Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్‌ ఇచ్చిన సుప్రీం

Arvind Kejriwal: మద్యం కేసులో దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

Updated : 10 May 2024 16:05 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు భారీ ఊరట లభించింది. మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసు (Delhi Excise Policy Scam Case)లో సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఆయనకు జూన్‌ 1 వరకు బెయిల్‌ ఇస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. రూ.50వేల పూచీకత్తు, అంతే మొత్తానికి ఒకరి ష్యూరిటీపై ఈ బెయిలిచ్చింది.

కేజ్రీవాల్‌కు జూన్‌ 5వ తేదీ వరకు (ఎన్నికల ఫలితాల మరుసటిరోజు) మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలంటూ సీఎం తరఫు న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ చేసిన అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది. జూన్‌ 2న ఆయన లొంగిపోయి తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది. ఈ సందర్భంగా కొన్ని షరతులు విధించింది. సీఎం కార్యాలయానికి గానీ.. దిల్లీ సచివాలయానికి గానీ వెళ్లొద్దని సూచించింది. మద్యం కేసులో తనపై వచ్చిన అభియోగాల గురించి కూడా మాట్లాడొద్దని స్పష్టం చేసింది. కేసుకు సంబంధించిన అధికారిక ఫైళ్లను చూడొద్దని, సాక్షులతో మాట్లాడొద్దని తెలిపింది. తీర్పు అనంతరం సీఎం తరఫు న్యాయవాదులు మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంపై కోర్టు ఎలాంటి ఆంక్షలు విధించలేదని తెలిపారు. నేటి సాయంత్రంలోగా కేజ్రీవాల్‌ జైలు నుంచి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు, కేజ్రీవాల్‌ అభ్యర్థనను ఈడీ వ్యతిరేకించగా కోర్టు అసహనం వ్యక్తంచేసింది. ఎన్నికల ప్రచారం కారణంతో ఆయనను విడుదల చేయడం సరికాదని దర్యాప్తు సంస్థ కోర్టుకు విన్నవించింది. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ఏడాదిన్నర నుంచి ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నారు. కానీ మార్చిలో ఆయనను అరెస్టు చేశారు. ఇప్పుడు ఈ 21 రోజులు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసినంత మాత్రాన పెద్దగా తేడా ఏం ఉండదు’’ అని వ్యాఖ్యానించింది.

ఈడీ ఛార్జ్‌షీట్‌ నిందితుల జాబితాలో ఆప్‌ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు

మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు ఈ కేసులో విచారణకు రావాలంటూ దర్యాప్తు సంస్థ తొమ్మిదిసార్లు సమన్లు జారీ చేసింది. వాటికి స్పందించకపోవడంతో అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన తిహాడ్‌ జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉంటున్నారు. ఇదిలాఉండగా.. తన అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల కోసం మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని అభ్యర్థించారు.

దీనిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం.. ‘‘ఇది అసాధారణ పరిస్థితి. అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రజలు ఎన్నుకున్న ఓ ముఖ్యమంత్రి. తరచూ నేరాలు చేసే వ్యక్తి కాదు. లోక్‌సభ ఎన్నికలు ఐదేళ్లకోసారి వస్తాయి. పార్టీ అధినేతగా ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది’’ అని వ్యాఖ్యానించింది. అయితే, ఒకవేళ మధ్యంతర బెయిల్‌పై విడుదలైతే సీఎంగా బాధ్యతలు నిర్వర్తించకూడదని తెలిపింది. ఫైళ్లపై ఎలాంటి సంతకాలు చేయొద్దని సూచించింది. అలా చేస్తే ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటుందని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని