Karnataka: పక్క పక్కన కూర్చున్నారని చితకబాదారు!

రెండు వేర్వేరు మతాలకు చెందిన స్త్రీ పురుషులు పక్కపక్కన కూర్చున్నారన్న కారణంలో ఓ అల్లరిమూక రెచ్చిపోయింది. వారిపై భౌతికదాడికి దిగింది.

Published : 09 Jan 2024 03:42 IST

బెంగళూరు: రెండు వేర్వేరు మతాలకు చెందిన స్త్రీ పురుషులు పక్కపక్కన కూర్చున్నారన్న కారణంలో ఓ అల్లరిమూక రెచ్చిపోయింది. వారిపై రాడ్డులతో దాడి చేసి హింసించింది. కర్ణాటకలోని బెళగావిలో శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాధితులిద్దరూ ఓ ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేసేందుకు వచ్చారు. బెళగావిలోని ఓ సరస్సు ఒడ్డున కూర్చున్నారు. అది గమనించిన దాదాపు 17 మంది అక్కడికి వచ్చి.. ఇక్కడేం పని అని వారిని ప్రశ్నించారు. ఇద్దరూ వేర్వేరు మతాలకు చెందిన వారని తెలుసుకొని వారిపై భౌతిక దాడికి దిగారు. వారి బంధువులు వచ్చేంత వరకు వదిలిపెట్టలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నట్లు తెలిపారు. 

‘‘ సరస్సు ఒడ్డున ఉన్న మా దగ్గరి వచ్చిన 17 మంది మమ్మల్ని దుర్భాషలాడారు. ఆమె వరుసకు సోదరి అవుతుందని చెబుతున్నా వినిపించుకోలేదు. ఓ గదిలోకి తీసుకెళ్లి ఇష్టమొచ్చినట్లు కొట్టారు. ఆమె నా పినతల్లి కూతురని చెప్పినా వినలేదు. వేర్వేరు మతాలకు చెందిన వారు అన్నాచెల్లెళ్లు ఎలా అవుతారంటూ నీచంగా మాట్లాడారు. ఆమె తండ్రి వేరే మతానికి చెందినవారు కావడంతో.. దానిని ఆచరిస్తోందని చెప్పినా పట్టించుకోలేదు. మా ఇద్దరి మొబైల్స్‌ను తీసుకున్నారు. రూ.7 వేల నగదు ఉంటే దానిని కూడా లాక్కున్నారు’’ అని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని