త్వరలోనే ఆర్‌జేడీగా పదోన్నతి వచ్చేందుకు అవకాశముందని భావిస్తుండగా, మరోసారి అనిశాకు దొరకడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని