Train Ticket refund: రిఫండ్లు చకచకా.. 6 గంటల్లోనే క్యాన్సిల్‌ టికెట్ల సొమ్ము!

Train Ticket: రైల్వే టికెట్లకు సంబంధించిన రిఫండ్ల సొమ్ము ఇప్పుడ వేగంగా జమ అవుతోంది.ఒక రోజులోనే ఆయా ఖాతాల్లో పడుతున్నాయి. 

Published : 10 May 2024 13:46 IST

Train Ticket | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏదైనా కారణంతో ఆన్‌లైన్‌లో బుక్‌ చేసిన ట్రైన్‌ టికెట్‌ను క్యాన్సిల్‌ చేస్తే ఆ సొమ్ము వెనక్కి రావడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. ఒకవేళ వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉండీ చివరి నిమిషంలో ఇ-టికెట్‌ రద్దయిన సందర్భంలోనూ ఇదే పరిస్థితి. సాధారణంగా రైల్వే టికెట్లు బుక్‌ చేసేవారికి తరచూ ఎదురయ్యే సమస్యే ఇది. దీని పరిష్కారానికి రైల్వే (Indian Railways) కొంతకాలం క్రితమే నడుం బిగించింది. తాజాగా ఆ రిఫండ్ల ప్రక్రియను వేగవంతం చేసింది. క్యాన్సిల్‌ చేసుకుంటున్న ఇ- టికెట్లకు సంబంధించి దాదాపు 50 శాతం రిఫండ్లను కేవలం ఆరు గంటల్లోనే సెటిల్ చేస్తున్నట్లు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. రద్దు చేసుకున్న ఇ-టికెట్లతో పాటు టీడీఆర్‌ ఫైలింగ్‌ విషయంలోనూ 98 శాతం క్లెయిమ్‌లను ఒకరోజులోనే పరిష్కరిస్తున్నట్లు తెలుస్తోంది.

సాధారణంగా రైల్వే టికెట్‌ను క్యాన్సిల్‌ చేసుకున్నప్పుడు, వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న సందర్భంలో క్యాన్సిల్‌ అయినప్పుడు రిఫండ్లకు కనీసం 3-4 రోజుల గడువు పడుతోంది. టికెట్‌ డిపాజిట్‌ రిసీట్‌ (TDR) విషయంలో మరింత ఎక్కువ సమయం పడుతోంది. మానవ సంబంధం లేకుండా అన్నీ ఆటోమేటిక్‌గా జరుగుతున్న వేళ.. రిఫండ్ల జారీకి మాత్రం ఎందుకింత ఆలస్యం జరుగుతోందన్న ప్రశ్న ప్రయాణికుల నుంచి ఉత్పన్నం అవుతోంది. దీంతో రిఫండ్ల జారీని రైల్వే వేగవంతం చేసింది. వేసవి రద్దీ నేపథ్యంలో రైల్వే తాజా నిర్ణయం ప్రయణికులకు ఊరట కల్పించేదే.

ఏసీ పనిచేయకపోతే రీఫండ్‌ కోరొచ్చు.. TDR గురించి ఈ విషయాలు తెలుసా?

టీడీఆర్‌కు సుదీర్ఘ సమయం..

సాధారణంగా TDR ఫైల్‌ చేసేటప్పుడు రిఫండ్లు రావడానికి చాలా సమయమే పట్టేది. ఇందుకోసం IRCTC వెబ్‌సైట్‌ లేదా యాప్‌లో TDRను ఫైల్‌ చేస్తే.. ఆ వినతి సంబంధిత రైల్వే జోనల్‌ కార్యాలయానికి చేరుతుంది. దాన్ని టీటీఈ ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ సుదీర్ఘ సమయం తీసుకునేది. అయితే, ఒకప్పటిలా కాకుండా టీటీఈల వద్ద ట్యాబ్‌ లాంటి పరికరాలు వచ్చాయి. దీంతో టీటీఈ ఎంటర్‌ చేసిన సమాచారం ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ ద్వారా  నమోదవుతోంది. ఒకవేళ ఎవరైనా టీడీఆర్‌ ఫైల్‌ చేస్తే కొన్ని గంటల్లోనే సమాచారాన్ని ధ్రువీకరించుకుని రిఫండ్లు జారీ చేస్తున్నట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు